30, నవంబర్ 2019, శనివారం

Priyanak Reddy Rape, Murder: ప్రియాంకా రెడ్డి చివరి ఫోన్ కాల్ ఇదే.. మొత్తం వినండి


హైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్యకు గురయిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి చనిపోవడానికి ముందు తన చెల్లెలుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణ విన్న ప్రతి ఒక్కరి మనసు చలిస్తోంది. ఈ సంభాషణలు మొత్తం ఇవీ..

ప్రియాంకారెడ్డి: పోయావా పాపా ఆఫీస్‌కి.
చెల్లెలు: హా.
ప్రియాంకారెడ్డి: నాదిప్పుడు అయిపోయింది. వచ్చినా ఇప్పుడు.
చెల్లెలు: హా.
ప్రియాంకారెడ్డి: మాట్లాడు.. కొంచెం సేపు మాట్లాడు.
చెల్లెలు: ఏమైందే.
ప్రియాంకారెడ్డి :మాట్లాడు పాపా నీకు తర్వాత చెప్తా.
చెల్లెలు: యాక్సిడెంట్ అయిందా? చెప్పు.
ప్రియాంకారెడ్డి :నాకు చాలా టెన్షన్ గా ఉందే.
చెల్లెలు: యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంకారెడ్డి : అక్కడ ఎప్పుడూ బైక్ పెట్టి పోతానని చెప్పినా కదా. ఆ రోజు అక్కడ పెట్టిన, నిలబడ్డ. టోల్ కలెక్ట్ చేసేటాయన పిలిచి ఇక్కడ బైక్ పెట్టకండి మేడమ్, ఇంతకు ముందే పోలీసువాళ్లు తీసుకొనిపోయిన్రు అంటే.. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఇంకొక దారి ఉంటుంది కదా, అక్కడ పెట్టాను. ఇప్పుడు దిగి వచ్చాను పాపా ఇక్కడికి. స్కూటీ పంక్చర్ అయింది.
చెల్లెలు : మరి వదిలేసి రా. ఇంకేంటి?
ప్రియాంకారెడ్డి : వదిలేస్తే ఎట్ల, మల్ల పొద్దున ఎవరు తీసుకొస్తరే?
చెల్లెలు : ఇంక రేపొద్దున్న ఎవరినైనా తీసుకెళ్లి చేయించి తీసుకురావాలి.
ప్రియాంకారెడ్డి : ఎవర్ని తీసుకెళ్లాలి?
చెల్లెలు: మెకానిక్‌ని.
ప్రియాంకారెడ్డి : మెకానిక్ నా?
చెల్లెలు : అవును మెకానిక్‌ని. కొంచెం దూరం కూడా పోదానె పంక్చర్ అయితే? చూడాలి వస్తందేమో.
ప్రియాంకారెడ్డి : వెనకాల టైర్.
చెల్లెలు : నాకు తెలీదు కదా.
ప్రియాంకారెడ్డి : అయితే.. చెప్తా విను. ఇక్కడొక లారీ ఉందే. అందులో జనాలు ఉన్నారు. అందులో ఒకాయన నేను చేయించుకొస్తా అని తీసుకొని పోయిండు స్కూటీ.
చెల్లెలు : తీసుకురాలేదా మళ్లీ స్కూటీ?
ప్రియాంకారెడ్డి : తీసుకొచ్చిండు. క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చింది. మళ్లీ ఇంకో షాప్‌కు పోయి చేయించుకొస్తా అని తీసుకెళ్లిండు. భయం అయితాంది పాపా నాకు.
చెల్లెలు : ఎవరూ లేరా అక్కడ?
ప్రియాంకారెడ్డి : వెహికల్స్ ఉన్నాయి. టోల్ ఉంటాది చూడూ.. ఆడ. నేను వెళ్తా అంటే వద్దు నేనే వెళ్తా అని దెయ్యంలా వెంట పడిండు. వద్దు మధ్యలో ఆగిపోతోంది అన్నాడు. నాకు భయం అయితాంది పాపా.
చెల్లెలు : ఎందుకు? ఏమైతుంది? ఉండు అక్కడ, టోల్ గేట్ దగ్గర.
ప్రియాంకారెడ్డి :వాళ్లు బయటనే నిలబడిండ్రు.
చెల్లెలు : ఎవరు?
ప్రియాంకారెడ్డి : లారీస్ వాళ్లు.
చెల్లెలు : నువ్వు, టోల్ గేట్ ఉంటుంది కదా.. అక్కడికి వెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : అక్కడకా? నువ్వు మాట్లాడు పాపా.. భయం అయితాంది.
చెల్లెలు: టోల్ ప్లాజా దగ్గర ఇస్తారు కదా టికెట్లు.. అక్కడికెళ్లు, అక్కడికెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : వీళ్లేంటే.. సడెన్‌గా ఎవరూ కనిపస్తలేరు. దెయ్యాల్లా ఈడనే ఉన్నరు అంతసేపు.
కనిపించిన్రులే. నేను పోతున్నా పాపా.. ఎక్కి స్టార్ట్ చేసిన. కిందికొచ్చి.. మేడమ్ మేడమ్ టైర్ పంక్చర్ అయిందని. బస్టాండ్ వరకూ వెళ్లదా.. బస్టాండ్ దగ్గర షాప్ ఉంటదే, అక్కడ చేయించుకుంటా అంటే, లేదు మేడమ్ వద్దు మేడమ్ నేను చేయించుకొస్తా అని ఎవడో ఒక పిలగాడ్ని పంపించిండు. ఆ దెయ్యం పిలగాడు పోయిండు. ఉత్తగ వచ్చిండు. సర్లేండి మళ్లీ ఎక్కడో ఇంకొక షాప్ ఉందని చెప్పిండు. ఇంక లేట్ అవుతోంది నేను వెళ్తా అంటే.. లేదు మేడమ్, మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. కష్టం అవుతుందని దయ్యాల్లాగా నా వెంట పడిండ్రే.
చెల్లెలు : నిజంగానే సడెన్‌గా మధ్యలో ఆగిపోతే అప్పుడేం చేస్తావ్?
ప్రియాంకారెడ్డి : నాకు ఇక్కడ చాలా భయం అయితాంది.
చెల్లెలు : టోల్ గేట్ దగ్గరకు వెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : ఆ టోల్ బూత్ దగ్గర ఏం నిలబడాలే. అందరూ నన్నే చూస్తారు. ఆడ నిలబడితే.
చెల్లెలు : చూస్తే చూడనీ.. కాస్త జనాలైనా ఉంటారు కదా ఆడ.
ప్రియాంకారెడ్డి: చాలా భయం అవుతోంది వాల్లను చూస్తుంటే. ఏడుపొస్తోందే..
భయం అయితాంది పాపా. ఇంకా తీస్కరాలేదే.. దెయ్యం ముసుగోడు.
చెల్లెలు : తీసుకొస్తడు లే.
ప్రియాంకారెడ్డి: నాకు వాళ్లను చూస్తుంటే చాలా భయంగా ఉందే.. ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు.
చెల్లెలు : సరే కొంచెంసేపైన తర్వాత మళ్లీ చేస్తా.
ప్రియాంకారెడ్డి: (ఏడుస్తూ..) ప్లీజ్ పాపా..
చెల్లెలు: సరే కొంచెంసేపైన తర్వాత చేస్తా.

షాద్ నగర్ అత్యాచారం-హత్య: PriyankaReddy ని అత్యాచారం చేసి ఎవరు చంపారు? ఎందుకు చంపారు?

ప్రియాంకారెడ్డి(Priyanka Reddy) ఒక వెటర్నరీ డాక్టర్. బుధవార రాత్రి ఆమెను హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ వద్ద నలుగురు యువకులు మహమ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌లు దారుణంగా సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం శవాన్ని గురువారం వేకువజామున ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చింతపల్లి గ్రామం సమీపంలో పెట్రోలు పోసి కాల్చేశారు.

నిందితులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అత్యాచారం, హత్యకు గురయిన ప్రియాంక రెడ్డి పశు వైద్యురాలు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె సొంతూరు. ఈ కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది. ప్రియాంక రెడ్డి బుధవారం సాయంత్రం గచ్చిబౌలి వెళ్ళారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్ దగ్గర తొండుపల్లి టోల్ ప్లాజాకి కాస్త దూరంలో బండి పెట్టి అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి ప్లాజా దగ్గరకు వచ్చారు.
అప్పుడు ఆమె బండి పంక్చర్ అయిందని అక్కడున్న లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేసే నలుగురు నిందితులు ఆమెతో చెప్పారు. పంక్చర్ వేయించుకుని వస్తామని బండి తీసుకెళ్లి ఆమెను అక్కడ వెయిట్ చేసేలా చేశారు. అంతలోనే ఆమెను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు.
నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడానికి ముందే ఆమె వారి తీరును అనుమానించి భయంతో తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది. చెల్లెలు ఆమెను టోల్ ప్లాజా వద్దకు వచ్చి వెయిట్ చేయమని చెప్పింది. అయితే, తిరిగి రాత్రి 9.44 ప్రాంతంలో సోదరి మళ్లీ కాల్ చేయగా, ఫోన్ స్విచాఫ్‌ అయి ఉంది. అప్పుడు కుటుంబ సభ్యులు టోల్ ప్లాజాకు వెళ్లారు. రాత్రంతా వెతికి అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేసు నమోదయింది. గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ దగ్గర్లో స్థానికులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం అక్కడకు చేరిన బంధువులు, గొలుసు, చున్నీ ఆధారంగా ఆ మృతదేహం డాక్టర్‌దేనని గుర్తించారు. పోలీసులు అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
బాధితురాలు తన సోదరికి చెప్పిన కథనం ప్రకారం, ఒక లారీ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చి మీ బండి పంక్చర్ అయిందనీ, తాను బాగు చేయిస్తాననీ అన్నాడు. అవసరంలేదు తానే పంక్చర్ షాపుకు వెళ్తానన్నప్పటికీ తాను సాయం చేస్తానంటూ తీసుకెళ్లాడు. దీంతో అతనికి దూరంగా టోల్ ప్లాజా దగ్గర నిలబడమని బాధితురాలికి సోదరి సూచించగా, ఆమె నిరాకరించారు. అందరూ చూస్తారని భయపడింది. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయింది.
ఉదయం ఏడు గంటలకు షాద్ నగర్ పోలీసులకు మృతదేహం గురించి సమాచారం వచ్చింది. పోల్చి చూడగా అది రాత్రి మిస్ అయిన కేసుకు సంబంధించినదే అని తేలింది.

23, నవంబర్ 2019, శనివారం

అజిత్ పవార్: శరద్ పవార్‌కు ఏమవుతారు? రాజకీయంగా ఎలా ఎదిగారు?

అజిత్ పవార్

అజిత్ పవార్(Ajit pawar).. మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharashtra Politics) ట్రంప్ కార్డు వేసిన ఈ నాయకుడి పేరు అందరి నోళ్లలో నానుతోంది. శివసేన(Shivsena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్(Congress)లకు షాకిస్తూ బీజేపీని అధికారంపీఠంపై కూర్చోబెట్టిన నేత అజిత్ పవార్. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి, బీజేపీకి మద్దతు ప్రకటించి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని ట్విస్ట్ ఇచ్చిన నాయకుడు. శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణం చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్న కుమారుడే అజిత్ పవార్. గోవిందరావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ స్టూడియోస్'లో అనంతరావ్ పవార్ పని చేసేవారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ పదో తరగతి తరువాత తండ్రి చనిపోవడంతో విద్యాభ్యాసాన్ని వదిలేసి, తన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ ఓ బలమైన నేతగా ఎదిగారు. మరోవైపు, తన చదువును కొనసాగించడానికి పుణె జిల్లా నుంచి అజిత్ పవార్ ముంబైకి మకాం మార్చారు. 1982లో అజిత్ పవార్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎన్నికై... అదే పదవిలో ఏకంగా 16 సంవత్సరాలు కొనసాగారు.
అనంతరం  బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తన చిన్నాన్న శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన శరద్ పవార్ పీవీ నరసింహారావు కేబినెట్ లో రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ గెలుపొందారు. ఇదే స్థానం నుంచి వరుసగా 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. పృథ్విరాజ్ చవాన్ సీఎంగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పదంసిన్హ్ పాటిల్ కుమార్తె సునేత్రను అజిత్ పవార్ పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.

దేవేంద్ర ఫడణవీస్: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ఆయనే.. అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి

దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్


దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis), అజిత్ పవార్, మహారాష్ట్ర, Devendra Fadnavis, Ajit Pawar, Maharashtra, దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన

మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. బీజేపీ, ఎన్సీపీ కూటమిగా అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ రాజకీయాల ముందు శివసేన నిలవలేకపోవడంతో కొన్నివారాలుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు దొరుకుతూ దేవేంద్ర ఫడణవీస్ మరోసారి ముఖ్యమంత్రయ్యారు. శనివారం ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ ఖోశ్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఇస్తామని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఫడణవీస్ చెప్పారు. ఫడణవీస్, అజిత్ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర భవిష్యత్ కోసం వారు పాటుపడతారని మోదీ పేర్కొన్నారు.

22, నవంబర్ 2019, శుక్రవారం

George Reddy జార్జి రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?


జార్జి రెడ్డి(George Reddy)... ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)లో 47 ఏళ్ల కిందట హత్యకు గురయిన విద్యార్థి నేత. ఆయన జీవితం నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా తెలుగునాట ఆయన చుట్టూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన విద్యార్థులు, అణగారిన వర్గాల సమస్యల కోసం పోరాడిన నాయకుడంటూ కొందరు.. కాదు కాదు, ఆయనో రౌడీ అంటూ మరికొందరు వాదిస్తున్నారు. జార్జిరెడ్డి అందరిపై దౌర్జన్యాలు చేసేవాడని.. బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగరరావును ఆయన అప్పట్లో కొట్టాడన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆయన్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు.. ఎలా చంపారు? నిందితులు ఎలా విడుదలయ్యారనే విషయాల్లో ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికగా అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. ఆయన్ను భగత్ సింగ్, చేగువేరాలతో పోల్చుతూ పాత అభిమానులతో పాటు కొత్త అభిమానులు పుట్టుకొస్తుంటే ఆయన్ను విమర్శించేవారూ ఎక్కువయ్యారు.
ఇదే సమయంలో జార్జి రెడ్డి పేరే కులాన్ని సూచిస్తున్నప్పటికీ ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జార్జి రెడ్డి కులం, ఊరు, తల్లిదండ్రులు, జన్మదినం, భార్య పేరు, లవ్ ఎఫైర్స్ ఉన్నాయా అంటూ గూగుల్‌ను ప్రశ్నించి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిలో కొన్నిటికి సమాధానమే ఈ ఆర్టికల్.
జార్జిరెడ్డి జన్మదినం: భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరమైన 1947లో సంక్రాంతి రోజున(జనవరి 15న) జార్జి రెడ్డి జన్మించారు.
జార్జి రెడ్డి తల్లిదండ్రులు: చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్. తల్లి లీలా వర్గీస్‌ది కేరళ రాష్ట్రం పాల్ఘాట్. తండ్రిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా.
జార్జి రెడ్డి భార్య: జార్జి రెడ్డి అవివాహితుడు. 25 ఏళ్ల వయసులోనే హత్యకు గురయ్యాడు.
జార్జి రెడ్డి ప్రేమ కథ: జార్జి రెడ్డి ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా పోరాడారని సమకాలీకులు చెబుతారు. ఆయన స్త్రీలను గౌరవించేవారని, ఎవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని చెబుతారు.
జార్జి రెడ్డి మరణం: జార్జి రెడ్డి 1972, ఏప్రిల్ 14న ఉస్మానియా క్యాంప‌స్‌లో హత్యకు గురయ్యారు.

బొలీవియా సంక్షోభం అమెరికా పనేనా?

బొలీవియా, ఇవో మొరేల్స్, ఇవో మొరాలెస్ bolivia, evo morales

ఎక్కడ విలువైన ఖనిజ, చమురు నిక్షేపాలుంటాయో.. అక్కడ అమెరికా తమ డేగ రెక్కలతో వాలిపోతుంది. ఆ దేశ రాజ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తమకనుకూల వ్యక్తులను అధికారంలో ప్రతిష్ఠిస్తుంది. ఇప్పుడు బొలీవియాలోనూ అదే జరుగుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాశ్రేయస్సుకు పెద్దపీట వేసి, సామాజిక రాజకీయ మార్పుల కోసం కృషిచేస్తున్న మూలవాసుల నాయకుడు, దేశాధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ను పదవీచ్యుతుడ్ని చేసింది. సైనిక తిరుగుబాటుకు అమెరికా అన్నివిధాలా దన్నుగా నిలిచింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యం ఇచ్చే సైనిక పాలనలోకి బొలీవియా వెళ్లింది. మొరేల్స్‌ మెక్సికోలో తలదాచుకోవాల్సిన విషాదకర పరిస్థితి తలెత్తింది.
సైనిక పాలనకు వ్యతిరేకంగా బొలీవియా కార్మికులు, రైతులు, గిరిజనులు పెద్ద పోరాటమే చేశారు. రాజధాని లాపాజ్‌లోనూ, కార్మికవర్గం బలంగా ఉన్న ఎల్‌ ఆల్టోలోను సైన్యంతో తలపడుతూనే ఉన్నారు. కోచమ్‌బాంబాలో సైన్యం జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని సైన్యం దాడులకు పాల్పడింది. అక్టోబరు 20న జరిగిన అధ్యక్ష ఎన్నికను వివాదాస్పదం చేస్తూ మూడువారాల పాటు జరిగిన నిరసన ప్రదర్శనలు అంతిమంగా ఈ నెల 17న సైనిక తిరుగుబాటుకు దారితీశాయి. మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆనందానికి అవధుల్లేవు. ఇక వెనిజులా, నికరాగ్వా నాయకులకు కూడా ఇదే గతి పడుతుందనేలా మాట్లాడారు.
లాటిన్‌ అమెరికాలో తన సామ్రాజ్యవాద విధానాన్ని అమెరికా కొనసాగిస్తున్నదన్న వాస్తవాన్ని బొలీవియా సైనిక తిరుగుబాటు ప్రతిబింబిస్తోంది. 2002లో బుష్‌ నేతృత్వంలో వెనిజులాలో హుగో చావెజ్‌ మీద విఫల సైనిక కుట్ర నుంచి 2009లో ఒబామా మద్దతుతో హౌండురాస్‌లో మాన్యుయెల్‌ జెలాయా ప్రభుత్వాన్ని కూలదోయటం దాకా, నేడు బొలీవియా ఘటనతో లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై క్షీణిస్తున్న అమెరికా పెత్తనాన్ని తిరిగి నెలకొల్పేందుకు అమెరికా తన సామ్రాజ్యవాద విధానాన్ని సొంత పెరడు లాటిన్‌ అమెరికాలో సైనిక హింసతో కొనసాగిస్తున్నది.
బొలీవియాలో అపార ఇంధన, ఖనిజ వనరులున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో 70శాతం లిథియం ఇక్కడే ఉంది. ఇప్పటికే పొరుగున ఉన్న అర్జెంటీనా, చిలీ దేశాల్లో లిథియం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొలీవియాలో మాత్రం ప్రభుత్వరంగ సంస్థతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తవ్వకాలు సాగించాలని మొరేల్స్‌ పట్టుబట్టారు. ఆయన పలు కార్పొరేటు కంపెనీలను దేశం నుంచి బయటకు పంపించారు. దీంతో పశ్చిమాసియా మాదిరిగా ఈ ప్రాంతాన్ని గుప్పెట పెట్టుకోవాలన్న దురాశతోనే బొలీవియాలో అమెరికా సైనిక తిరుగుబాటును ప్రోత్సహించింది.
చైనాతో లాటిన్‌ అమెరికా వాణిజ్యం నిరుడు రూ.21,42,000కోట్లకు చేరుకోవడం కూడా అమెరికాకు కంటగింపుగా మారింది. మొరేల్స్‌.. లాటిన్‌ అమెరికా దేశాలలోనే మొదటి భూమిపుత్ర నాయకుడు. స్థానిక తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన నేత. 1998లో లాటిన్‌ అమెరికాలో హుగో చావెజ్‌తో మొదలైన బొలీవరియన్‌ విప్లవ క్రమంలో భాగంగా మొరేల్స్‌ ప్రభుత్వం ఏర్పడింది. 2000-05 మధ్యకాలంలో నీటిని ప్రైవేటీకరిం చడానికి వ్యతిరేకంగా, గ్యాస్‌ని జాతీయీకరించాలని జరిగిన ప్రజా ఉద్యమాలతో మొరేల్స్‌కు ముఖ్య భూమిక ఉంది. తద్వారా ఆయన అధ్యక్షుడయ్యారు. ఆయన గిరిజనుల నుంచి ఎన్నికైన తొలి అధ్యక్షుడు. ఆయన హయాంలో పేదరికం 45నుంచి 25శాతానికి తగ్గిపోయింది. అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. గనులనూ, వనరులనూ ప్రభుత్వరంగంలోకి తెచ్చి, విద్యనూ వైద్యాన్నీ సార్వత్రికం చేశారు. సహజవాయువును జాతీయం చేయగా సమకూరిన సొమ్మును దారిద్య్రనిర్మూలనకు ఉపయోగించారు. రానున్న విద్యుత్‌ బ్యాటరీల యుగంలో అత్యంత కీలకమైన లిథియం వనరును కార్పొరేట్‌ కంపెనీలు తన్నుకుపోడానికి ఆయన అనుమతించలేదు. కార్మికోద్యమ నేతగా, మూలవాసుల నాయకుడిగా, ప్రజాసంక్షేమ సారథిగా దశాబ్దంన్నరపాటు దేశాన్ని ఏలిన మొరేల్స్‌ తన పాలనలో దేశాన్ని సామాజిక, ఆర్థికాభివృద్ధికి మంచి నమూనాగా తీర్చిదిద్దాడు. గ్రామీణ పేదలు, కార్మికులు, భూమిపుత్రులు మొరేల్స్‌ విధానాలకు మద్దతుగా నిలిచారు. పట్టణ ప్రాంతాలలోని ఉన్నతవర్గం, శ్వేతజాతీయులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారారు. వీరికి విదేశీ కార్పొరేట్‌ సంస్థల వెన్నుదన్ను ఉంది. లాటిన్‌ అమెరికా దేశాలలో వనరులపై కన్నేసిన అమెరికా-యూరోపియన్‌ కంపెనీలే ఇక్కడ సంక్షోభాన్ని పెంచి పెద్దచేయడంలో కీలక పాత్ర వహించాయి. దాదాపు దశాబ్దంన్నరగా బొలీవియాను పాలిస్తున్న మొరేల్స్‌ అక్టోబరులో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఉన్నతవర్గాలకు చెందిన ప్రతిపక్షం గోలపెట్టింది. అంతర్జాతీయ బృందాలు దీనికి వంతపాడాయి. తిరిగి ఎన్నికలు జరిపించడానికి తాను సిద్ధమేనని మొరేల్స్‌ ప్రకటించినా.. మొరేల్స్‌ పోటీ చేయకూడదంటూ షరతు పెట్టడంతో ఆయన అంగీకరించలేదు. దీన్ని సాకుగా చేసుకొని సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారు. చిలీ ప్రజలు ఏ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారో వాటినే బొలీవియాపై రుద్దేందుకు ఈ సైనిక కుట్ర జరిగింది. చిలీలో అలెండీ ఏ విధానాలను అమలు చేసినందుకు అమెరికా హత్య చేయించిందో, అవే కారణాలతో బొలీవియా మొరేల్స్‌ను సైనిక కుట్రతో అమెరికా అధికారం నుంచి దించేసింది. ఇప్పుడు చిలీ ప్రజల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్నీ, సంక్షేమాన్నీ పరిరక్షించుకొనేందుకు బొలీవియన్లు ఉద్యమిస్తారని, అమెరికా కుట్రలు, కుతంత్రాల మెడలు వంచుతారని ఆశిద్దాం.

9, నవంబర్ 2019, శనివారం

అయోధ్య తీర్పు: రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదం కేసు మొత్తం కథ ఇదీ



Ayodhya Verdict: Ram Janmabhoomi-Babri Masjid land dispute case
అయోధ్యలోని ‘రామ జన్మభూమిబాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వివాదానికి ఈ రోజు ముగింపు పడుతుందని అంతా భావిస్తున్నారు. రాజకీయంగామతపరంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పు వెలువడిన తరువాత దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

ఇంతకీ ఏమిటీ వివాదం?

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులుముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో కొందరు మసీదును కూల్చడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి.
ఆ తరువాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తూ వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ్ లల్లాసున్నీ వక్ఫ్ బోర్డునిర్మొహీ అఖాడాలకు సమానంగా పంచాలని చెప్పింది.
దీనిపై హిందువులుముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేయటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పును సస్పెండ్ చేసింది.
అప్పటి నుంచి ఈ కేసును విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఆగస్టు 6 నుంచి తుది వాదనలు విన్నది.

కేసు పూర్వాపరాలు ఇవీ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అయోధ్యలో రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలం ఇది. ఇక్కడే బాబ్రీ మసీదు కూడా ఉండేది. ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించిన వివాదం ఇది. ఇక్కడ బాబ్రీ మసీదును నిర్మించడానికి ముందు అక్కడున్న ఆలయాన్ని కూల్చారన్నది ఒక వాదన. బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ధ్వంసం చేశారు. ఆ తరువాతే ఈ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. అక్కడ 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకురెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకుమూడో భాగం నిర్మోహి అఖాడాకు చెదుతుందని తీర్పు చెప్పారు.

హిందూముస్లింల వాదనలేంటి?

బాబ్రీ మసీదు నిర్మించిన స్థలం రాముడి జన్మస్థలమని16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారన్నది హిందువుల వాదన. ఆ మసీదులో 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామనిఆ ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారన్నది ముస్లింల వాదన.

న్యాయమూర్తుల్లోనూ భిన్నాభిప్రాయం

అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని చెప్పారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ''ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా'' దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు.
అదే ధర్మాసనంలో ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని.. ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.

31, అక్టోబర్ 2019, గురువారం

ఇందిరాగాంధీనే పార్టీ నుంచి బహిష్కరించిన ఏపీ మాజీ సీఎం



ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అదే తొలి ఓటమి. ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నిలువునా చీలిపోయింది. ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. 1977 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. కాసునే విజయం వరించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు.
దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు. 'ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర' అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు. అయితే, ఇందిర వర్గం ఏమీ వెనక్కి తగ్గలేదు. వీసీ శుక్లా, బన్సీ లాల్, అంబికా సోనీ, కరణ్ సింగ్, డీకే బారువా వంటివారు తనతో లేకున్నా బూటా సింగ్, ఏపీ శర్మ, జీకే మూపనార్, బుద్ధప్రియ మౌర్య వంటి కొత్త అనుకూల వర్గంతో ఇందిర తన 'ఇందిరా కాంగ్రెస్' వైపు నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.బూటా సింగ్ కొందరు నేతలను వెంటబెట్టుకుని కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి వెళ్లి 'నెహ్రూ కుమార్తెనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తావా' అంటూ నిలదీశారు. ఆ సంగతి మళ్లీ ఇందిరకు చెప్పగా.. 'ఎంతైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అమర్యాదకరంగా మాట్లాడడం సరికాదు' అని బూటాసింగ్‌ను మందలించారని రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో పేర్కొన్నారు.
బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు.అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీ గుర్తయిన 'ఆవు - దూడ' చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున 'ఆవు, దూడ' గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తుకే తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎలక్షన్ కమిషన్ అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది. మరోవైపు, ఇందిర వర్గం చీలిపోయిన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని 'రెడ్డి కాంగ్రెస్'గా పిలిచేవారు.  అటు రెడ్డి కాంగ్రెస్, ఇటు ఇందిరా కాంగ్రెస్ ఎవరికి వారు పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేశారు. బూటాసింగ్, ఏపీ శర్మ, మూపనార్ వంటి ఇందిర నమ్మకస్థులంతా ఆమెకు మద్దతుగా 700 మందికిపైగా ఉన్న ఏఐసీసీ సభ్యుల సంతకాలను సేకరించేందుకు దేశ వ్యాప్త యాత్ర మొదలుపెట్టారు. లఖ్‌నవూ, జైపూర్, పట్నా, భోపాల్, ముంబయి, జమ్ము, శ్రీనగర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, తిరువనంతపురం, బెంగళూరు సహా పలు ఇతర రాజధాని నగరాల్లో వారికి మంచి మద్దతు లభించింది.
కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని సూచించింది ఎలక్షన్ కమిషన్. అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేస్తారు బూటాసింగ్. లైన్లన్నీ అస్పష్టంగా ఉన్నాయి.. బూటాసింగ్ చెబుతున్నది ఇందిరకు స్పష్టంగా వినిపించలేదు. ఆ సమయంలో ఎంతో గందరగోళం చోటుచేసుకుంది. బూటాసింగ్ హాత్(హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు. ఆ సంగతి అర్థం చేసుకున్న బూటాసింగ్... ఏనుగు కాదు హస్తం అని వివరిస్తున్నా ఫోన్ లైన్ అస్పష్టంగా ఉండడం, బూటాసింగ్ స్వరం కూడా బాగా బొంగురుగా ఉండడంతో ఇందిరకు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆమె ఫోన్ రిసీవర్‌ను పక్కనే ఉన్న పీవీ నరసింహరావుకు ఇచ్చారు.బహు భాషా కోవిదుడైన పీవీకి వెంటనే విషయం అర్థమైంది. బూటా చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల మధ్య పోలిక వల్ల గందరగోళం తలెత్తిందని అర్థం చేసుకుని వెంటనే హస్తానికి ప్రత్యాయపదం సూచించి ఇందిరకు ఆ మాట చెప్పమంటారు. ''బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా''(బూటాసింగ్ గారూ.. పంజా అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ''ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి'' అని చెప్తారు. ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో రాసుకొచ్చారు.

హస్తం గుర్తు చాలామంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఇదేం గుర్తన్న విమర్శలు వచ్చాయి. కానీ, ఇందిర మాత్రం ఈ కొత్త గుర్తుపై సంతోషించారట. అందుకు కారణం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి.ఈ కొత్త గుర్తుతో ఆ బాధ తప్పిందని ఇందిర సంతోషించారట. ఇందిర గాంధీ కొత్త కాంగ్రెస్‌కు బలం చేకూరాక ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం పార్టీకి చెందిన వివిధ నేతల ఇళ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ, ఏదీ అంత అనుకూలంగా కనిపించలేదు. 3 జనపథ్‌లో ఎం.చంద్రశేఖర్ ఇల్లు.. ఆ తరువాత పండిట్ కమలాపతి త్రిపాఠీ ఇల్లు పరిశీలించారు. కానీ, వివిధ కారణాల వల్ల వాటినీ వద్దనుకున్నారు. ఆ సమయంలో జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లు బూటాసింగ్ దృష్టికొచ్చింది. లోక్‌సభ ఎంపీగా ఉన్న వెంకటస్వామి అప్పటికి ఒంటరిగా అక్కడ నివసిస్తున్నారు. అప్పటికి అవివాహితుడైన వెంకటస్వామి ఇల్లు ఎంతోమంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆశ్రయంగా ఉండేది. 10 జనపథ్‌‌లో అగ్రనేతలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారందరికీ 24 అక్బర్ రోడ్‌లోని వెంకటస్వామి ఇల్లు అడ్డాగా ఉండేది.  అక్కడ 'ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఇందిర)' అనే బోర్డు ఏర్పాటు చేయడంతో వెంకటస్వామి ఇల్లు అలా కాంగ్రెస్(ఐ) కార్యాలయంగా మారిందని '24 అక్బర్ రోడ్' పుస్తకంలో కిద్వాయి రాసుకొచ్చారు.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగ్గా మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్(ఐ) మంచి విజయం సాధించింది. బ్రహ్మానందరెడ్డి వర్గం ప్రభావం చూపలేకపోయింది. దీంతో కొద్దికాలానికే కాసు బ్రహ్మానందరెడ్డి తన నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్(ఆర్)ను కాంగ్రెస్(ఐ)లో విలీనం చేశారు. అనంతరం ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1980 లోక్‌సభ ఎన్నికల్లో 351 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాసు బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు 1964 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్: వన్ మ్యాన్ ఆర్మీ


పూర్తి పేరు: వల్లభ్‌భాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌
పుట్టిన తేదీ: 1875 అక్టోబరు 31
తల్లిదండ్రులు: లాడ్‌భాయి, జవేరీభాయ్‌.
జన్మస్థలం: నడియాద్‌, గుజరాత్‌
* 1893లో 18ఏళ్ల వయసులోనే జవేర్బాను పటేల్‌ పెళ్లి చేసుకున్నారు.
* 1901 నుంచి గోద్రా జిల్లా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
* 1903లో కుమార్తె మణిబెన్‌, 1905లో కుమారుడు దహ్యాభాయ్‌ జన్మించారు.
* 1910లో మిడిల్‌ టెంపుల్‌ వర్సిటీలో న్యాయవిద్య పై చదువులకు లండన్‌ వెళ్లారు.
* 1914లో క్రిమినల్‌ లాయరుగా అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
* 1915లో గుజరాత్‌ సభలో సభ్యుడిగా నియమితులయ్యారు. ముంబయిలో జరిగే భారత జాతీయ కాంగ్రెస్‌ సభలకు ప్రతినిధిగా ఎంపికయ్యారు.
* 1917 జనవరి 5న అహ్మదాబాద్‌ మున్సిపాలిటీలోని దరియాపూర్‌ వార్డు సభ్యుడిగా గెలిచారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం.ఈ ఎన్నికను కొందరు సవాలు చేయడంతో రద్దైంది. మే 14న మళ్లీ ఎన్నిక నిర్వహించగా తిరుగులేని విజయం సాధించారు.
* 1931లో భారత జాతీయ కాంగ్రెస్‌కు పోటీ ద్వారా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
* 1947లో దేశ విభజనపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పటేల్‌ విభజనకు అంగీకరించారు.
* 1950 డిసెంబరు 15న ముంబయిలో తుదిశ్వాస విడిచారు.
* 1991లో భారతరత్న వరించింది.


పట్టుదలకు మారుపేరు ఆయన.. అరువు తెచ్చుకున్న పుస్తకాలతో న్యాయవిద్య చదివి బారిస్టర్‌ ఎట్‌ లా పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన దీక్ష ఆయనది. ఎంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని, భోగభాగ్యాలను త్యజించి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగిన యోధుడాయన.  సమైక్య భారత నిర్మాతగా, సుపరిపాలన ప్రణాళికలకు ఆద్యుడిగా నిలిచిన ఆ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్.

చిన్ననాటి నుంచి అదే పట్టుదల

ఉక్కుమనిషిగా గుర్తింపు పొందిన వల్లభాయ్ పటేల్‌ది దృఢ చిత్తం. ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించని తత్వం ఆయనది.   పట్టుదల, సంకల్పబలం వల్లభ్‌భాయ్‌కు చిన్ననాడే ఒంటబట్టాయి. న్యాయవాద విద్యలో బారిస్టర్‌ కావాలన్నది పటేల్‌ కల. అది నెరవేరాలంటే ఇంగ్లాండ్‌ వెళ్లి బారిస్టర్‌ ఎట్‌ లా చదవాలి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పటేల్‌కు ఆ ఖర్చును తట్టుకోవడం సాధ్యం కాని పని. కానీ ఆయన పట్టు వదల్లేదు. న్యాయవిద్య చదువుతున్న స్నేహితుడి దగ్గర పుస్తకాలు అరువు తెచ్చుకుని చదువుకున్నారు. నిత్యం కోర్టుకు వెళ్లి న్యాయవాదులు ఎలా వాదిస్తారో చూసి తెలుసుకున్నారు. అలా న్యాయ విద్యను అభ్యసించి గుజరాత్‌లోని గోద్రాలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

అన్న కోసం త్యాగం

బారిస్టర్‌ చదవడానికి సరిపడా డబ్బు సంపాదించారు. కానీ వెంటనే ఇంగ్లాండ్‌ వెళ్లిపోలేదు. బారిస్టర్‌ కావాలని కలలుగన్న తన అన్న విఠల్‌భాయ్‌ పటేల్‌ను ముందు ఇంగ్లాండ్‌ పంపించారు. ఆయన బారిస్టర్‌ చదువు పూర్తి చేసుకుని వచ్చాకే వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఇంగ్లాండ్‌ బయల్దేరారు. బారిస్టర్‌ ఎట్‌ లా పరీక్షలో ప్రథముడిగా నిలిచి తన కల నిజం చేసుకున్నారు.

గాంధీని కలిశాక మారిన దారి

ఎంతో ఇష్టపడి, చిన్ననాటి నుంచి లక్ష్యంగా పెట్టుకుని బారిస్టర్‌ చదివిన పటేల్‌ న్యాయవాద వృత్తిలో విశేషంగా రాణిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీని కలిశారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ సాగిస్తున్న అహింసాయుత పోరాటంతో స్ఫూర్తి పొందారు. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తానూ సంగ్రామంలోకి దూకారు.
మహిళలు ఇచ్చిన బిరుదు సర్దార్
1918లో బ్రిటిష్‌ ప్రభుత్వం గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో భూమిశిస్తును భారీగా పెంచింది. పన్ను తగ్గించేవరకు సహాయ నిరాకరణ చేయాలని గాంధీజీ ప్రజలకు సూచించారు. ఈ ఉద్యమాన్ని నడిపే బాధ్యతను పటేల్‌ భుజస్కంధాలపై పెట్టారు. రైతులను, ముఖ్యంగా రైతు మహిళలను ఏకం చేసి పటేల్‌ పోరాడారు. ‘ఈ ఉద్యమంలో మనకెన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆస్తులు జప్తు చేయొచ్చు. కానీ మనం వెనక్కి తగ్గొద్దు. మన పోరాటమే మనకు శ్రీరామరక్ష’ అని వారిలో ధైర్యం నూరిపోశారు. రైతుల సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్ధృతికి బ్రిటిష్‌ ప్రభుత్వం తలొగ్గింది. పన్నుల పెంపును రద్దు చేసింది. దీంతో ఉద్యమ సారథిగా పటేల్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అప్పుడే ఆ ప్రాంత మహిళలు సర్దార్‌ అని పటేల్‌కు బిరుదునిచ్చారు. అదే తర్వాత ఆయనకు ఇంటిపేరయింది. తర్వాత బర్దోలీ ఉద్యమాన్నీ పటేల్‌ ముందుండి నడిపారు.

దేశాన్ని ఏకం చేసిన ఘనుడు

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సమయం దగ్గరపడిన కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ‘విభజించి పాలించు’ సిద్ధాంతంతో దేశాన్ని రెండు ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిందన్న ఆనందం అనుభవించకముందే విభజనతో భరతజాతిని నిలువునా చీల్చేసింది. కొందరు సంస్థానాదీశులు భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించలేదు. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి పెనుసవాలుగా నిలిచిన ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను ప్రధాని నెహ్రూ.. పటేల్‌కు అప్పగించారు. అప్పటికి పటేల్‌ వయసు 72 సంవత్సరాలు. అయినా ఆయన వయోభారాన్ని లెక్క చేయలేదు. సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేసేవరకు విశ్రమించలేదు. సంస్థానాధీశులను ఒప్పించారు. హైదరాబాద్‌ నిజాంలా మొండికెత్తిన వాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. మొత్తానికి భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా నిలిపారు.

అఖిల భారత సర్వీసులు ఆయన ఆలోచనే

దేశంలో అతిపెద్ద వర్గంగా ఉన్న రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి స్వాత్రంత్య్ర సంగ్రామంలో ముందుకు నడిపించారు పటేల్‌. విభిన్న కులాలు, మతాలు, వర్గాలను కూడగట్టి పోరాడారు. అయితే స్వరాజ్యం సాధించిన తర్వాత దేశం ముందు నిలిచిన మరో పెద్ద సవాలు.. సురాజ్య స్థాపన. అంటే సుపరిపాలన. విభిన్న కులాలు, మతాలు, వర్గాలు, జాతులుగా ఉన్న దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని పటేల్‌ బలంగా విశ్వసించారు. దేశ తొలి ఉపప్రధానిగా, హోం మంత్రిగా ఆ లక్ష్యసాధనలో త్రికరణశుద్ధిగా శ్రమించారు. పరిపాలనా సౌలభ్యం కోసం అఖిలభారత సర్వీసులు తేవాలన్న ఆలోచన పటేల్‌దే.

మంచి అడ్మినిస్ట్రేటర్

పోరాట యోధుడిగానే కాదు.. పరిపాలనా దక్షుడిగానూ భారతావని పటేల్‌ను వేనోళ్ల పొగుడుతుంది. కానీ పటేల్‌ ఉపప్రధాని కాకముందే.. అసలు స్వాతంత్రోద్యమంలోకి రాకముందే ఆయన పాలనాదక్షతను అహ్మదాబాద్‌ ప్రజలు కళ్లారా చూశారు. న్యాయవాద వృత్తిలో ఉండగానే 1917లో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అహ్మదాబాద్‌కు నగర శానిటేషన్‌ కమిషనర్‌గా పని చేశారు. పరిశుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. 1922, 1924, 1927ల్లో అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. నగరమంతటా విద్యుత్‌ సరఫరా, విద్యారంగంలో సంస్కరణలు ఇలా ఎన్నింటికో ఆయనే శ్రీకారం చుట్టారు.

24, అక్టోబర్ 2019, గురువారం

Dushyant Chautala: దుష్యంత్ చౌతాలా.. చిన్న వయసులోనే పెద్ద పదవులు అందుకున్న నేత




హరియాణాలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ మద్దతిస్తే సీఎం అయ్యే సూచనలున్నాయి.
దుష్యంత్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు. హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలాకు మనవడు. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా. దుష్యంత్ బాబాయి అభయ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ అధినేత. దుష్యంత్ కూడా ఇటీవల వరకు ఆ పార్టీలోనే ఉండేవారు. కొద్దికాలం కిందట ఆయన బాబాయితో విభేదించి బయటకు వచ్చేసి జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) పెట్టారు. తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేసి కింగ్ మేకర్‌గా ఎదిగారు.
1988 ఏప్రిల్ 3న జన్మించిన దుష్యంత్ చౌతాలా 26 ఏళ్ల వయసులో 2014లో లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. హిస్సార్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. 2018లో ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చి జేజేపీ ప్రారంభించారు.
దేవీలాల్ కుటుంబ వారసుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కొన్ని నెలల క్రితం నిలువునా చీలిపోయింది. ఇలా చీలిపోయిన దేవీలాల్ కుటుంబ సభ్యులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డారు. దుష్యంత్ కొత్త పార్టీ పెట్టడంతో ఒకప్పుడు హర్యానాలో ప్రబల శక్తిగా ఉన్న ఐఎన్‌ఎల్‌డీ బలం ఇప్పుడు గణనీయంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ ఇప్పుడు అనేక స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీని పక్కకు నెట్టి మూడో పక్షంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు దేవీలాల్ రాజకీయ వారసత్వ ప్రతినిధిగా జేజేపీ ఆవిర్భవించింది.
దుష్యంత్ తన ప్రసంగాలలో దేవీలాల్‌కు నిజమయిన రాజకీయ వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. దేవీలాల్ గురించి, ఆయన రాజకీయ విధానాల గురించి దుష్యంత్ మాట్లాడుతున్నారు. అయితే, ఆయన ఏ సభలోనూ తన తాత ఓంప్రకాశ్ చౌతాలా పేరును ప్రస్తావించలేదు. ఎందుకంటే, రాజకీయ వారసత్వ పోరులో ఓం ప్రకాశ్ చౌతాలా తన బాబాయి అభయ్ చౌతాలాకు మద్దతిచ్చారని దుష్యంత్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అదే సమయంలో దుష్యంత్ తన ప్రసంగాలలో ఎక్కడ కూడా వారిని విమర్శించడం లేదు. దేవీలాల్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసికెళ్లే క్రమంలో దుష్యంత్ జింద్ జిల్లాలోని ఉచన కలాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రేమలతతో తలపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలత.

Dushyant Chautala దుష్యంత్ చౌతాలా: ప్రఫుల్ల కుమార్ మహంతో రికార్డు బద్దలు కొడతారా?




హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని మలుపు తిరుగుతుండడంతో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ముఖ్యమంత్రయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 16వ లోక్‌సభ‌కు ఎంపీగా ఎన్నికైన దుష్యంత్ పేరిట ఇంతవరకు దేశంలో అత్యంత చిన్నవయసులో ఎంపీగా గెలిచిన వ్యక్తిగా రికార్డు ఉంది. ఇప్పుడు దుష్యంత్ చౌతాలా హరియాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే దేశంలో ఒక పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రయినవారిలో అత్యంత చిన్నవయసు నేతగా రికార్డు సృష్టిస్తారు. ఇంతవరకు ఆ రికార్డు అస్సాం మాజీ సీఎం ప్రఫుల్లకుమార్ మెహంతా పేరిట ఉంది.
90 అసెంబ్లీ సీట్లున్న హరియాణాలో మేజిక్ ఫిగర్ 46 ఎవరూ సాధించే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ ఎక్కువ సీట్లలో అధిక్యం ఉన్నా కూడా ఆ పార్టీ కూడా 46 సీట్లు సాధించడం కష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అంతకంటే వెనుకబడే ఉంది. ఈ పరిస్థితుల్లో దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ పదికి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే దుష్యంత్‌ను సంప్రదించి అవసరమైన పక్షంలో ఆయన్నే సీఎంను చేస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
అదే జరిగితే దుష్యంత్ చౌతాలా హరియానా సీఎం కావడం ఖాయం. అప్పుడు ఇంతవరకు అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతో పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది. దేశంలోనే అత్యంత చిన్న సీఎంగా దుష్యంత్ రికార్డు సృష్టిస్తారు.
దేశంలో అత్యంత చిన్న వయసులో సీఎం పదవి దక్కించుకున్న నేతలుగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరేమో అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతో(Prafulla Kumar Mahanta) కాగా.. మరొకరు పాండిచ్చేరి మాజీ సీఎం ఎంవోహెచ్ ఫరూక్(M. O. H. Farook). రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే అత్యంత చిన్నవయసులో సీఎం అయిన రికార్డు ఎం.ఒ.హెచ్ ఫరూక్(M. O. H. Farook) పేరిట ఉంది. పూర్తి స్థాయి రాష్ట్రానికి చిన్న వయసులో సీఎం అయిన రికార్డు ప్రఫుల్ల కుమార్ మహంతోది.

ఎం.ఒ.హెచ్.ఫరూక్(M. O. H. Farook): 29 ఏళ్లకే సీఎం

1937 సెప్టెంబరు 6న జన్మించిన ఫరూక్ 1967 ఏప్రిల్ 6న పాండిచ్చేరికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయన వయసు 29 సంవత్సరాలు మాత్రమే. 1967 ఏప్రిల్ 9 నుంచి 1968మార్చి 6వరకు మొదటి విడత.. 1969 మార్చి 17 నుంచి 1974 జనవరి 3 వరకు రెండో విడత.. 1985 నుంచి 1990 వరకు మూడోసారి ఆయన పాండిచ్చేరికి సీఎంగా ఉన్నారు. అనంతంర కేంద్ర మంత్రిగా, గవర్నరుగా, సౌదీలో భారత రాయబారిగానూ పనిచేశారు. కేరళ గవర్నరుగా ఉంటున్న సమయంలో 2012 జనవరి 26న మరణించారు.

ప్రఫుల్ల కుమార్ మహంతో(Prafulla Kumar Mahanta): 32 ఏళ్లకు సీఎం

అస్సాంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అస్సాం గణపరిషత్ పార్టీ స్థాపించి 32 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని సంచలనం సృష్టించిన లీడర్ ప్రఫుల్ల కుమార్ మహంతో.
1952 డిసెంబరు 23న జన్మించిన ప్రఫుల్ల కుమార్ మహంతో 1985 డిసెంబరు 24న 33 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. రెండు సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

దుష్యంత్ చౌతాలా(Dushyant Chautala): 32 ఏళ్లు

ఇప్పుడు దుష్యంత్ హరియాణా సీఎం అయితే ప్రఫుల్ల కుమార్ మహంతో  రికార్డు కనుమరుగు కానుంది.
దుష్యంత్ చౌతాలా 1988 ఏప్రిల్ 3న జన్మించారు. ఇప్పడు 2019 అక్టోబరు, నవంబరు నెలల్లో ఆయన సీఎం బాధ్యతలు చేపడితే 32 ఏళ్లకు సీఎం అయినట్లవుతుంది.

BCCI అధ్యక్షుడిగా Sourav Ganguly

Credit: Twitter/SouravGanguly

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూ తన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బు ధవారం జరిగిన సర్వసభ్య సమావే శంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేష న్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 
సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ 33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా గంగూలీ నియమితుడయ్యాడు. దాదాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీ ఐ కార్యదర్శిగా, అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.


సర్ విజ్జీ తరువాత గంగూలీయే

ఒక మాజీ క్రికెటర్ పూర్తిస్థాయ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1954లో టీమిండియా మాజీ కెప్టెన్, విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు(సర్ విజ్జీ) బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2014లో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అయతే వీరు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు.
ఇప్పుడు పూర్తిస్థాయ పదవీ బాధ్యతలు చేపట్టిన గంగూలీ మరో పది నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. ఇప్పటికే ఐదేళ్లకు పైగా క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ఉండడంతో లోధా కమిటీ ‘తప్పనిసరి విరామం’ నిబంధన ప్రకారం వచ్చే ఏడాది జులైలో పదవి నుంచి తప్పు కోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు.

బీసీసీఐ అధ్యక్షులుగా చేసింది వీరే..

1 ఆర్‌ఈ గ్రాంట్ గోవన్ 1928-1933
2 సర్ సికందర్ హయత్ ఖాన్ 1933-1935
3 నవాబ్ హమిదుల్లా ఖాన్ 1935-1937
4 మహారాజా కేఎస్ దిగ్విజయ్‌సిన్హాజీ 1937-1938
5 పీ సుబ్బారాయన్ 1938-1946
6 అంటోనీ ఎస్ డీమెల్లో 1946-1951
7 జేసీ ముఖర్జీ 1951-1954
8 మహరాజ్ కుమార్ ఆఫ్ విజయనగరం 1954-1956
9 సర్దార్ ఎస్‌ఎస్ మజిథియా 1956-1958
10 ఆర్కే పటేల్ 1958-1960
11 ఎంఏ చిదంబరం 1960-1963
12 మహారాజా గైక్వాడ్ 1963-1966
13 జెడ్.ఆర్. ఇరానీ 1966-1969
14 ఏఎన్ గోస్ 1969-1972
15 పీఎం రంగ్తా 1972-1975
16 రాం ప్రకాశ్ మెహ్రా 1975-1977
17 ఎం. చిన్నస్వామి 1977-1980
18 ఎస్కే వాంఖేడ్ 1980-1982
19 ఎన్‌కేపీ సాల్వే 1982-1985
20 ఎస్ శ్రీమాన్ 1985-1988
21 బీఎన్ దత్ 1988-1990
22 మాధవరావు 'సింధియా 1990-1993
23 ఐఎస్ బింద్రా 1993-1996
24 రాజ్‌సింగ్ దుంగార్పూర్ 1996-1999
25 ఏసీ ముత్తయ్య 1999-2001
26 జగన్మోహన్ దాల్మియా 2001-2004
27 రణబీర్‌సింగ్ మహేంద్ర 2004-2005
28 శరద్ పవార్ 2005-2008
29 శశంక్ మనోహర్ 2008-2011
30 ఎన్.శ్రీనివాసన్ 2011-2013
31 జగన్మోహన్ దాల్మియా (తాత్కాలిక) 2013-2013
32 ఎన్.శ్రీనివాసన్ 2013-2014
33 శివ్‌లాల్ యాదవ్ (తాత్కాలిక) 2014-2014
34 సునీల్ గవాస్కర్ (తాత్కాలిక) 2014-2014
35 జగన్మోహన్ దాల్మియా 2015-2015
36 శశంక్ మనోహర్ 2015-2016
37 అనురాగ్ ఠాకూర్ 2016-2017
38 సీకే ఖన్నా (తాత్కాలిక) 2017-2019
39 సౌరవ్ గంగూలీ (ప్రస్తుతం) 2019-

15, అక్టోబర్ 2019, మంగళవారం

అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో: నోబెల్ బహుమతి గెలిచిన ఈ జంట గురించి నిజాలు తెలుసా?

అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో (photo credit: twitter/thenobelprize)

అభిజిత్ బెనర్జీ వ్యక్తిగత వివరాలు.. నెటిజన్లు సెర్చ్ చేసిన ప్రశ్నలకు సమాధానాలు

Abhijit Banerjee date of birth: ఫిబ్రవరి 21, 1961
Abhijit Banerjee Age: 58 సంవత్సరాలు(2019 నాటికి)
Abhijit Banerjee mother: తల్లి నిర్మలా బెనర్జీ (Centre for Studies in Social Sciences, Calcuttaలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
Abhijit Banerjee father: తండ్రి దీపక్ బెనర్జీ(Presidency College, Calcuttaలో ఎకనమిక్స్ విభాగాధిపతిగా పనిచేశారు).
Abhijit Banerjee Family: ప్రస్తుత భార్య ఎస్తేర్ డఫ్లో(Esther Duflo), తొలి భార్య అరుంధతి తులి.
(వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాల కోసం వ్యాసం మొత్తం చదవండి)
Abhijit Banerjee Books: Poor Economics, Good Economics for Hard Times: Better Answers to Our Biggest Problems 2019, Making Aid Work, Pitfalls of Participatory Programs: Evidence from a Randomized Evaluation in Education in India.


భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అభిజిత్ బెనర్జీ(Abhijit banerjee), ఎస్తేర్ డఫ్లో(Esther Duflo), మిఖాయిల్ క్రెమెర్‌(Michael Kremer)లకు ఉమ్మడిగా ఈ బహుమతి ప్రకటించారు. బహుమతి కింద వీరికి 90 లక్షల స్వీడిష్ క్రోనాలు అంటే సుమారు రూ.6.5 కోట్లు ఇస్తారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలన కోసం వీరు చూపిన మార్గదర్శకత్వానికి గాను ఈ బహుమతికి ఎంపిక చేశారు.
ఈ బహుమతికి ఎంపికైన ముగ్గురిలో అభిజిత్ బెనర్జీ(Abhijit banerjee), ఎస్తేర్ డఫ్లో(Esther Duflo)ల గురించే ఎక్కువ మంది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వీరికి నోబెల్ బహుమతి ప్రకటించారన్న వార్త వెలువడగానే గూగుల్ సెర్చ్‌లో వీరి గురించి వెతుకులాట మొదలైంది. వీరు భార్యాభర్తలా? సహజీవనం చేస్తున్నారా? వీరికి పిల్లలున్నారా? ఎస్తేర్ డుఫ్లోది  ఏ దేశం? వీరు ఒకే చోట కలిసి పనిచేస్తున్నారా? గురుశిష్యులా? అభిజిత్ భార్య(Abhijit banerjee wife) ఎవరు? వంటి అనేక ప్రశ్నలు గూగుల్‌ని అడిగారు నెటిజన్లు.

ఇద్దరూ భార్యాభర్తలే

వారి ప్రశ్నల్లో చాలావాటికి వారు ఆశించిన సమాధానాలే ఉండడం విశేషం. అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లోలు నిజంగానే భార్యాభర్తలు. 2015లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. ఎస్తేర్‌ను వివాహం చేసుకోవడానికి ముందే అభిజిత్‌కు పెళ్లయింది. ఆయన తొలి భార్య(Abhijit Banerjee first wife) భారతీయురాలే. ఆమె పేరు అరుంధతి తులి(Arundhati tuli Banerjee). ఆమె కూడా అభిజిత్ పనిచేసే మసాచూషెట్స్ ఇనిస్టిట్యట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లోనే పనిచేస్తారు. లిటరేచర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తారామె. అభిజిత్ బెనర్జీ, అరుంధతి తులి బెనర్జీలకు చాలాకాలం కిందటే వివాహం కాగా 1991లో వారికి కబీర్ బెనర్జీ(Kabir Banerjee) అనే కొడుకు పుట్టాడు. ఆయన 25 ఏళ్ల వయసులో 2016లో మరణించాడు. కబీర్ మరణం తరువాత అభిజిత్, అరుంధతిలు విడిపోయారు.
ఎస్తేర్ డఫ్లో(Esther Duflo)ది ఫ్రాన్స్. ప్రస్తుతం అమెరికా పౌరురాలు. ఎస్తేర్ డఫ్తో ఈ పురస్కారం గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న రెండో మహిళగానూ ఘనత సాధించారు. ఆమె కూడా అభిజిత్ బెనర్జీతో పాటే ప్రస్తుతం మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇద్దరికీ ఎలా పరిచయం?

హార్వర్డ్‌లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన అభిజిత్ అక్కేడ కొంతకాలం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఎస్తేర్ డఫ్లో అక్కడ పీహెచ్డీ చేయగా అభిజిత్, మరో ప్రొఫెసర్ ఆమెకు గైడ్‌గా పనిచేశారు. ఒక రకంగా వారిద్దరూ తొలుత గురుశిష్యులే. అనంతరం ఇద్దరూ కలిసి పనిచేశారు. ఇద్దరూ కలిసి కొన్ని పుస్తకాలు రాశారు, ఓ సంస్థను స్థాపించారు. గతంలోనూ ఇద్దరికీ కలిపి పలు అవార్డులు వరించాయి. ఎస్తేర్‌‌తో సాన్నిహిత్యం, అనంతరం వివాహం చేసుకోవడంతో అభిజిత్ బెనర్జీ, ఆయన మొదటి భార్య అరుంధతి తులిల మధ్య దూరం పెరిగి విడాకులకు దారి తీసింది.

11, అక్టోబర్ 2019, శుక్రవారం

విరాట్ కోహ్లీ వీరందరినీ దాటేశాడు


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో విజృంభించాడు. టెస్టుల్లో తన 26వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రెండో రోజు ఆటలో భారత జట్టు 601 పరుగుల వద్ద డిక్లేర్ చేసేటప్పటికి కోహ్లీ 254 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుకొట్టాడు.
కెప్టెన్‌గా ఉంటూ టెస్టుల్లో అత్యధికసార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు.
డాన్ బ్రాడ్‌మన్ ఎనిమిదిసార్లు ఇలాంటి ఫీట్ సాధించగా కోహ్లీ ఇప్పుడాయన్ను అధిగమించి తన కెప్టెన్సీలో తానే తొమ్మిది సార్లు 150కి పైగా పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.

పాంటింగ్, గ్యారీ సోబర్స్, సంగక్కరల సరసన..
ఈ టెస్టులో విరాట్ కోహ్లీ మరికొన్ని రికార్డులనూ సాధించాడు. ఇంకొందరి రికార్డులను సమం చేశాడు.
కెప్టెన్‌ హోదాలో కోహ్లీకి ఇది 19వ సెంచరీ. దీంతో పాంటింగ్ రికార్డును సమం చేసినట్లయింది. కెప్టెన్‌గా 25 టెస్ట్ సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ వీరి కంటే ముందున్నాడు.
ఇక భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్‌లో సాధించాడు. ఇప్పటి వరకు సచిన్, సెహ్వాగ్‌లు ఆరేసి టెస్ట్ డబుల్ సెంచరీలు సాధించి ఇంతవరకు అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ ఇప్పుడు వారిని అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ 7 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో గ్యారీ సోబర్స్, కుమార సంగక్కరల సరసన 7 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.

అమితాబ్ బచ్చన్ అసలు పేరేమిటి?


Amitabh Bachchan height, Amitabh Bachchan movie, Amitabh Bachchan twitter, Amitabh Bachchan daughter, Amitabh Bachchan father, Amitabh Bachchan date of birth, Amitabh Bachchan movie list, Amitabh Bachchan brother, Amitabh Bachchan family.. గూగుల్‌లో అమితాబ్ అనికొట్టగానే ఆటోమేటిగ్గా వస్తున్న సెర్చ్ సజెషన్స్ ఇవి. యూజర్ల శోధన ఆధారంగా గూగుల్ కూడా ఎక్కువగా వెతికే అంశాలనే సజెషన్స్‌గా చూపిస్తుంది. అమితాబ్ బచ్చన్ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించిన వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
అమితాబ్ గురించి గూగుల్‌లో ఎక్కువమంది తెలుసుకోవాలనుకుంటున్న అంశాలతో పాటు మరికొన్ని ఆసక్తికర విశేషాలనూ తెలుసుకుందాం..

గూగుల్‌‌లో వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానాలు..

Amitabh Bachchan height:  1.83 మీటర్లు. అంటే 183 సెంటీమీటర్లు. అడుగుల్లో చెబితే 6 అడుగుల ఒక అంగుళంపైనే.
Amitabh Bachchan movie: సైరా నరసింహారెడ్డి (తాజా చిత్రం తెలుగులో)
Amitabh Bachchan twitter: @SrBachchan
Amitabh Bachchan daughter: శ్వేతా బచ్చన్
 Amitabh Bachchan father: హరివంశ్ రాయ్ బచ్చన్. ఈయన మంచి కవి. తల్లి తేజీ బచ్చన్
Amitabh Bachchan date of birth: అక్టోబరు 11, 1942
Amitabh Bachchan movie list: అమితాబ్ 300కి పైగా సినిమాల్లో నటించారు. షోలే, కూలీ, మర్ద్, షరాబీ, త్రిశూల్, డాన్, లావారిష్, సిల్‌సిలా, ఇంక్విలాబ్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, సైరా నరసింహారెడ్డి
, Amitabh Bachchan brother: అజితాబ్ బచ్చన్
, Amitabh Bachchan family: భార్య జయ భాదురి, కుమారుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతా బచ్చన్ నంద, అల్లుడు నిఖిల్ నంద, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనుమరాలు ఆరాధ్య బచ్చన్

అత్యధిక డబుల్ రోల్స్ ఆయనవే

అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్ శ్రీవాస్తవ. ఆ తర్వాత ఆయన పేరును అమితాబ్ అని మార్చారు. అమితాబ్ అంటే ఎన్నటికీ ఆగిపోని వెలుగని అర్థం.
అమితాబ్ బచ్చన్‌ ఓ ఆండీడెక్స్‌ట్రస్. అంటే రెండు చేతులతో రాయలగల సామర్ధ్యం ఉన్నవారు.
1969లో వచ్చిన భువన్ షోమ్ అనే సినిమాతో అమితాబ్ తన కెరీర్‌ను మొదలుపెట్టారు. అయితే ఆయన ఈ సినిమాకు నరేటర్‌గా మాత్రమే వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన ‘సాథ్ హిందుస్థానీ’ సినిమాతో ఆయన నటుడిగా మారారు.
అమితాబ్ బచ్చన్ అందుకున్న తొలి జీతం రూ.300
సినిమాల్లోకి వచ్చాక అమితాబ్‌కు వరుసగా 12 ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘జంజీర్’ ఆయనకు కెరీర్‌లో తొలి హిట్ ఇచ్చింది. ఒకే నెలలో ఆయన నటించిన నాలుగు సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి.
1995లో జరిగిన మిస్ వరల్డ్ కాంటెస్ట్‌కు అమితాబ్ జడ్జ్‌గా వ్యవహరించారు.
సినీ ఇండస్ట్రీలో అత్యధిక డబుల్ రోల్స్‌లో నటించిన ఏకైక నటుడు అమితాబే.
మేడమ్ టుస్సాడ్స్‌ వ్యా్క్స్ మ్యూజియంలో ఆయనకు మైనపు విగ్రహం ఉంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు ఆయనే.
అమితాబ్‌కు చేతి గడియారాలు కలెక్ట్ చేయడం కంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు బయటికి వెళ్లినా రెండు వాచ్‌లు పెట్టుకుని వెళుతుంటారు.
ప్రతి ఆదివారం అమితాబ్ తన నివాసం వద్ద తనకోసం ఎదురుచూస్తున్న అభిమానులను పలకరిస్తుంటారు. ఆదివారం రాగానే వందలాది మంది అభిమానులు జుహులోని ఆయన నివాసం వద్ద ఎదురుచూస్తుంటారు.

1, అక్టోబర్ 2019, మంగళవారం

Herbert Kleber ఎవరు? గూగుల్ ఎందుకు డూడుల్‌తో గుర్తుచేసింది?


హెర్బర్ట్ క్లెబర్ ఎవరు? గూగుల్ ఎందుకు డూడుల్‌తో గుర్తుచేసింది?


Sye Raa: చిరంజీవి మూవీ అసలు కథానాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రియల్ స్టోరీ

Sye Raa Narasimhareddy Cast & Crew: Chiranjeevi, AmitabhBachchan, Nayanthara, Anushka, VijaySethupathi, Tamannaah, JagapatiBabu, RaviKishan, NiharikaKonidela, Brahmanandam

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి... మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రానికి ఈయన కథే మూలం. సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చరిత్ర చెబుతోంది. రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రనూ రాశారు. అందులో ఆయన ‘‘1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ల ముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటు జెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’’ అని రాశారు.

ఇదీ నేపథ్యం..

విజయనగర రాజులు తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానుల చేతిలో ఓడిపోయారు. దాంతో సామంతులుగా ఉన్న పాలెగాళ్లు నియంతల్లా వ్యవహరించడం మొదలుపెట్టారు. 1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పటికి రాయలసీమ నిజాం పాలన కిందే ఉండేది. నిజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. దాంతో పాలెగాళ్లు బ్రిటిష్ పాలనలోకి వచ్చారు.
కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్లుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్‌గా పనిచేసిన సర్ ధామస్ మన్రో పాలెగాళ్ల వంశ పారంపర్య హక్కులను రద్దు చేసి వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.
ప్రస్తుత కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాలెగాడు పెద్ద మల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. అప్పటి కోయిలకుంట్ల తాలూకాలో ఈ ఉయ్యాలవాడ జాగీరు ఉండేది. ఆంగ్లేయులు దాన్ని హస్తగతం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుంచి 30 వేల రూపాయలకు పైగా రాబడి ఉండేది. జాగీర్‌ను వశం చేసుకున్న బ్రిటిష్‌వారు పెద్ద మల్లారెడ్డి కుటుంబానికి రు. 70 పింఛను ఇచ్చేలా నిర్ణయించారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుగా 11 రూపాయల 10 అణాలు 8 పైసలు పింఛను వచ్చేది.
నరసింహారెడ్డి తాత(తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి చెందిన జాగీరును బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని ఆయన నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇచ్చేవారు. ఆ జాగీరు నుంచి ఏటా 22 వేల రూపాయల రెవెన్యూ ఉండేది. నొస్సం జమీందారుకు పిల్లలు లేకపోవడంతో ఆయన మరణానంతరం పింఛను ఆగిపోయింది.

పోరాటానికి మొదలైంది ఇలా..


1846 జూన్ నెలలో తనకు రావలసిన మే నెల పింఛను కోసం కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపిస్తాడు నరసింహారెడ్డి. కానీతహసీల్దార్.. నరసింహారెడ్డి వస్తే కానీ ఇవ్వనని చెప్పి ఆ మనిషిని ఉత్త చేతులతో పంపించేస్తాడు. అయినా నరసింహారెడ్డి వెళ్లకపోవడంతో తహసీల్దారు వారంట్ జారీ చేసి బంట్రోతుతో పంపిస్తాడు. వచ్చినవారిని తన్ని తరిమేస్తాడు నరసింహారెడ్డి. దాంతో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య పోరాటం మొదలైందంటారు అని జానమద్ది హనుమచ్చాస్త్రి తన పుస్తకంలో రాశారు.
అదేసమయంలో బ్రిటిష్ వారి కారణంగా మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లుగిరిజన తెగలు నరసింహారెడ్డిని ఆశ్రయిస్తారు. అలా 9 వేల మంది నరసింహారెడ్డి వద్ద చేరుతారు. వారందరితో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటానికి నరసింహారెడ్డి సిద్ధమవుతాడు. వనపర్తిమునగాలజటప్రోలు జమీందార్లు పెనుగొండఔకుజమీందార్లుహైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్కర్నూలుకు చెందిన పాపాఖాన్బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్కొందరు బోయలుచెంచులుబ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరుతారు. దీంతో కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెడుతుంది.

తొలి దాడి ఇలా..

1846 జులై 78 తేదీలలో నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేస్తాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయిస్తారు. ఈ పోరాటంలో ఒక డఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.
నరసింహారెడ్డి సైన్యం మరుసటి రోజు కోయిలకుంట్ల ట్రెజరీపై దాడి చేసి అప్పటికి ఖజానాలో ఉన్న 805 రూపాయల 10 అణాల 4 పైసల మొత్తాన్ని దోచుకుంటుంది. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకుంటారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపేస్తారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరుతాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపిస్తారు. నరసింహారెడ్డి ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానానుచుట్టుపట్ల గ్రామాలను దోచుకుంటాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకుంటుంది. ఆలోగా నరసింహారెడ్డి తన సైన్యంతో అహోబిలం కోటకు చేరుకుంటాడు. నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకోవడం ప్రభుత్వానికి కష్టమవుతుంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరుతాడు.
జె.హెచ్.కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద నాట్‌ను కలుసుకుంటుంది. ఈలోగా తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంటుంది. అక్కడికి మూడుమైళ్ల దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోటను నరసింహారెడ్డి స్థావరంగా మార్చుకుంటాడు. నరసింహారెడ్డి ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా ఉంచుతాడు.
నరసింహారెడ్డిని వెతుక్కుంటూ వచ్చిన బ్రిటిష్ అధికారి పాట్సన్ బృందాన్ని నరసింహారెడ్డి తన 5 వేల బలగంతో గిద్దలూరు వద్ద అడ్డుకుంటాడు. పాట్సన్ వద్ద అప్పటికి 100 మంది సైనికులే ఉంటారు. ఆరు గంటల పాటు నరసింహారెడ్డి మనుషులకుపాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరుగుతుంది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణిస్తారు. చీకటి పడటతో రెండు పక్షాల వారు యుద్ధం ముగించి ఎవరి దారిన వారు సాగుతారు.
కొండలలోని కాలిబాటలు అడ్డదారులు బ్రిటిష్ సైనికులకు తెలియవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలిస్తుంది. గ్రామాధికార్ల మీదకట్టుబడిదార్ల మీద కేసులు మోపుతారు. నరసింహారెడ్డిని పట్టిస్తే వేయి రూపాయలుఅతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్తకోటకు తరలిస్తాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కునరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలు దొరుకుతాయి. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలవుతాయి.

కుటుంబాన్ని విడిపించేందుకు వచ్చి..

నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలుఇద్దరు కుమారులుముగ్గురు కుమార్తెలు ఉండేవారు. వారందరినీ పట్టుకుని ప్రభుత్వం వారిని కడపలోని ఒక బంగళాలో ఉంచుతుంది. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరుకుంటాడు నరసింహారెడ్డి. 1846 అక్టోబర్ 6న ఎర్రమల నల్లమల కొండల మధ్యనున్న పేరసామలలోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 4050 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపుతాడు. కాలికి తూటా తగలడంతో నరసింహారెడ్డి ఫిరంగి దళాలకు దొరికిపోతాడు.
నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెడతారు. వారిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ శిక్ష పడినవారిలో అవుకు రాజు తమ్ముడు ఒకరు.
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాకహత్యలకుదోపిడీలకుపాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధిస్తారు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు చెబుతారు.

రెండు వేల మంది చూస్తుండగా ఉరి..

1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. చెప్పినట్లుగానే కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.
ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీరుకార్చుతూ చూశారు. మిగతావారికి హెచ్చరిక కావాలంటూ నరసింహారెడ్డి తలను రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేలా బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారని జానమద్ది హనుమచ్చాస్త్రి తన ‘సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’ పుస్తకంలో రాశారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథను ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో పాటల రూపంలో పాడుతుంటారు.
"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ల కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి" అన్న పాట ప్రాచుర్యంలో ఉంది.
అలాగే... "అదుగో వచ్చేఇడుగో వచ్చే నరసింహారెడ్డి’’ అనే మరో పాట కూడా ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది.
"అదుగో వచ్చేఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు." అంటూ సాగుతుంది ఆ పాట.

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

మోదీ, ఇమ్రాన్: ఐక్యరాజ్య సమితిలో ఎవరి ప్రసంగం బాగుంది?



మోదీ, ఇమ్రాన్ ఖాన్‌లు భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధాన మంత్రుల హోదాలో ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశాల్లో(యూఎన్‌జీఏ) రెండు రోజుల కిందట ప్రసంగించారు. వారి ప్రసంగాలను ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా చూశాయి. అందుకు కారణం రెండు దేశాల మధ్య ఉన్న చిరకాల శత్రుత్వమే కాదు, తాజాగా తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కూడా.  భారతదేశంలోని జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని సవరించడం.. ఆ రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ప్రధాని మోదీ తనకంటే ముందు ఏడు దశాబ్దాలుగా దేశాన్ని ఏలినవారు చేయలేని పనిని చేశారు. ఆయన సాహసోపేత నిర్ణయంపై జమ్ముకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా దేశమంతా దాదాపుగా మద్దతు లభించింది. అంతేకాదు.. అంతర్జాతీయంగానూ ఆమోదం లభించింది. పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమైన ఈ నిర్ణయంపై తనకు సంబంధం లేనప్పటికీ పాక్ గొంతు చించుకుంటోంది. పాక్ అండతో ఇంతకాలం విర్రవీగిన ఉగ్రశక్తులూ దీనిపై రాద్ధాంతం సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయ సమాజం భారత్ నిర్ణయాన్ని పూర్తిగా అంతర్గత విషయంగానే గుర్తించింది. పాక్‌కు అడ్డగోలుగా కొమ్ముకాసే దేశాలు సైత ఈ విషయంలో భారత్‌కు లభించిన అంతర్జాతీయ మద్దతు చూసి మౌనం వహించాయి. ఇలాంటి సమయంలో ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ, ఇమ్రాన్‌లు మాట్లాడడంతో వారేం మాట్లాడారన్నది, ఎవరు విజయవంతమయ్యారన్నది ప్రపంచానికి ఆసక్తిగా మారింది.

మోదీ ఫోకస్ ఒకటే...

మోదీ తన ప్రసంగంలో ప్రపంచ శాంతి, ఉగ్రవాదంతో పొంచివున్న సవాళ్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. వాటినే ప్రస్తావించారు. పాకిస్తాన్ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించకుండానే ప్రపంచానికి మొత్తం తాను చెప్పాలనుకున్నది చెప్పగలిగారు. అంతేకాదు.. వర్ధమాన దేశంగా తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచ నాయకుల ముందు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలో ఇంకే నాయకుడూ సాధించనంత మెజారిటీ సాధించి తాను విజయం సాధించానన్న విషయాన్ని ఐరాస వేదికగా అందరికీ గుర్తుచేశారు. దాంతో ప్రపంచ రాజకీయాల్లో  తానెంత కీలకమో చెప్పకనే చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ తీరు ఇలా..

మోదీకి భిన్నంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం సాగింది. ఆయన తన తొలి మాట నుంచే భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ లేవనెత్తారు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరిగితే సంభవించే నష్టాలపై మాట్లాడి ప్రపంచాన్ని భయపెట్టాలని చూశారు.


మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు..

మోదీ అసలు పాకిస్తాన్ గురించి ఏమాత్రం కూడా ప్రస్తావించలేదు ఎందుకు? కశ్మీర్‌పైనా ఎందుకు మాట్లాడలేదు? కేవలం అంతర్జాతీయ అంశాలు, తమ ప్రభుత్వ విజయాలు వంటివే ఎందుకు మాట్లాడారన్నది చూస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. ఆయన కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశం కాదు.. పూర్తిగా భారత అంతర్గత అంశం అన్నది ప్రపంచానికి చెప్పడానికే దాని గురించి మాట్లాడలేదని అర్థమవుతుంది. అంతేకాదు.. భారత్‌లో గత నేతల్లా కాకుండా తాను ప్రపంచ స్థాయి నాయకుడినన్న సంకేతాలు ఇచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.

మోదీ మూడు, నాలుగు ప్రధాన అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌ అని ప్రపంచానికి గుర్తుచేయడం వీటిలో మొదటిది. మోదీ, ఆయన పార్టీ ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఓట్లతో ఎన్నికైన రాజకీయ నాయకుడు తనేనని ఆయన సంకేతాలిచ్చారు. పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి? వాతావరణ మార్పులను ఎలా అడ్డుకోవాలి లాంటి ప్రశ్నలకు ప్రపంచానికి భారత్ సమాధానాలు చూపించాలని అనుకుంటున్నట్లు మోదీ చెప్పారు. ఈ అంశాలు కూడా ప్రపంచంలోని అగ్రదేశాలు నిత్యం చర్చించే అంశాలే.
భారత్ అభివృద్ధి పథంలో వెళ్తోందని చెప్పేందుకు తమ ప్రభుత్వ విధానాలను ఉదహరించారు. అయితే కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా వినిపిస్తున్న వాదనలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షల గురించీ మోదీ మాట్లాడలేదు. భారత్ విషయంలో లేవనెత్తిన ఇతర ప్రశ్నల గురించి ఆయన స్పందించలేదు. సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి పరిరక్షణలతోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చి ప్రపంచానికి ఉగ్రవాదం ఎంతముప్పన్నది చర్చకు తెచ్చారు.

సర్వప్రతినిధి సభలో లోతైన అంశాలపై చర్చలు జరుగుతాయి. ఫ్రాన్స్, చైనా, రష్యా నాయకుల వాదనలను ఇక్కడ వినాలని ప్రపంచ నాయకులు భావిస్తుంటారు. ఈసారి భారత్ మాటలను కూడా ప్రపంచం వినేలా చేశారు మోదీ. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, పర్యావరణ మార్పుల కట్టడిలో భాగస్వామ్యానికి భిన్న స్థాయిల్లో కృషి అనేది సర్వప్రతినిధి సభ 74వ సమావేశాల థీమ్. పూర్తిగా ఆ థీమ్‌కు అనుగుణంగా మాట్లాడి మోదీ అందరినీ ఆకట్టుకున్నారు.

ఇమ్రాన్ విఫలం

మోదీకి పూర్తి విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపైనే దృష్టి కేంద్రీకరించారు.. ఐరాస సర్వసభ్య సమావేశం థీమ్ ఏమిటి? తానేం మాట్లాడుతున్నానన్నది లేకుండా ఆయన భారత్‌పై ఐరాస వేదికగా రాళ్ల వర్షం కురిపించారు.
కశ్మీర్‌ అంశాన్ని ఇమ్రాన్ ప్రస్తావించినా కొత్తగా ప్రపంచానికి ఏమీ చెప్పలేకపోయారు. పాతపాటే మళ్లీ పాడారు.
ఇదే సమయంలో ఆయన ప్రపంచాన్ని భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి భారత్‌పై వారు ఒత్తిడి చేసేలా చేయాలని ప్రయత్నించారు. ఒక దేశాధినేతలా, రాజకీయవేత్తలా కాకుండా తన మునుపటి రూపమైన క్రికెట్ ఆటలోని బౌలర్‌‌లా వ్యవహరించారు. బౌన్సర్లు, బాడీ లైన్ బౌలింగ్‌తో భయపెట్టాలని చూశారు. క్రికెట్‌లో అంపైర్లు ముందు పదేపదే అప్పీల్ చేసి ఒత్తిడి చేసినట్లు అంపైర్ల‌లాంటి ప్రపంచ దేశాల ముందు పదేపదే కశ్మీర్ గురించి మాట్లాడారు. కానీ, అంపైర్లేమీ ఆయన ఒత్తిళ్లకు తలొగ్గలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఐరాస వేదికగా ఇమ్రాన్ దారుణంగా విఫలమయ్యారనే చెప్పాలి.  కశ్మీర్‌లో కర్ఫ్యూను ఎత్తివేయాలని ఆయన అడిగారు.. భారత్‌లోని ప్రతిపక్ష నేతలా ఆయన వ్యవహరించారే కానీ పాకిస్తాన్ ప్రధానిలా ఆయన మాట్లాడలేదన్న విమర్శలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్‌లో ఎన్నికల సమయంలో ప్రచార ర్యాలీలలో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజల ఆవేశాన్ని రెచ్చగొట్టి ఓట్లు సాధించేందుకు ఆయన ప్రయత్నించినట్లుగానే కనిపించింది కానీ ఐరాసలో మాట్లాడుతున్నట్లుగా లేదు.
అంత సుదీర్ఘంగా మాట్లాడిన ఇమ్రాన్ సమావేశాల అసలు ఉద్దేశానికి సంబంధించి మాట్లాడింది చాలా తక్కువ. ఆయన ప్రసంగంపై పాకిస్తాన్‌లోనే ఎవరికీ సంతృప్తి కలగలేదు.

Amazon, Flipkart Discount sales: అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో భారీ ఆఫర్లు ఇవే..


ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రతి ఏటా ఆఫర్లతో వచ్చినట్లే ఈసారి కూడా దసరాకు ముందు భారీ ఆఫర్లతో సిద్ధమయ్యాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అంటోంది. రెండు ఈకామర్స్ సంస్థలూ సెప్టెంబరు 29 నుంచి ఈ సేల్స్ ప్రారంభించాయి.  సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ కూడా అదే తేదీల్లో బిగ్ బిలియన్ డే సేల్ పెట్టింది.

కొనుక్కుంటే ఇప్పుడే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా అనేక వస్తువులు గతంలో లేనంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి ప్రీమియం ఫోన్ బ్రాండ్లకు దీటుగా ఫీచర్లు, ఆకర్షణీయతల యూజర్లను ఆకట్టుకుంటున్న వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రోలు ధరలు ఈ సేల్2లో తగ్గించారు. ఈ సేల్ లో వన్ ప్లస్ 7 ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.29,999కే లభించనుంది. ప్రస్తుతం దీని ధర రూ.32,999గా ఉంది. అంటే దీనిపై రూ.3,000 తగ్గింపు లభించనుందనన్న మాట. అలాగే వన్ పస్ల్ 7 ప్రో ప్రారంభ వేరియంట్ ఈ సేల్ లో రూ.44,999కే లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.48,999గా ఉంది. అంటే దీనిపై రూ.4,000 తగ్గింపు లభించనుంది.

రియల్ మీ 

రియల్ మీ 5: రియల్‌మీ5 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.8,999.
రియల్ మీ C2: రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.6,999 కాగా ఆఫర్ ధర రూ.5,999.

రెడ్ మీ

రెడ్ మీ 7A: రెడ్‌మీ 7ఏ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.5,999 కాగా ఆఫర్ ధర రూ.4,999.

మోటోరోలా 

మోటోరోలా వన్ విజన్ : మోటోరోలా వన్ విజన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఆఫర్ ధర రూ.14,999.
మోటోరోలా వన్ యాక్షన్  : మోటోరోలా వన్ యాక్షన్ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.

హానర్ 

హానర్  8C: హానర్ 8సీ 2జీబీ+16జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్ 10 Lite: హానర్ 10 లైట్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్  20i: హానర్ 20ఐ 4జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.
హానర్  20: హానర్ 20 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.32,999 కాగా ఆఫర్ ధర రూ.24,999.
హానర్ 9N: హానర్ 9ఎన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
హానర్  9 Lite: హానర్ 9 లైట్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.

ఆసస్

సస్ జెన్ ఫోన్ 5Z : ఏసుస్ జెన్‌ఫోన్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.16,999.

ఆసస్ జెన్ ఫోన్ మాక్స్ M2: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.రూ.6,999.
ఆసస్ జెన్ ఫోన్ ప్రో M1: ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.7,499.