27, ఆగస్టు 2020, గురువారం

నరేంద్రమోదీకి చైనాలో భారీగా ఫ్యాన్స్... చైనా సొంత మీడియా సర్వేలో వెల్లడైన నిజం

 

ఇండియా, చైనా జెండాలు

‘ది గ్లోబల్ టైమ్స్’.. చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ కనుసన్నల్లో నడిచే పత్రిక. ఆ పత్రిక తాజాగా భారత్-చైనాల సంబంధాలపై చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

భారత్, నరేంద్ర మోదీ గురించి చైనా ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే చేయగా 50 శాతం కంటే ఎక్కువ మంది సానుకూలత చూపారు.

భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ‘ది గ్లోబల్ టైమ్స్’, చైనా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్(సీఐసీఐఆర్)లు చైనాలో 1960 మందితో మాట్లాడి చేపట్టిన అభిప్రాయ సేకరణలో సగానికంటే ఎక్కువ మంది భారత్, భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే మంచి అభిప్రాయమే వ్యక్తం చేశారు.

సర్వేల్లో పాల్గొన్న చైనీయుల్లో 53.5 శాతం మంది భారత్ అంటే తమకు సానుకూల అభిప్రాయం ఉందని చెప్పగా, భారత ప్రధాని నరేంద్రమోదీపై 50.7 శాతం మంది సానుకూలత వ్యక్తంచేశారు.

లద్దాఖ్ వద్ద సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు మధ్య ఘర్షణ జరగగా, ఆ తరువాత రెండు దేశాల సైనికాధికారులు, విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి. 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినా ప్రతిష్టంబన కొనసాగుతున్న తరుణంలో ‘ది గ్లోబల్ టైమ్స్’ అనేక అంశాలపై సర్వే చేసింది. భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంట్, భారత్ సైనిక సామర్థ్యం వంటి అంశాలపైనా ఈ సర్వేలో చైనీయులు తమ అభిప్రాయాలు తెలిపారు.

వీటన్నిటినీ క్రోడీకరించి గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అయితే, ట్విటర్‌లో ఆ పత్రిక పోస్ట్ చేసిన ఇన్ఫోగ్రాఫిక్‌లో భారత్, మోదీ పట్ల చైనీయుల సానుకూలతకు సంబంధించిన డాటాను చూపించినప్పటికీ కథనంలో మాత్రం ఆ విషయం ప్రస్తావించలేదు. 

గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన సర్వే రిపోర్ట్


చైనాపై కోపం ఏ రేంజ్‌లో ఉందనుకుంటున్నారు

భారత్ ఆర్థికపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతుందా అన్న ప్రశ్నకు 49.6 శాతం మంది అవునని చెప్పగా 27.1 శాతం మంది ఆ వాదనతో ఏకీభవించలేదు. 23.3 శాతం మంది దీనిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు.

ప్రస్తుతం భారత్‌తో యాంటీ చైనా సెంటిమెంట్ రగులుతోందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 70.8 శాతం మంది నుంచి అవునన్న సమాధానం వచ్చింది.

15.2 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. 


ఇండియన్ ఆర్మీ అంటే చైనా భయపడుతోందా

ఇక భారత సైనిక బలగాల వల్ల చైనాకు ముప్పు ఉందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 30.9 శాతం మంది అవుననే చెప్పారు. 

57.1 శాతం మంది అలాంటి ముప్పేమీ ఉండదన్నారు. 

12 శాతం మంది దీనిపై నిర్దిష్ట అభిప్రాయం వ్యక్తం చేయలేదు.


చైనా, భారత్ సంబంధాలకు అడ్డుగోడలేమిటి?

రెండు దేశాల మధ్య సంబంధాలలో అతి పెద్ద అవరోధమేంటన్న ప్రశ్నకు అత్యధికుల నుంచి వచ్చిన సమాధానం సరిహద్దు వివాదం. సరిహద్దు వివాదమే రెండు దేశాల మధ్య సంబంధాలకు అడ్డుగోడ అని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు.

24.5 శాతం మంది అమెరికా జోక్యం వల్ల కూడా చైనా, భారత్‌ల సంబంధాలు దెబ్బతింటున్నాయన్నారు.

చైనా పట్ల భారత్ విద్వేషం చూపడం వల్లే సంబంధాలు దెబ్బతింటున్నాయని 22.7 శాతం మంది.. శత్రుదేశంగా భావించడం వల్ల అని 10.7 శాతం మంది చెప్పారు.

వాణిజ్య రక్షణాత్మకతను 4.8 శాతం.. టిబెట్ అంశాన్ని 4 శాతం మంది కారణంగా చెప్పారు.


చైనా వస్తువుల బహిష్కరణపై ఎలా ఫీలవుతున్నారు

చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు.. చైనా సంస్థలపై నిషేధంపై 35.3 శాతం మంది తీవ్రంగా స్పందించారు. చైనా ప్రతీకార చర్యలకు దిగాల్సిందేనన్నారు.

29.3 శాతం మంది మాత్రం భారత్ ఈ విషయంలో సీరియస్‌గా ఏమీ లేదని.. పెద్దగా పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఇది పెద్ద సమస్యేనని.. దీనిపై దృష్టిపెట్టాలని 23.2 శాతం మంది చెప్పారు.


చైనాను దాటాలంటే భారత్ ఎన్నాళ్లు పడుతుంది..?

భారత్ అన్ని రంగాల్లో చైనాను అధిగమించాలంటే ఎంత కాలం పడుతుందని ఈ సర్వేలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు.

భారత్ ఎన్నటికీ అధిగమించలేదని 54 శాతం మంది చెప్పగా.. వందేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని 10.4 శాతం మంది చెప్పారు.

పదేళ్లలోపేనని 3.9 శాతం మంది.. 20 ఏళ్లు చాలని 8.1 శాతం మంది, 50 ఏళ్లలో అధిగమించొచ్చని 8.7 శాతం మంది.. 100 ఏళ్లు పట్టొచ్చని 5.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

Read Our Exclusives:

 ఆంధ్రప్రదేశ్: నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన ఆ 4 పనులు ఏమిటి 

Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి? 

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం 

ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి