31, ఆగస్టు 2020, సోమవారం

ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్ ముఖర్జీ


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి కిందట మృతి చెందారు.

ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.

సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈమేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి ఆయన మరణించారు.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.


భారత రత్న పురస్కారం ప్రదానం చేసిన మోదీ ప్రభుత్వం

ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్)లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.

చిరు దివ్వెల నుంచి షాండ్లియర్స్ వరకు

"బెంగాల్‌లోని ఒక చిన్న దీపపు వెలుగు నుంచి దిల్లీ షాండ్లియర్ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను" అని తన జీవన ప్రయాణాన్ని ఆయన ఓ సందర్భంలో వివరించారు.

కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి

ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభలో కొనసాగారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు.

కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు.

ఇండియన్ ఎకానమీకి మొదటి రిఫార్మర్

భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు.

1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు.

అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు.

ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.

2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు.

మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.

ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు.

భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు.

కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోనే..

ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.

కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో "థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014), ద టర్బులెంట్ ఇయర్స్ (2016), కొయిలేషన్ యియర్స్ (2017) విమర్శకుల ప్రశంసలు పొందాయి.



చైనా, భారత్ ఘర్షణ: మళ్లీ ఆక్రమణలకు తెగబడిన చైనా.. తిప్పికొట్టిన భారత్

 

చైనా సైన్యం (ఇమేజ్ క్రెడిట్ గ్లోబల్ టైమ్స్)

చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. రెండు నెలల కిందట గల్వాన్ లోయలో ఘర్షణ తరువాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా వివిధ స్థాయిల్లో చర్చలు జరగడంతో బలగాల ఉపసంహరణ, కొన్ని కొత్త ఒప్పందాలు జరిగాయి.

అయితే.. ఈ ఒప్పందాలను పక్కనపెడుతూ చైనా మరోసారి భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో ఇండియన్ ఆర్మీ ఆ యత్నాలను అడ్డుకుంది. 

పాంగాంగ్ సో సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ మళ్లీ యాక్టివిటీ పెంచి సరిహద్దులను అతిక్రమించే చర్యలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించగా ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది.

ఇంతకుముందు పాంగాగ్ సరస్సుకు ఉత్తర వైపు గడబిడ సృష్టించి చైనా ఈసారి భారత సైన్యం దృష్టి మళ్లిస్తూ సరస్సు దక్షిణ వైపు ఆక్రమణలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో మరోసారి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఇండియన్ ఆర్మీ ఘర్షణ జరిగినట్లు ప్రకటించలేదు.. చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినట్లు మాత్రమే తెలిపింది.

గత గల్వాన్ ఘర్షణ కానీ ప్రస్తుత ఘర్షణ కానీ అంతా పాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి.

పాంగాంగ్ సో సరస్సు Pangong Tso


పాంగాంగ్ సరస్సు కథేంటి?

భారత్, చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు ఉంది. టిబెట్‌లో దీన్ని సో న్యాక్ అని.. చైనాలో సోమో గాంగ్లా రింగ్పో అంటారు.

5 కిలోమీటర్ల వెడల్పు  134 కిలోమీటర్ల పొడవు ఉన్న దీని విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్లు ఉంది.

అయితే, ఇందులో సుమారు 60 శాతం సరస్సు ప్రాంతం టిబెట్ భూభాగంలో ఉంది. 

శీతాకాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది.

చుట్టూ భూభాగమే ఉండి, సముద్రంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఇది ఉప్పు నీటి సరస్సు. అయితే, ఇందులో తూర్పు ప్రాంతం చాలా తక్కువ లవణత కలిగి ఉంటుంది.. దాదాపు మంచినీరులాగే ఉంది. కానీ, సరస్సులో పశ్చిమ ప్రాంతాన మాత్రం లవణ గాఢత ఎక్కువగా ఉంటుంది. 

భారత్ వైపు ఉన్న ప్రాంతంలో చేపలు వంటి నీటి జీవులు చాలా తక్కువ.. టిబెట్ వైపు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అయితే, ఈ సరస్సు కేంద్రంగా అనేక పక్షి జాతులు ఉన్నాయి. 

సింధునది ఉపనది అయిన శ్యోక్ నది ఒకప్పుడు ఈ సరస్సుకు నీరందించేది కానీ కాలక్రమేణా సరస్సుకు, శ్యోక్ నదికి లింక్ తెగిపోయింది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి రెండు సెలయేర్లు ఈ సరస్సులోకి ప్రవహిస్తుంటాయి.


ఎవరికి ఎంతవరకు పట్టుంది

భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ కొంత భాగం ఈ సరస్సు మీదుగా వెళ్తుంది. అయితే, ఇక్కడ రెండు దేశాల మధ్య సరిహద్దులు కచ్చితంగా నిర్ణయించుకోకపోవడంతో ఎవరికివారు తమదంటే తమదంటూ కొంత ప్రాంతం విషయంలో వాదిస్తుంటారు. పాంగాంగ్ సో సరస్సు తీరం వెంబడి ఉన్న పర్వత బంజర్లు ఉంటాయి. వీటిని ఫింగర్లు అంటారు. భారత వాదన ప్రకారం ఫింగర్ 8 వరకు మన భూభాగమే. కానీ, చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటుంది.

అయితే, భారత్ ఫింగర్ 8 వరకు తమదే అంటున్నా ఫింగర్ 4 వరకు మాత్రమే సైనిక నియంత్రణ ఉంది. అటు చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటున్నా పింగర్ 4 వరకు సైనిక నియంత్రణ ఉంది. 

చాలాకాలంగా ఫింగర్ 4 వరకు ఇటు భారత్, అటు చైనా సైన్యాల సంచారం ఉన్నా ఇప్పుడు చైనా ఫింగర్ 2 దాటి భారత్ సైన్యం రాకుండా అడ్డుపడుతుండడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి.

కార్గిల్ యుద్ధం సమయంలో భారత్ పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని బలగాలను కొంత పాక్ సరిహద్దుకు తీసుకెళ్లినప్పుడు అదే అదనుగా చైనా ఫింగర్ 4 దాటి రోడ్డు నిర్మాణాలకు ప్రయత్నించింది. ఇప్పుడు ఫింగర్ 2 వరకు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Our Exclusives:

ప్రణబ్ ముఖర్జీ: మరింత క్షీణించిన మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం

ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.

Read Our Exclusives:

28, ఆగస్టు 2020, శుక్రవారం

లాక్‌డౌన్: ముంబయి ప్రజలపై ఒత్తిడి విపరీతం.. చెన్నైలో కొంత నయం.. విద్యార్థులకు సంతోషం తగ్గిపోయింది.. ప్రజలకు నిద్ర పట్టలేదు

ఒత్తిడి, స్ట్రెస్

ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, సైకాలజీ, స్ట్రెస్, నీట్, ఎగ్జామ్స్

కరోనావైరస్, లాక్‌డౌన్ కాలంలో మనుషులపై ఒత్తిడి ఏ స్థాయిలో పెరిగిందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ముంబయి ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అందుకు భిన్నంగా చెన్నై ప్రజలు తక్కువ ఒత్తిడికి గురయ్యారట.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మద్య 8,396 మందిపై ఈ సర్వే చేశారు. యువర్ దోస్త్ అనే ఆన్‌లైన్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫాం ఈ సర్వే చేపట్టింది. ఇందులో ముంబయి ప్రజానీకంలో ఒత్తిడి స్థాయి 48 శాతం పెరిగినట్లు గుర్తించారు. దేశంలో మరే నగరంలోనూ ప్రజలు ఈ స్థాయిలో ఒత్తిడికి గురి కావడం లేదు.

బెంగళూరులో 37 శాతం, దిల్లీలో 35 శాతం, చెన్నైలో 23 శాతం ఒత్తిడి స్థాయి పెరిగినట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే లాక్ డౌన్ కారణంగా 65 శాతం మందిపై ఒక మాదిరి నుంచి తీవ్ర స్థాయి వరకు ఒత్తిడి ఉందని గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో జనాల్లో ఒత్తిడి ఒక్కటే కాదు కోపం కూడా బాగా పెరిగిపోయిందట. అదే సమయంలో సంతోషం తగ్గిందని తేలింది.

ప్రజల్లో కోపం 33 శాతం పెరిగిందని.. సంతోషం 6 శాతం తగ్గిందని గుర్తించారు. 

59 శాతం మందిలో వర్క్, లైఫ్ బ్యాలన్స్ కూడా తప్పినట్లు గుర్తించారు.


విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి 

ఎక్కువగా విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగినట్లు ఈ సర్వే గుర్తించింది. వారిలో  అంతకు ముందు కంటే 39 శాతం ఒత్తిడి స్థాయి పెరగ్గా ఉద్యోగుల్లో 35 శాతం ఒత్తిడి స్థాయి పెరిగిందట. 

లాక్ డౌన్ పొడిగిస్తున్నకొద్దీ విద్యార్థుల్లో కోపం, యాంగ్జైటీ ఎక్కువైందని.. అదే సమయంలో వారిలో ఆనందం తగ్గిపోయిందని సర్వేలో గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో ప్రజల్లో ఉద్వేగం వల్ల ఆవేశం 22 శాతం పెరిగిందని.. నిద్ర 11 శాతం తగ్గిపోయిందని సర్వే గుర్తించింది. 

Read Our Exclusives:

27, ఆగస్టు 2020, గురువారం

నరేంద్రమోదీకి చైనాలో భారీగా ఫ్యాన్స్... చైనా సొంత మీడియా సర్వేలో వెల్లడైన నిజం

 

ఇండియా, చైనా జెండాలు

‘ది గ్లోబల్ టైమ్స్’.. చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ కనుసన్నల్లో నడిచే పత్రిక. ఆ పత్రిక తాజాగా భారత్-చైనాల సంబంధాలపై చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

భారత్, నరేంద్ర మోదీ గురించి చైనా ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే చేయగా 50 శాతం కంటే ఎక్కువ మంది సానుకూలత చూపారు.

భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ‘ది గ్లోబల్ టైమ్స్’, చైనా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్(సీఐసీఐఆర్)లు చైనాలో 1960 మందితో మాట్లాడి చేపట్టిన అభిప్రాయ సేకరణలో సగానికంటే ఎక్కువ మంది భారత్, భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే మంచి అభిప్రాయమే వ్యక్తం చేశారు.

సర్వేల్లో పాల్గొన్న చైనీయుల్లో 53.5 శాతం మంది భారత్ అంటే తమకు సానుకూల అభిప్రాయం ఉందని చెప్పగా, భారత ప్రధాని నరేంద్రమోదీపై 50.7 శాతం మంది సానుకూలత వ్యక్తంచేశారు.

లద్దాఖ్ వద్ద సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు మధ్య ఘర్షణ జరగగా, ఆ తరువాత రెండు దేశాల సైనికాధికారులు, విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి. 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినా ప్రతిష్టంబన కొనసాగుతున్న తరుణంలో ‘ది గ్లోబల్ టైమ్స్’ అనేక అంశాలపై సర్వే చేసింది. భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంట్, భారత్ సైనిక సామర్థ్యం వంటి అంశాలపైనా ఈ సర్వేలో చైనీయులు తమ అభిప్రాయాలు తెలిపారు.

వీటన్నిటినీ క్రోడీకరించి గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అయితే, ట్విటర్‌లో ఆ పత్రిక పోస్ట్ చేసిన ఇన్ఫోగ్రాఫిక్‌లో భారత్, మోదీ పట్ల చైనీయుల సానుకూలతకు సంబంధించిన డాటాను చూపించినప్పటికీ కథనంలో మాత్రం ఆ విషయం ప్రస్తావించలేదు. 

గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన సర్వే రిపోర్ట్


చైనాపై కోపం ఏ రేంజ్‌లో ఉందనుకుంటున్నారు

భారత్ ఆర్థికపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతుందా అన్న ప్రశ్నకు 49.6 శాతం మంది అవునని చెప్పగా 27.1 శాతం మంది ఆ వాదనతో ఏకీభవించలేదు. 23.3 శాతం మంది దీనిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు.

ప్రస్తుతం భారత్‌తో యాంటీ చైనా సెంటిమెంట్ రగులుతోందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 70.8 శాతం మంది నుంచి అవునన్న సమాధానం వచ్చింది.

15.2 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. 


ఇండియన్ ఆర్మీ అంటే చైనా భయపడుతోందా

ఇక భారత సైనిక బలగాల వల్ల చైనాకు ముప్పు ఉందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 30.9 శాతం మంది అవుననే చెప్పారు. 

57.1 శాతం మంది అలాంటి ముప్పేమీ ఉండదన్నారు. 

12 శాతం మంది దీనిపై నిర్దిష్ట అభిప్రాయం వ్యక్తం చేయలేదు.


చైనా, భారత్ సంబంధాలకు అడ్డుగోడలేమిటి?

రెండు దేశాల మధ్య సంబంధాలలో అతి పెద్ద అవరోధమేంటన్న ప్రశ్నకు అత్యధికుల నుంచి వచ్చిన సమాధానం సరిహద్దు వివాదం. సరిహద్దు వివాదమే రెండు దేశాల మధ్య సంబంధాలకు అడ్డుగోడ అని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు.

24.5 శాతం మంది అమెరికా జోక్యం వల్ల కూడా చైనా, భారత్‌ల సంబంధాలు దెబ్బతింటున్నాయన్నారు.

చైనా పట్ల భారత్ విద్వేషం చూపడం వల్లే సంబంధాలు దెబ్బతింటున్నాయని 22.7 శాతం మంది.. శత్రుదేశంగా భావించడం వల్ల అని 10.7 శాతం మంది చెప్పారు.

వాణిజ్య రక్షణాత్మకతను 4.8 శాతం.. టిబెట్ అంశాన్ని 4 శాతం మంది కారణంగా చెప్పారు.


చైనా వస్తువుల బహిష్కరణపై ఎలా ఫీలవుతున్నారు

చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు.. చైనా సంస్థలపై నిషేధంపై 35.3 శాతం మంది తీవ్రంగా స్పందించారు. చైనా ప్రతీకార చర్యలకు దిగాల్సిందేనన్నారు.

29.3 శాతం మంది మాత్రం భారత్ ఈ విషయంలో సీరియస్‌గా ఏమీ లేదని.. పెద్దగా పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఇది పెద్ద సమస్యేనని.. దీనిపై దృష్టిపెట్టాలని 23.2 శాతం మంది చెప్పారు.


చైనాను దాటాలంటే భారత్ ఎన్నాళ్లు పడుతుంది..?

భారత్ అన్ని రంగాల్లో చైనాను అధిగమించాలంటే ఎంత కాలం పడుతుందని ఈ సర్వేలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు.

భారత్ ఎన్నటికీ అధిగమించలేదని 54 శాతం మంది చెప్పగా.. వందేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని 10.4 శాతం మంది చెప్పారు.

పదేళ్లలోపేనని 3.9 శాతం మంది.. 20 ఏళ్లు చాలని 8.1 శాతం మంది, 50 ఏళ్లలో అధిగమించొచ్చని 8.7 శాతం మంది.. 100 ఏళ్లు పట్టొచ్చని 5.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

Read Our Exclusives:

 ఆంధ్రప్రదేశ్: నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన ఆ 4 పనులు ఏమిటి 

Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి? 

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం 

ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది

25, ఆగస్టు 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్: నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన ఆ 4 పనులు ఏమిటి

Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు


ఆంధ్రప్రదేశ్, నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం, టీడీపీ, వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి

..............

ప్రతిపక్షంలో ఉండడమంటే రాజకీయంతో పాటు ప్రజా సేవ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా. 

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వ పాలనలోనే ఉన్నప్పటికీ సంఖ్యాబలమిచ్చిన అపరిమిత అధికారాల వల్ల గాడి తప్పే ప్రమాదముంది.

ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పాత్ర పోషించడమంటే అత్యంత బాధ్యతాయుతంగా నాయకత్వం వహించడమే.

రాష్ట్రంలోని ఇతర పార్టీలో నోరెత్తలేని స్థితిలో ఉండడం.. నోరెత్తినా వాటి స్వరం బిగ్గరగా వినిపించని పరిస్థితిలో ఉండడంతో ఎమ్మెల్యేల బలం పరంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బలహీన ప్రతిపక్షమే అయినప్పటికీ గ్రామగ్రామానా విస్తరించిన అసంఖ్యాకమైన క్యాడర్ పరంగా బాహుబలిలాంటి ఆ పార్టీ సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. 

సమర్థమైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర అంటే ఒక అసాధారణమైన, అతి క్లిష్టమైన పని. 

కనీసం నాలుగు వేర్వేరు పనులు ఒకేసారి చేయాల్సి ఉంటుంది. పైగా ప్రతి పనికీ దేనికదే ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. 

1) తక్షణం, నిత్యం చేయాల్సిన పని

ప్రభుత్వం చేసే తప్పులను దొరకబట్టుకుంటూ ఎప్పటికప్పుడు సవాల్ చేయడం. ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా చేయడం.

ప్రభుత్వం చేసే చట్టాలను నిశితంగా పరిశీలించి లోపాలు లేకుండా నిలదీయడం.

కోవిడ్ వంటి సంక్షోభం ఉన్న సమయంలో ఇది చాలా సున్నితమైనది.. సంక్లిష్టమైనది కూడా. 

మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉండడంతో ఎదురు నిలవడమూ కష్టమే. తిరుగులేని మెజారిటీ తమకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని భావించి ప్రభుత్వం, అందులోని వ్యక్తులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు ఆ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి.

2) పార్టీని నడిపించడం, కాపాడుకోవడం

అధికారంలో ఉన్నప్పుడు అంతా సాఫీగా సాగిపోతుంది. పార్టీ నాయకుడి నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించరు. నాయకుడి నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తారు. చెప్పిన పనిని గొప్పగా చేస్తారు. నాయకుడి దృష్టిలో పడి పదవో, పనో సంపాదించుకుని లబ్ధి పొందాలన్న కోరిక చిన్నస్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు అందరిలో ఉంటుంది. అందుకే నాయకుడి దృష్టిలో పడేందుకు కష్టపడి పనిచేస్తారు.. అవసరమైతే సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు చేస్తారు. నాయకుడి మాటను వేదవాక్కుగా భావిస్తారు. నాయకుడిపై ఈగ వాలకుండా చూసుకుంటారు.

కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా కాదు. అధికార పక్షం ధాటిని ఎదుర్కొంటుండాలి. తమ ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలు, మూలాలు కాపాడుకుంటుండాలి. అందుకోసం అధికార పార్టీతో పెద్దగా వివాదాలు కొనితెచ్చుకోకుండా తెలివిగా మసలుకుంటుంటారు ఎక్కువ మంది నేతలు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోరు. తమ నాయకుడి మాటను లెక్క చేయని వారూ ఉంటారు. అధికార పక్షంతో కుమ్మక్కయ్యేవారు... అధికార పార్టీలోకి ఫిరాయించేవారూ అన్ని రకాలూ ఉంటారు.

ఇలాంటివారందినీ దారిలో పెట్టుకుంటూ, అదుపులో పెడుతూ, చేజారిపోకుండా చూస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయాలి ప్రతిపక్ష నాయకుడు. 

ప్రతి కార్యక్రమాన్నీ ముందుండి నడిపించాలి. తన తరువాత శ్రేణి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతోనూ నిత్యం ఇంటరాక్ట్ అవుతుండాలి. 

అధికార పక్షం నుంచి వారిపై ఉండే ఒత్తిళ్లు, కేసులు వంటిని ఎదుర్కొనేలా భరోసా ఇవ్వాలి.

3) వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండడం

ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ తరువాత ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండాలి. ప్రభుత్వంలో లేం కదా అని ఊరుకోకుండా ప్రజల మద్దతును పొందే కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. ప్రజలు కష్టాలలో ఉంటే ఆదుకోవాలి. పార్టీకి శక్తినిస్తుండాలి.

ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటుండాలి.

తదుపరి ఎన్నికల్లో గెలిచేది మనమే అనే నమ్మకం పార్టీలో కలిగించాలి.

అంతేకానీ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేవరకు వెయిట్ చేద్దాం అనే వైఖరి కనబరచకూడదు.

4) ఏ క్షణాన అధికారం దొరికినా తక్షణం రాష్ట్రం అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధంగా ఉంచడం.. ప్రజాసమస్యలపై నిర్మాణాత్మక హామీలివ్వడం

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికారం తమకే ఉంటే ఏం చేస్తాం, ఏం చేయాలనే విషయంలో క్లారిటీతో ఉంటూ పాలనకు సిద్ధంగా ఉండడం. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు కానీ, ఈలోగా రాజకీయ మార్పులు జరిగి కానీ తమకు అధికారం వస్తే తక్షణం రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనే విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలి.

అలాగే, ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతుండాలి. 

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని చెప్పే చంద్రబాబు ఆ పని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది.

Read Our Exclusives:


24, ఆగస్టు 2020, సోమవారం

Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి?

 

Kim Jong-Un కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ కోమాలోకి వెళ్లారా.. మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించిందా? అవుననే అంటోంది దక్షిణ కొరియా.

నిత్యం ఉత్తర కొరియాపై కన్నేసి ఉంచే దక్షిణ కొరియా ఒక్కటే ఉత్తరకొరియాలో ఏం జరుగుతోందనేది అంతో ఇంతో చెప్పగలుగుతుంది. అయితే.. ఒక్కోసారి దక్షిణ కొరియా నిఘా వర్గాల ముసుగులో నిజాలను తొక్కిపెట్టి అసత్యాలనూ ప్రచారం చేస్తుంది. 

అయితే, తాజాగా దక్షిణ కొరియా అధికారి ఒకరు కిమ్ కోమాలోకి వెళ్లారని చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ వార్త పాకింది. 

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ రీసెంటుగా మాట్లాడుతూ తమ దేశ నిఘావర్గాల సమాచారం ప్రకారం కిమ్ ప్రస్తుతం కోమాలో ఉన్నారని చెప్పారు. అంతేకాదు.. కిమ్ కోలుకోకపోవడంతో ఆయన స్థానంలో సోదరి కిమ్ యో జోంగ్ పాలన వ్యవహారాలు చూస్తున్నారనీ చెప్పారు.


మరోవైపు కొద్దిరోజులుగా ఈ అధికార మార్పిడిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను కిమ్‌ తన సోదరి కిమ్‌ యో జోంగ్కు కట్టబెట్టారని మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జోంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో చాంగ్‌ సాంగ్‌ మిన్‌ మాట్లాడుతూ.. ‘కిమ్ కోమాలో ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నాను. కానీ అతను మరణించలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని.. ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు.


కాగా, గతంలో కూడా కిమ్‌ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయనకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని పుకార్లు వచ్చాయి. కానీ కొద్దికాలం కిందట ఆయన కనిపించడంతో అవన్నీ వదంతులేనని తేలిపోయింది. మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా.. లేదంటే కిమ్ నిజంగానే కోమాలో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.

Read Our Exclusives:

23, ఆగస్టు 2020, ఆదివారం

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం

 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

సోనియా గాంధీ ఆరోగ్యం రాజకీయాలకు సహకరించడం లేదు.. 

రాహుల్ గాంధీ రాజకీయం ఈ దేశానికి సరిపోవడం లేదు... 

ప్రియాంకాగాంధీ ఇంకా నియోజకవర్గ స్థాయికి మించి ఎదగలేదు.. 

మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయిన కుటుంబంలోని తలకాయలేవీ ఆ పార్టీని గాడిన పెట్టగలిగేలా కనిపించడం లేదు. 

రాజకీయాల్లో ఎంతో అనుభవించినందుకు ఇంకేముందిలే అనుకుంటూ.. అనుభవం ఉన్నందున మనకెందుకులే అనుకుంటూ ఈ చేతకానితనాన్నంతా భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నారు నాయకులు. 

మూడు చేపల కథంలోని సుమతి వంటి నాయకులు ముందుచూపుతో బయటపడుతుంటే... కాలమతి టైపు నాయకులు అదను కోసం ఎదురుచూస్తున్నారు.. మందమతులు అడుగంటిన కాంగ్రెస్ చెరువులోని బురదలో ఆక్సిజన్ కోసం వెతుక్కుంటూ ఎగఊపిరి తీస్తున్నారు. 

కాంగ్రెస్ అనే ఆ చెరువును బతికించడం, అందులో చేపలు బయటకుపోకుండా, బతుకుపోకుండా చూడడం ఇక సోనియా, రాహుల్, ప్రియాంక వల్ల కాదని పార్టీ నాయకులందరికీ అర్థమైపోయి చాలాకాలం గడవడంతో ఇప్పుడు సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు ఒక 23 మంది సీనియర్లు నేరుగా సోనియాకే లేఖ రాశారు. 

నాయకత్వాన్ని మార్చి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీకి పూర్తి కాల, క్రియాశీల అధ్యక్షుడు కావాలని కోరారు.

అంటే అవుట్ డేటెడ్ సోనియా, ఆన్ అండ్ ఆఫ్ రాహుల్, అప్ డేట్ కాని ప్రియాంకా కాకుండా ఇంకెవరైనా అధ్యక్ష స్థానంలోకి రావాలని నిర్మొహమాటంగా చెప్పేశారు. 

మరెవరు?

దీంతో.. సోనియా కుటుంబానికి చెందని నేతలు ఎవరున్నారనేదీ సందిగ్థంగానే ఉంది ఆ పార్టీలో. బీజేపీకి అంతగా పట్టులేని, ఆ పార్టీ సిద్ధాంతాల బలవంతపు రుద్దుడును వ్యతిరేకిస్తున్న దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న వాదన వినిపిస్తున్నా ఆ అవకాశమూ కనిపించడం లేదు. 

జాతీయ స్థాయి నేత చిదంబరం, శశి థరూర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.. కానీ, చిదంబరం జైలులో పడడంతో ఆయన దూకుడు తగ్గిపోయింది. థరూర్‌‌కు నాయకుడిగా కంటే మేధావిగానే పేరుంది. 

పైగా ఆయన అప్పుడప్పుడూ బీజేపీ వాసన కొడుతున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.

ఉత్తరాది నేతల విషయానికొస్తే జాబితా పెద్దగానే ఉన్నా అన్నీ గోడ మీద పిల్లులే. 

పార్టీ పరిస్థితి చూసి సగం మంది ఇప్పటికే బీజేపీతో రహస్య ప్రేమాయణాలు నడిపిస్తున్నారు.

కేవలం అధికార ప్రతినిధులే నోరు విప్పి రాహుల్ గాంధీకి సపోర్టుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 

దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు సోనియా. 

పోనీ ఎవరో ఒకరిని నమ్మి అధ్యక్ష స్థానం కట్టబెడితే వారి మాట మిగతావారు ఎంతవరకు వింటారన్నదీ ప్రశ్నే. 

ఇక రాహుల్ గాంధీనే ఎలాగోలా బతిమాలుదామనుకున్నా ఆయన కుర్చీ ఎక్కడానికి మొరాయిస్తున్నాయి. 

ఒకవేళ ఆయన్నే మళ్లీ చేసినా ఆయన నాయకత్వంపై విశ్వాసం లేక చాలామంది పార్టీ నుంచి జారిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీలోనే డౌట్లు. 

 ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు అందుకుని పార్టీలో దూకుడు నింపే నాయకుడి కోసం ఆ పార్టీ కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల కంటే కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.

Read Our Exclusives:

21, ఆగస్టు 2020, శుక్రవారం

ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది

చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు, జడ్జిలు, న్యాయవాదులు, మీడియాకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. 

పాలక వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం తన రెండు ఫోన్‌ నంబర్లను ఏపీ నిఘా వర్గాలు కొన్ని నెలలుగా ట్యాపింగ్ చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తంచేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని చెప్పిన ఆయన దీనిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.

ట్యాపింగ్ కోసం చట్టవిరుద్ధమైన సాఫ్ట్ వేర్‌లను వినియోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు.. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలనీ డిమాండ్  చేశారు.

మ‌రోవైపు కొంద‌రు న్యాయ‌మూర్తుల ఫోన్ల‌ను ప్ర‌భుత్వం ట్యాప్ చేస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో విశాఖ‌ప‌ట్నానికి చెందిన న్యాయ‌వాది ఒకరు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీనిపై టెలికాం స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు, రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

ఇక రాజస్థాన్‌లోనూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసిందని దానిపై సీబీఐ విచారణ జరిపించాలని అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 

గతంలోనూ దేశవ్యాప్తంగా అనేక ఫోన్ ట్యాపింగ్ ఘటనను రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

మరి ఇంతకీ ప్రైవేటు వ్య‌క్తుల ఫోన్ల‌ను ప్ర‌భుత్వం ట్యాపింగ్ చేయొచ్చా? ఫోన్‌ ట్యాపింగ్ చేసే అధికారం ఏ ఏ సంస్థ‌ల‌కు ఉంటుంది? ఇంత‌కీ ఈ ట్యాపింగ్ ఎలా చేస్తారు?

ఇజ్రాయెల్ పేరు

గ‌తేడాది అక్టోబ‌రులో కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు దుమారం రేపాయి. పెగాసెస్ అనే ఇజ్రాయేల్ స్పైవేర్‌తో భార‌త్‌లోని మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై నిఘా పెట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ విష‌యాన్ని వాట్సాప్ కూడా ధ్రువీక‌రించింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వాట్సాప్‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం కోరింది. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఈ నిఘా పెట్టింద‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు.

వివాదం న‌డుమ అస‌లు ఏ ఏ సంస్థ‌ల‌కు ఫోన్‌ ట్యాపింగ్‌చేసే అధికారం ఉంద‌ని లోక్‌స‌భ‌లో డీఎంకే నాయ‌కుడు ద‌యానిధి మార‌న్ ప్ర‌శ్నించారు. దీనిపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

ప్రైవేటు వ్య‌క్తుల ఫోన్ కాల్స్‌ను రికార్డుచేసే అధికారం కేంద్రం, లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఫోన్ కాల్స్ ద్వారా నిఘా పెట్టొచ్చ‌ని ఆయ‌న చెప్పారు.

ఎప్పుడు నిఘా పెట్టొచ్చు?

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం-2000లోని సెక్ష‌న్ 69తోపాటు ఇండియ‌న్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఫోన్ల‌ను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ట్యాపింగ్ చేయొచ్చు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, విదేశాల‌తో స‌త్సంబంధాల నిర్వ‌హ‌ణ‌తోపాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, లేదా కేంద్ర ప్ర‌భుత్వం కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేయొచ్చు. లేదా ప‌ర్య‌వేక్షించొచ్చు. ఈ స‌మాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూట‌ర్‌లో కూడా స్టోర్ చేయొచ్చు.

అంతేకానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు.

దేశ ప్రయోజనాల కోసం కాల్స్‌ను రికార్డు చేయాలంటే లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ విష‌యంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యంలో రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో హోం శాఖ‌లోని జాయింట్ సెక్ర‌ట‌రీ స్థాయి లేదా ఆ పైస్థాయి అధికారి అనుమ‌తితో ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయొచ్చు. ‌

ప్ర‌తి నెల ఫోన్ ట్యాపింగ్‌కు దాదాపు 9,000 ఆదేశాల‌ను ప్ర‌భుత్వం ఇస్తున్న‌ట్లు సాఫ్ట్‌వేర్ ఫ్రీడ‌మ్ అండ్ లా సెంట‌ర్ సంస్థ 2014లో తెలిపింది.


ఎవరికి అధికారం ఉంటుంది?

ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసే లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేసే అధికారం కేంద్ర ప్ర‌భుత్వం ప‌ది సంస్థ‌ల‌కు ఇచ్చింది. 

వీటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ (ఆర్ఏడ‌బ్ల్యూ), డైరెక్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, దిల్లీ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ ఉన్నాయి. 

రాష్ట్రాల విష‌యంలో రాష్ట్ర పోలీసు శాఖ‌కు ఫోన్ల‌ను ఇంటర్‌సెప్ట్ చేసే అధికారం ఉంటుంది.

ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలను హోం శాఖ‌ జారీచేసిన త‌ర్వాత ఒక వారంలోగా వాటిని సమీక్షా క‌మిటీకి పంపించాలి. కేంద్ర స్థాయిలో అయితే క్యాబినెట్ కార్య‌ద‌ర్శి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి, టెలికాం శాఖ కార్య‌ద‌ర్శి ఈ క‌మిటీలో ఉంటారు. 

రాష్ట్రాల విష‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శితోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన మ‌రో వ్య‌క్తి స‌భ్యులుగా ఉంటారు.

ఈ క‌మిటీ రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో సంబంధిత ఆదేశాలపై విచార‌ణ చేప‌డ‌తుంది. ఒక‌వేళ ఆదేశాలు ఇవ్వ‌డంలో ఏదైనా త‌ప్పు జ‌రిగింద‌ని భావిస్తే.. రికార్డుచేసిన కాల్స్‌, స‌మాచారాన్ని డిలీట్ చేయాల‌ని లేదా రికార్డుల నుంచి తొల‌గించాల‌ని సూచిస్తారు.

అయితే, ప్ర‌స్తుతం ఎలాంటి ట్యాపింగ్ జ‌ర‌గ‌లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత చెబుతున్నారు. తాము ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధంగా ఉన్నామ‌ని ఆమె వివ‌రించారు.


ప్రభుత్వాలే కాదు ప్రయివేటు వాళ్లూ 

అయితే, కొన్నిసార్లు ప్రైవేటు వ్య‌క్తులు, సంస్థ‌లు కూడా నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను ఉప‌యోగిస్తుంటాయి.

2001 నుంచి 2006 మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌లైన ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీల‌తోపాటు రాజ‌కీయ నాయ‌కులైన పీయూష్ గోయ‌ల్‌, ప్ర‌మోద్ మ‌హాజ‌న్ లాంటి ప్ర‌ముఖుల ఫోన్ల‌ను కార్పొరేట్ దిగ్గ‌జం ఎస్సార్ ట్యాప్ చేసిన‌ట్లు ఇటీవ‌ల ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

మ‌రోవైపు ఈ ట్యాపింగ్ 11ఏళ్ల‌పాటు కొన‌సాగింద‌ని అవుట్‌లుక్ కూడా ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

కొన్ని ప్రైవేటు సంస్థ‌లు, ప్రైవేటు డిటెక్టివ్‌లు, కంప్యూట‌ర్ హ్యాక‌ర్లూ.. స‌ర్వైలెన్స్ స‌ర్వీసుల‌ పేరుతో ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తున్నారు. కొంద‌రైతే ఎన్‌క్రిప్టెడ్‌ వాట్సాప్ మెసేజ్‌ల‌నూ డీ కోడ్ చేయ‌గ‌ల‌మ‌ని చెబుతున్నారు

2013లో బెంగ‌ళూరుకు చెందిన ప్రైవేటు డిటెక్టివ్‌, సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ ఇలానే అరెస్టు అయ్యారు. ఆయ‌న ఓ ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో వంద‌ల మందిపై నిఘా పెట్టారు. ఫోన్‌కాల్స్‌తోపాటు వ్య‌క్తిగ‌త స‌మాచారం స‌ర్వ‌ర్ల‌కు ఈ సాఫ్ట్‌వేర్ చేర‌వేసేది.

ఆయ‌న సేవ‌లు వినియోగించుకున్న వారిలో పారిశ్రామిక వేత్త‌ల నుంచి సామాన్యుల వ‌ర‌కూ ఉన్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఇండియ‌న్ టెలిగ్రాఫ్ చ‌ట్టంలో సెక్ష‌న్ 26 (బి) ప్ర‌కారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు త‌మ ప్రైవ‌సీ హ‌క్కును ఉల్లంఘించార‌ని కోరుతూ బాధితులు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను కూడా ఆశ్ర‌యించొచ్చు.


మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా తెలుసుకోవచ్చు

మ‌రోవైపు మ‌న ఫోన్‌ను ఎవ‌రైనా ట్యాపింగ్ చేస్తున్నార‌ని అనుమానం వ‌స్తే టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌)ను అడిగి స‌మాచారం .

"ఈ విషంపై 2018లో ట్రాయ్‌కు దిల్లీ హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసింది. ఏదైనా ప్ర‌భుత్వ సంస్థ అయినా స‌రే త‌మ కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేస్తే.. ఆ విష‌యాన్ని అర్జీ పెట్టుకున్న వ్య‌క్తికి తెలియ‌జేయాల‌ని కోర్టు సూచించింది".

"దీని కోసం స‌మాచార హ‌క్కు కింద మనం ట్రాయ్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వెంట‌నే ట్రాయ్ సంబంధిత టెలికాం ఆప‌రేట‌ర్ నుంచి స‌మాచారాన్ని తీసుకుని మ‌న‌కు పంపిస్తుంది".

"ట్రాయ్ ఇచ్చిన స‌మాచారాన్ని విశ్లేషించి ఏమైనా త‌ప్పు జ‌రిగిన‌ట్లు అనిపిస్తే మ‌నం నేరుగా కోర్టును ఆశ్ర‌యించొచ్చు".

Read Our Exclusives:

ప్రణబ్ ముఖర్జీ: నేను ప్రధాన మంత్రి ఎందుకు కాలేకపోయానంటే

ప్రణబ్ ముఖర్జీ Pranab Mukherji Pranab Mukherjee


* ప్రణబ్ ముఖర్జీకి హిందీ రాకపోవడం వల్లే ప్రధాన మంత్రి పదవి ఇవ్వలేదా

ప్రణబ్ ముఖర్జీ.. నిజంగానే మేన్ ఆఫ్ ఆల్ సీజన్స్. భారతదేశంలోని అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. కానీ, అత్యంత శక్తిమంతమైన, ఆకర్షణీయమైన పదవైన ప్రధానమంత్రి పదవి మాత్రం ఆయన్ను వరించలేదు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలో ఉండి ఆర్థిక మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి వంటి కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రధాన మంత్రి మాత్రం కాలేకపోయారు.

కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబేతరులు ప్రధాన మంత్రి కావడం అసాధ్యమే అయినా రాజీవ్ గాంధీ మరణానంతరం సోనియా గాంధీ ప్రధాని పదవి చేపట్టకపోవడంతో ప్రణబ్‌కు అవకాశం వచ్చినట్లే వచ్చి ఉసూరనిపించింది.

ప్రధాని పదవి వద్దని త్యాగం చేసినా ప్రధానిని నిర్ణయించే శక్తి తానే అయిన సోనియా ఆ అవకాశాన్ని నోరు లేని మన్మోహన్ సింగ్‌కు ఇచ్చి రాజకీయ చాణక్యుడైన ప్రణబ్‌కు మొండిచేయి చూపించింది.

మన్మోహన్ సింగ్ అయితే చెప్పినట్లు వింటూ చెప్పుచేతల్లో ఉంటారన్న కారణం ఒకటి కాగా ప్రణబ్ రాజకీయ చతురత, పరపతి వల్ల తమ మాట వినకపోవచ్చన్న జ్ఞానం, ప్రధానిగా అధికారం దక్కితే పార్టీనే చేతుల్లోకి తీసుకుంటారన్న భయంతో సోనియా అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు.

అలా ప్రధాని రేసు నుంచి తప్పించారు

అయితే.. కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని కాదని అవకాశం రావడమే అరుదు.. అలాంటి అవకాశం వచ్చినట్లే వచ్చి పోవడంతో ఆయనలో ఆ అసంతృప్తి ఉండేది. అయితే.. సోనియా కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ప్రణబ్ వంటి సీనియర్ల నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆయన్ను తరువాత కాలంలో రాష్ట్రపతిని చేశారు. దాంతో ప్రధాని రేసు నుంచి ఆయన్ను పూర్తిగా తప్పించింది కాంగ్రెస్ పార్టీ. 

అయితే, రాష్ట్రపతి అయిన ప్రణబ్‌లో మాత్రం ప్రధాని కోరిక మాత్రం పోలేదు. తనకెందుకు ప్రధాని పదవి రాలేదనే విషయంలో ఆయన పార్టీని ఎన్నడూ బహిరంగంగా తప్పు పట్టకపోయినప్పటికీ ఇతరత్రా కారణాలు చెప్పేవారు. 

అందులో ప్రధానమైనది భాషా సమస్య. అవును.. తనకు హిందీ రాకపోవడం వల్లే ప్రధానిని కాలేకపోయానని ప్రణబ్ ఓ సందర్భంలో చెప్పారు.

2017 అక్టోబరులో ప్రణబ్ తాను రాసిన ‘ది కొయిలేషన్ యియర్స్ 1996-2012’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈ మాట చెప్పారు.

ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రధానిగా తన కంటే ప్రణబ్ అన్ని అర్హతలు ఉన్న వ్యక్తని అన్నారు. 

తాను సుదీర్ఘ కాలం రాజ్యసభలోనే ఉండడం వల్ల.. అలాగే హిందీ రాకపోవడం వల్ల తనకు అవకాశం రాకపోయి ఉండొచ్చన్నారు.

అసంతృప్తి లేదు కానీ అసలు కారణం అదీ

అలాగే ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన ఇదే చెప్పారు. తనకు కాకుండా మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పదవి ఇచ్చారన్న అసంతృప్తి తనకేమీ లేదని.. తనకు ఆ అర్హత లేదని తాను భావిస్తానని అన్నారు.

ఒక్క 2004లో లోక్ సభకు ఎంపిక కావడం తప్ప తన మిగతా పార్లమెంటు కెరీర్ అంతా రాజ్యసభలో సాగడం.. హిందీ రాకపోవడం తన అనర్హతలని అభిప్రాయపడ్డారు.

‘‘హిందీ రాకుండా ఈ దేశంలో ఎవరూ ప్రధాని కాలేరు. కామరాజ్ నాడార్ కూడా ఒక సందర్భంలో ‘నో హిందీ, నో ప్రైమ్ మినిష్టర్‌షిప్’ అని అన్నార’’ని ప్రణబ్ చెప్పారు. 

Read Our Exclusives:

20, ఆగస్టు 2020, గురువారం

కరోనా వైరస్ వచ్చినా సింపుల్‌గా తగ్గిపోవాలంటే ఏం చేయాలి

కరోనావైరస్ coronavirus


క‌రోనావైర‌స్ సోకిన త‌ర్వాత ఇంటిలో ఉండేట‌ప్పుడు ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఐసోలేష‌న్‌లో ఉండ‌టం ఎలా? వీధిలో క‌రోనా రోగులు ఉండే ఏం చేయాలి?.

హోమ్ ఐసోలేష‌న్‌పై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌తోపాటు కేంద్ర ప్ర‌భుత్వ‌మూ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. వాటిలోని వివ‌రాల ప్ర‌కారం..

చ‌క్క‌గా వెలుతురు, గాలి వ‌చ్చే గ‌దిలో క‌రోనావైర‌స్ సోకిన‌వారిని ఉంచాలి. వారికి ఉప‌యోగించే మ‌రుగుదొడ్డిని వేరెవ‌రూ వాడ‌కూడ‌దు.

రోగుల‌ను చూసుకోవ‌డానికి ఒక స‌హాయ‌కుడు వారికి ఎప్పుడూ అందుబాటు ఉండాలి. లేని ప‌క్షంలో సాయం కోసం 18005994455 (తెలంగాణ‌), 104 (ఆంధ్ర‌ప్ర‌దేశ్) నంబ‌రును సంప్ర‌దించాలి.

55ఏళ్లు పైబ‌డిన‌వారు, గ‌ర్భిణులు, తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌లుండేవారు, క్యాన్స‌ర్‌, ఆస్థ‌మా, శ్వాస సంబంధిత వ్యాధులు, ర‌క్త‌పోటు, గుండె, కిడ్నీ స‌మ‌స్య‌లు ఉండేవారిని వేరే ఇంటికి పంపించాలి.

ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంట‌ర్నెట్‌, బ్లూటూత్‌ల‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి. ప్ర‌భుత్వ ఆరోగ్య సిబ్బంది రోజూ ఫోన్ చేస్తారు. వారికి పూర్తి స‌హ‌కారం అందించాలి.


రోగుల‌కు సూచన‌లు ఇవీ..

* నీళ్లు ఎక్కువ‌గా తాగాలి.

* గోరు వెచ్చ‌టి నీరు మంచిది.గ‌ది నుంచి బ‌య‌ట‌కు ఎప్పుడు వ‌చ్చిన మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి.

* ద‌గ్గేట‌ప్పుడు, తుమ్మే ట‌ప్పుడు హ్యాండ్ క‌ర్చీఫ్ లేదా టిష్యూ ఎప్పుడూ ఉప‌యోగించాలి.

* వాడిన క‌ర్చీఫ్‌, టిష్యూ, బ‌ట్ట‌ల‌ను గాలి చొర‌బ‌డ‌లేని క‌వ‌ర్లు, చెత్త బుట్ట‌ల్లో వేయాలి. వీలైతే ఇంటిబ‌య‌ట వీటిని కాల్చేయాలి. ఇత‌ర చెత్త‌లో వీటిని క‌ల‌ప‌కూడ‌దు.

* మ‌రుగుదొడ్డికి వెళ్లే ముందు, వెళ్లిన త‌ర్వాత చేతులను 40 నుంచి 60 సెక‌న్ల‌పాటు క‌డుక్కోవాలి. త‌డి చేతుల్ని తుడుచుకోవ‌డానికి క్లాత్ ఉప‌యోగించొద్దు.

* ఐసోలేష‌న్ గ‌దిని రోగులే శుభ్రం చేసుకోవాలి. వారికి క‌ష్ట‌మైతే.. దాన్ని తుడిచేవారు మూడు లేయ‌ర్ల వైద్య మాస్కులు, గ్ల‌వ్స్‌, ఫేస్ షీల్డ్ అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకోవాలి. ఇంటికి శుభ్రం చేసేందుకు బ్లీచింగ్ పౌడ‌ర్ లేదా డిస్ ఇన్ఫెక్టెంట్‌ల‌ను ఉప‌యోగించాలి. రోజుకు రెండు సార్లు గ‌దిని శుభ్రం చేయాలి.

* ఇంట్లో వ‌య‌సు పైబ‌డిన‌వారు, గ‌ర్భిణులు, పిల్ల‌లు, ఇత‌ర జ‌బ్బులు ఉండేవారి నుంచి ఆరు అడుగులు లేదా రెండు మీట‌ర్ల దూరాన్ని పాటించాలి.

* ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొగ తాగ‌కూడ‌దు. ఎందుకంటే వైర‌స్ శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తుంది.వాడిన బ‌ట్ట‌లను 30 నిమిషాల‌పాటు వేడినీళ్ల‌లో పెట్టి త‌ర్వాత ఉత‌కాలి.


డాక్టరును ఎప్పుడు సంప్ర‌దించాలి?

* ద‌గ్గు, తుమ్ములు ఎక్కువ‌గా వ‌చ్చేట‌ప్పుడు

* బాగా బ‌ల‌హీనంగా అయిన‌ప్పుడు

* రొమ్ములో ఎడ‌తెగ‌ని నొప్పి వ‌చ్చిన‌ప్పుడు

* గంద‌రగోళంగా అనిపిస్తున్న‌ప్పుడు

* శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్తిన‌ప్పుడు

* విప‌రీతంగా జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు

* పెద‌వులు, ముఖం లేదా నిలం రంగులో క‌నిపించేట‌ప్పుడు


రోగులు ఏం చేయాలి?

* రోజూ రెండు పుట‌లా థెర్మామీట‌ర్‌తో శ‌రీర ఉష్ణోగ్రత చూసుకోవాలి. రీడింగ్‌ వంద‌కుపై ఉంటే వెంట‌నే కోవిడ్‌-19 హెల్ప్ లైన్‌కు సంప్ర‌దించాలి.

* ప‌ల్స్ రేటును రెండు పూట‌లా చూసుకోవాలి. మ‌ణిక‌ట్టుపై చూపుడు, మ‌ధ్య వేళ్ల‌ను పెట్టి బొట‌న వెలును ద‌న్నుగా పెట్టి 60 సెన్ల‌పాటు నాడి కొట్టుకోవ‌డాన్ని లెక్క‌పెట్టాలి. అది వంద దాటితే వెంట‌నే హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాలి.

* 17 రోజుల‌పాటు ఐసోలేష‌న్‌లో ఉండాలి. ప‌ది రోజుల పాటు జ్వ‌రం లేక‌పోతే అప్పుడు సెల్ఫ్ ఐసోలేష‌న్ నుంచి బ‌య‌ట‌కు రావొచ్చు.


ఏం తినొచ్చు? ఏం తిన‌కూడ‌దు?

* బ్రౌన్ రైస్‌, మిల్లెట్స్‌, గోధుమ‌, ఓట్స్‌, బీన్స్, పప్పులు ఒంటికి మంచిది.

* తాజా ప‌ళ్లు, కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి.

* ఎర్ర క్యాప్సిక‌మ్, క్యారెట్‌, బీట్‌రూట్‌, ఆకుకూర‌లు ఎక్కువ తీసుకోవాలి.

* రోజుకు ఎనిమిది నుంచి ప‌ది గ్లాస్‌ల నీళ్లు తీసుకోవాలి.

* సిట్ర‌స్ ప‌ళ్లు.. ఆరెంజ్‌, బ‌త్తాయి, నిమ్మ‌కాయ ర‌సాల‌ను తీసుకోవాలి.

* అల్లం, వెళ్లుల్లి, ప‌సుపును వాడాలి.

* ఇంటిలో వండిన ఆహార‌మే మంచిది.

* కొవ్వు త‌క్కువ‌గా ఉండే ప‌దార్థాలు తీసుకోవాలి.పాలు, పెరుగు తీసుకోవ‌చ్చు.

* చికెన్‌, చేప‌, ఎగ్ వైట్‌లు తీసుకోవాలి.

* మైదా, డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్స్‌ను తీసుకోకూడ‌దు.

* చ‌క్కెర ఎక్కువ‌గా ఉండేవి, కూల్ డ్రింక్స్ ను దూరం పెట్టాలి.

* చీజ్‌, కొబ్బ‌రి, పామ్ ఆయిల్‌, బ‌ట‌ర్ వ‌ద్దు.

* మట‌న్‌, లివ‌ర్‌, ప్రాసెస్డ్‌ మీట్ దూరం పెట్టాలి.

* మాంసాహారం వారానికి రెండు, మూడు సార్ల‌కు మించి తీసుకోవ‌ద్దు.


ఇరుగుపొరుగు వారు ఏం చేయాలి?

* మీ చుట్టుప‌క్క‌ల‌ ఎవ‌రికైనా ‌క‌రోనావైర‌స్ సోకితే ఆందోళ‌న ప‌డొద్దు.

* మీ ఇంటి ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.

* అపార్ట్‌మెంట్లో ఉండే లిఫ్ట్‌, మెట్లు త‌దిత‌ర ఎక్కువ మంది ఉప‌యోగించే ప్రాంగ‌ణాల‌ను డిస్ఇన్ఫెక్టెంట్‌ల‌తో క‌డ‌గాలి.

* రోగులు, రోగుల కుటుంబ స‌భ్యులకు ఎలాంటి ఇబ్బంది పెట్ట‌కూడ‌దు.

* ఐసోలేష‌న్ ఉండేవారు బ‌య‌ట తిరిగితే వెంట‌నే కోవిడ్‌-19 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలి.

* బ‌య‌ట‌కు వెళ్లిన ప్రతిసారీ స‌బ్బునీళ్ల‌తో చేతిని 60 సెక‌న్ల‌పాటు క‌డుక్కోవాలి.

* వీలైతో రోగుల‌కు సాయం చేయాలి. వారికి అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, కుర‌గాయ‌లు, రేష‌న్ స‌ర‌కులు అందించేందుకు ప్ర‌య‌త్నించండి.

రోగులు కోలుకునేవ‌ర‌కూ వారి నుంచి డ‌బ్బులు తీసుకోవ‌డం, వారికి డబ్బులు ఇవ్వ‌డం త‌గ్గించాలి.

18, ఆగస్టు 2020, మంగళవారం

అమిత్ షా: కరోనా వైరస్ అనంతర చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి

 

amit shah అమిత్ షా

అమిత్ షా దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం వేకువన ఆయన్ను అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆసుపత్రి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర హోం మంత్రిగా ఉండడంతో పాటు పార్టీలోనూ నంబర్ 2 అయిన ఆయన నిత్యం బిజీగా ఉండే మనిషి కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరినప్పటికీ అక్కడి నుంచీ కూడా తన దైనందిన రాజకీయ, హోంశాఖకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. 

ఇటీవల కరోనావైరస్ బారిన పడిన ఆయన గురుగావ్‌లోని వేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయనకు కోవిడ్-19 టెస్టులో నెగటివ్ వచ్చిందని తాజాగా ఎయిమ్స్ వర్గాలు ధ్రువీకరించాయి.

అయితే.. విపరీతమైన అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా కోవిడ్ అనంతర చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని ఎయిమ్స్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో అమిత్ షాకు చికిత్స అందిస్తున్నారు. 

అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ బులెటిన్


15, ఆగస్టు 2020, శనివారం

బాజీ రౌత్ : స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అత్యంత పిన్న వయస్కుడు

బాజీ రౌత్ విగ్రహం. ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లా డొంగొపొలాలో బాజీ రౌత్ విగ్రహం

Baji Rout : The youngest martyr of India

బాజీ రౌత్.. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చాలామంది వినని పేరిది. కానీ, ఇప్పటికైనా తెలుసుకుని గుర్తుంచుకోవాల్సిన స్ఫూర్తిదాత బాజీ రౌత్.

కేవలం పన్నెండేళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్లను ఎదిరించి తెల్ల తూటాలకు బలైపోయిన బాల యోధుడు బాజీ.

భారత స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల్లో అత్యంత పిన్నవయస్కుడు బాజీ. 

The Youngest Martyr of India ఎవరంటే ఖుదీరాం బోస్ పేరు కూడా కొందరు చెబుతారు కానీ, ఖుదీరాం కంటే బాజీ రౌత్ చిన్నవారని చరిత్ర తేల్చింది.

ఇంతకీ బాజీ రౌత్ ఎక్కడివారు?.. ఆయన ఎలా చనిపోయారు? బ్రిటిషర్లు అంత చిన్న పిల్లాడిని ఎందుకు చంపారో తెలుసుకుందాం..


బాజీ రౌత్

ఒడిశా రాష్ట్రం ఢెంకనాల్‌లోని నీలకంఠాపురం బాజీ రౌత్‌ది. 1926 అక్టోబరు 5న జన్మించాడు. తండ్రి నీలకంఠాపురానికి సమీపంలో ఉన్న బ్రహ్మణి నదిలో పడవ నడిపేవారు. 

బాజీ పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో తండ్రితో పాటే వెళ్తూ పడవ నడపడం నేర్చుకున్నాడు. 

ఆ రోజుల్లో స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఢెంకనాల్‌లో వైష్ణవ్ చరణ్ పట్నాయిక్ ప్రజామండల్ పేరుతో ప్రజలను సమీకరించి స్థానిక సంస్థానాధిపతి శంకర్ ప్రతాప్ సింగ్‌దేవ్ ప్రజాకంటక పాలన, అధిక పన్నులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారు. 

ఆ పోరాటాన్ని అణచివేయడానికి సింగ్ దేవ్ బ్రిటిష్ వారి సాయం తీసుకున్నారు. 

దాంతో పట్నాయక్‌ను పట్టుకోవడానికి ఆయన ఉండే భువన్ గ్రామంపై సింగ్‌దేవ్ మనుషులు, ఢెంకనాల్ స్టేట్ పోలీస్ తరచూ దాడి చేసేవారు.

అలా 1938అక్టోబరు 10న కూడా రాజు సింగ్‌దేవ్ మనుషులు, బ్రిటిష్ సైనికులు కలిసి  పట్నాయిక్ ఉండే భువన్ గ్రామంలో బీభత్సం సృష్టించారు. వైష్ణవ్ చరణ్ పట్నాయక్, ఆయన అనుచరుల కోసం ఇల్లిల్లూ వెతుకుతూ ప్రజలను హింసించారు. ఎంతో మందిని అరెస్టు చేశారు. ఆ అరాచకలను ప్రజలు ప్రతిఘటించడంతో బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రఘు నాయక్, ఖురీ నాయక్ అనే ఇద్దరు చనిపోయారు.

దీంతో ప్రజలు తిరగబడ్డారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలకు ఎదురు నిలవలేక అదే రాత్రి సింగ్‌దేవ్, బ్రిటిష్ సైనికులు భువన్ నుంచి ఢెంకనాల్ పారిపోయే ప్రయత్నం చేయగా ప్రజలు వారిని వెంటాడారు.

ఆ క్రమంలో అక్టోబరు 11 వేకువజామున ఢెంకనాల్ వెళ్లే మార్గంలో నీలకంఠాపురం రేవు వద్ద బ్రహ్మణి నదిని దాటేందుకు 20 మందికి పైగా సైనికులు చేరుకున్నారు. 

కానీ, అప్పటికీ వారిని ప్రజలు తరుముతున్నారు.

నీలకంఠాపురం రేవులో పడవ వద్ద బాజీ రౌత్ ఉన్నాడు. బాజీ వయసు అప్పుడు పన్నెండేళ్లే. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న సైనికులు తమ అందరినీ పడవలో నది అవతలికి దాటించాలని బాజీని బెదిరించారు.

కానీ, పట్నాయిక్ చేస్తున్న ఉద్యమం.. బ్రిటిష్ సేనల అరాచకాల గురించి తెలిసిన బాజీ అందుకు అంగీకరించలేదు. అంతేకాదు... ప్రజామండల్‌కు అనుబంధంగా ఉన్న పిల్లల బృందం వానరసేనలో బాజీ సభ్యుడు కూడా. దీంతో ఆయన వారిని నదిని దాటించేందుకు అంగీకరించలేదు.

బాజీని కొట్టారు.. అయినా, ఆ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా వారిని పడవలో ఎక్కించుకునే ప్రసక్తే లేదని చెప్పాడు.

ఇంతలో తమను తరుముతున్న ప్రజలు దగ్గరకు వచ్చేస్తుండడంతో బ్రిటిష్ అధికారులు తుపాకీతో బాజీని, ఆయనకు అండగా నిలిచిన మరో నలుగురిని కాల్చేశారు.  


బాజీ రౌత్ ది ఇమ్మోర్టల్ బోట్ బాయ్ సినిమా


బాజీ రౌత్‌పై సినిమా

బాజీ రౌత్ వీరత్వానికి గుర్తుగా 2016 నుంచి ఏటా ఉత్కల్ దివస్ రోజున ఉత్కళ్ కల్చరల్ అసోసియేషన్, ఐఐటీ బాంబే కలిసి ‘బాజీ రౌత్ సమ్మాన్’ అవార్డును ఆ రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన యువతకు అందిస్తున్నాయి.

2018లో భువనేశ్వర్‌కు చెందిన మీడియా కంపెనీ ప్రిలూడ్ నావెల్ వెంచర్స్ బాజీ రౌత్‌పై 27 నిమిషాల నిడివి ఉన్న ‘బాజీ: ది ఇమ్మోర్టల్ బోట్ బోయ్’ అనే చిత్రాన్ని తీసింది.



వైష్ణవ్ చరణ పట్నాయక్ Baishnab Charan Patnaik

వైష్ణవ్ చరణ్ పట్నాయక్ ఏమయ్యారు?

ఢెంకనాల్ రాజుకు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ప్రజామండల్‌ను స్థాపించి ఉద్యమం చేసిన వైష్ణవ్ చరణ్ పట్నాయక్ స్వాతంత్ర్యం వచ్చేవరకు తన పోరాటాలను కొనసాగించారు.

బాజీ రౌత్ మరణం తరువాత బాజీ శవాన్ని మోసుకుంటూ ఉద్యమించిన ఆయన ఆ తరువాత తన ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేశారు. 1939లో ఆయన్ను బ్రిటిష్ పాలకులు అరెస్టు చేశారు. ఆరు నెలలు జైలులో ఉన్న ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. 

కానీ, 1940లో మళ్లీ ఆయన్ను అరెస్టు చేశారు. 1942లో విడిచిపెట్టారు. అయితే, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో మళ్లీ ఆయన్ను పట్టుకుని ఉరి తీసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించగా ఆయన వారికి చిక్కకుండా అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ ఉద్యమానికి సహకరించారు.

విద్యార్థి దశ నుంచే రైతులను, కార్మికులను కూడగట్టి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజల మనిషిగానే బతికారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన ఢెంకనాల్ సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో కలపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించారు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగిన ఆయన 1947లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 

జైలు నుంచే ఎన్నికల్లో విజయం

తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకోవడంతో 1948లో ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. 1952 వరకు ఆయన జైలులోనే ఉన్నారు.

1952లో జరిగిన ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టు పార్టీ తరఫున జైలు నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి 1952-57 మధ్య ఢెంకనాల్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

అనంతరం 1962లో లోక్‌సభకు ఎన్నికూ 1967 వరకు ఎంపీగా పనిచేశారు.

2013లో 99 ఏళ్ల వయసులో పట్నాయిక్ మరణించారు.

ఒడిశాలో ‘వీర్ వైష్ణవ్’గా ప్రజలు పిలుచుకునే ఆయన జీవిత కథను ‘వీర్ వైష్ణవ్ జీవన్ గాథా’ పేరిట నిత్యానంద మిశ్రా ఒరియాలో పుస్తకంగా తీసుకొచ్చారు. 

(ఆధారం: డి.పి.మిశ్రా రాసిన పీపుల్స్ రివోల్ట్ ఇన్ ఒరిస్సా పుస్తకం, లోక్ సభ వెబ్ సైట్, ఒరిస్సా స్టేట్ ఆర్కైవ్స్, వీర్ వైష్ణవ్ జీవన్ గాథా)