DushyantChautala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
DushyantChautala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, అక్టోబర్ 2019, గురువారం

Dushyant Chautala: దుష్యంత్ చౌతాలా.. చిన్న వయసులోనే పెద్ద పదవులు అందుకున్న నేత




హరియాణాలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ మద్దతిస్తే సీఎం అయ్యే సూచనలున్నాయి.
దుష్యంత్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు. హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలాకు మనవడు. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా. దుష్యంత్ బాబాయి అభయ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ అధినేత. దుష్యంత్ కూడా ఇటీవల వరకు ఆ పార్టీలోనే ఉండేవారు. కొద్దికాలం కిందట ఆయన బాబాయితో విభేదించి బయటకు వచ్చేసి జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) పెట్టారు. తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేసి కింగ్ మేకర్‌గా ఎదిగారు.
1988 ఏప్రిల్ 3న జన్మించిన దుష్యంత్ చౌతాలా 26 ఏళ్ల వయసులో 2014లో లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. హిస్సార్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. 2018లో ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చి జేజేపీ ప్రారంభించారు.
దేవీలాల్ కుటుంబ వారసుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కొన్ని నెలల క్రితం నిలువునా చీలిపోయింది. ఇలా చీలిపోయిన దేవీలాల్ కుటుంబ సభ్యులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డారు. దుష్యంత్ కొత్త పార్టీ పెట్టడంతో ఒకప్పుడు హర్యానాలో ప్రబల శక్తిగా ఉన్న ఐఎన్‌ఎల్‌డీ బలం ఇప్పుడు గణనీయంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ ఇప్పుడు అనేక స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీని పక్కకు నెట్టి మూడో పక్షంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు దేవీలాల్ రాజకీయ వారసత్వ ప్రతినిధిగా జేజేపీ ఆవిర్భవించింది.
దుష్యంత్ తన ప్రసంగాలలో దేవీలాల్‌కు నిజమయిన రాజకీయ వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. దేవీలాల్ గురించి, ఆయన రాజకీయ విధానాల గురించి దుష్యంత్ మాట్లాడుతున్నారు. అయితే, ఆయన ఏ సభలోనూ తన తాత ఓంప్రకాశ్ చౌతాలా పేరును ప్రస్తావించలేదు. ఎందుకంటే, రాజకీయ వారసత్వ పోరులో ఓం ప్రకాశ్ చౌతాలా తన బాబాయి అభయ్ చౌతాలాకు మద్దతిచ్చారని దుష్యంత్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అదే సమయంలో దుష్యంత్ తన ప్రసంగాలలో ఎక్కడ కూడా వారిని విమర్శించడం లేదు. దేవీలాల్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసికెళ్లే క్రమంలో దుష్యంత్ జింద్ జిల్లాలోని ఉచన కలాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రేమలతతో తలపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలత.

Dushyant Chautala దుష్యంత్ చౌతాలా: ప్రఫుల్ల కుమార్ మహంతో రికార్డు బద్దలు కొడతారా?




హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని మలుపు తిరుగుతుండడంతో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ముఖ్యమంత్రయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 16వ లోక్‌సభ‌కు ఎంపీగా ఎన్నికైన దుష్యంత్ పేరిట ఇంతవరకు దేశంలో అత్యంత చిన్నవయసులో ఎంపీగా గెలిచిన వ్యక్తిగా రికార్డు ఉంది. ఇప్పుడు దుష్యంత్ చౌతాలా హరియాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే దేశంలో ఒక పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రయినవారిలో అత్యంత చిన్నవయసు నేతగా రికార్డు సృష్టిస్తారు. ఇంతవరకు ఆ రికార్డు అస్సాం మాజీ సీఎం ప్రఫుల్లకుమార్ మెహంతా పేరిట ఉంది.
90 అసెంబ్లీ సీట్లున్న హరియాణాలో మేజిక్ ఫిగర్ 46 ఎవరూ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ ఎక్కువ సీట్లలో అధిక్యం ఉన్నా కూడా ఆ పార్టీ కూడా 46 సీట్లు సాధించడం కష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అంతకంటే వెనుకబడే ఉంది. ఈ పరిస్థితుల్లో దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ పదికి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే దుష్యంత్‌ను సంప్రదించి అవసరమైన పక్షంలో ఆయన్నే సీఎంను చేస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
అదే జరిగితే దుష్యంత్ చౌతాలా హరియానా సీఎం కావడం ఖాయం. అప్పుడు ఇంతవరకు అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతో పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది. దేశంలోనే అత్యంత చిన్న సీఎంగా దుష్యంత్ రికార్డు సృష్టిస్తారు.
దేశంలో అత్యంత చిన్న వయసులో సీఎం పదవి దక్కించుకున్న నేతలుగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరేమో అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతో(Prafulla Kumar Mahanta) కాగా.. మరొకరు పాండిచ్చేరి మాజీ సీఎం ఎంవోహెచ్ ఫరూక్(M. O. H. Farook). రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే అత్యంత చిన్నవయసులో సీఎం అయిన రికార్డు ఎం.ఒ.హెచ్ ఫరూక్(M. O. H. Farook) పేరిట ఉంది. పూర్తి స్థాయి రాష్ట్రానికి చిన్న వయసులో సీఎం అయిన రికార్డు ప్రఫుల్ల కుమార్ మహంతోది.

ఎం.ఒ.హెచ్.ఫరూక్(M. O. H. Farook): 29 ఏళ్లకే సీఎం

1937 సెప్టెంబరు 6న జన్మించిన ఫరూక్ 1967 ఏప్రిల్ 6న పాండిచ్చేరికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయన వయసు 29 సంవత్సరాలు మాత్రమే. 1967 ఏప్రిల్ 9 నుంచి 1968మార్చి 6వరకు మొదటి విడత.. 1969 మార్చి 17 నుంచి 1974 జనవరి 3 వరకు రెండో విడత.. 1985 నుంచి 1990 వరకు మూడోసారి ఆయన పాండిచ్చేరికి సీఎంగా ఉన్నారు. అనంతంర కేంద్ర మంత్రిగా, గవర్నరుగా, సౌదీలో భారత రాయబారిగానూ పనిచేశారు. కేరళ గవర్నరుగా ఉంటున్న సమయంలో 2012 జనవరి 26న మరణించారు.

ప్రఫుల్ల కుమార్ మహంతో(Prafulla Kumar Mahanta): 32 ఏళ్లకు సీఎం

అస్సాంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అస్సాం గణపరిషత్ పార్టీ స్థాపించి 32 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని సంచలనం సృష్టించిన లీడర్ ప్రఫుల్ల కుమార్ మహంతో.
1952 డిసెంబరు 23న జన్మించిన ప్రఫుల్ల కుమార్ మహంతో 1985 డిసెంబరు 24న 33 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. రెండు సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

దుష్యంత్ చౌతాలా(Dushyant Chautala): 32 ఏళ్లు

ఇప్పుడు దుష్యంత్ హరియాణా సీఎం అయితే ప్రఫుల్ల కుమార్ మహంతో  రికార్డు కనుమరుగు కానుంది.
దుష్యంత్ చౌతాలా 1988 ఏప్రిల్ 3న జన్మించారు. ఇప్పడు 2019 అక్టోబరు, నవంబరు నెలల్లో ఆయన సీఎం బాధ్యతలు చేపడితే 32 ఏళ్లకు సీఎం అయినట్లవుతుంది.