30, సెప్టెంబర్ 2020, బుధవారం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు ఫుల్ డీటెయిల్స్



ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని బాబ్రీ మసీదును 1992 డిసెంబరు 6న కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటన తరువాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి హింస చెలరేగింది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. కూల్చివేతకు గురైన మసీదును మళ్లీ నిర్మిస్తామని అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు కోసం డిసెంబర్ 16న ఎంఎస్ లిబర్హాన్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం 2009లో కమిషన్ తమ నివేదికను సమర్పించింది.

మరోవైపు మసీదు స్థలంలో రామమందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు కొద్దికాలం కిందట తీర్పు ఇచ్చింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆలయానికి భూమి పూజ చేశారు.. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి. 

అయితే, కరసేవకులు 1992 డిసెంబర్ 6న పూర్తిగా కూల్చివేయడానికి ముందే అది కొంతవరకు ధ్వంసమవడంతో అక్కడ తాత్కాలిక రామ మందిరం ఏర్పాటు చేశారు.

డిసెంబరు 6న కూల్చివేత రోజున పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, లూటీ వంటి నేరారోపణలతో కర సేవకులపై ఒక కేసు... విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ, విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్, బజరంగ్ దళ్ నాయకుడు వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియాలపై రెండో కేసు నమోదు చేశారు. 

మొదటి ఎఫ్ఐఆర్‌లో నమోదుచేసిన కేసును సీబీఐకి అప్పగించగా.. రెండో ఎఫ్ఐఆర్‌లో నమోదైన కేసును ఉత్తర ప్రదేశ్ సీఐడీకి అప్పగించారు.


రెండు ప్రత్యేక కోర్టులు..

కరసేవకులపై కేసు విచారణకు లలిత్‌పూర్‌లో ఒక స్పెషల్ కోర్టు, రెండో ఎఫ్ఐఆర్ విచారణకు రాయ్‌బరేలీలో మరో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేశారు.

బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు కోసం డిసెంబర్ 16న ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్‌కు మూడు నెలల గడువు ఇవ్వగా ఆ గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వచ్చారు. 17 సంవత్సరాల కాలంలో 48 సార్లు ఈ గడువును పొడిగించారు. ఎట్టకేలకు 2009 జూన్‌లో ఈ విచారణ కమిషన్ తన దర్యాప్తు నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించింది.

మసీదు కూల్చివేత వెనక కుట్ర ఉందని.. దీనిపై విచారణ జరిపించాలని లిబర్హాన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.

రెండు కేసులేనా..?

మసీదు కూల్చివేసిన రోజు నమోదైన రెండు ప్రధాన కేసులతోపాటూ మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో విలేకరులపై దాడి, దోపిడీ మొదలైన ఆరోపణలున్నాయి. తరువాత ఈ కేసులన్నిటినీ సీబీఐకు అప్పగించారు.

అనంతరం అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు లఖ్‌నవూలో అయోధ్య కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. కానీ ఆ నోటిఫికేషన్‌లో రెండో కేసు సంఖ్య 198ను జత చేయలేదు. ఈ కేసు విచారణ రాయ్‌బరేలీలోనే జరుగుతూ వచ్చింది. అయితే, మొదటి కేసు సంఖ్య 197ను సెక్షన్ 120 బీ కింద క్రిమినల్ కేసుగా మార్చారు.

తరువాత, 1993 అక్టోబర్ 5న రెండో కేసు 198ని కూడా జత చేస్తూ సీబీఐ ఉమ్మడి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో బాల్ ఠాక్రే, కల్యాణ్ సింగ్, చంపత్ రాయ్, ధరందాస్, మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో సహా మరి కొందరి పేర్లు జత చేసింది.

1993 అక్టోబర్ 8న యూపీ ప్రభుత్వం, కేసుల బదిలీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రెండో కేసు 198తో సహా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులన్నీ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టులోనే విచారణకు వస్తాయని తేలింది.

1996లో లఖ్‌నవూ కోర్టు, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులన్నిటినీ నేరపూరిత కుట్ర (క్రిమినల్ కేసు) విభాగంలో చేర్చాలని ఆదేశించింది. ఈ కేసుల విషయంలో సీబీఐ దాఖలు చేసిన ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీతో సహా నిందితులందరిపై నేరపూరిత కుట్ర కేసును దాఖలు చేసేందుకు వీలుగా సాక్ష్యాలు ఉన్నాయంటూ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయానికొచ్చింది.

ఈ కేసులన్నీ ఒకే ఘటనకు సంబంధించినవి కాబట్టి ఉమ్మడి విచారణ చేపట్టాలని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అయితే అడ్వాణీతో సహా పలువురు నిందితులు ఈ ఉత్తర్వును హైకోర్టులో సవాలు చేశారు.

2001 ఫిబ్రవరి 12న ఉమ్మడి చార్జ్‌షీట్‌కు హైకోర్టు అంగీకరించింది. కానీ రెండో కేసు 198ని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నోటిఫికేషన్లో చేర్చలేదు కాబట్టి ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది నిందితులపై విచారణ చేయడానికి లఖ్‌నవూ ప్రత్యేక కోర్టుకు అనుమతి లేదని కూడా తెలిపింది. దీంతో అడ్వాణీతో సహా 8 మందిపై వేసిన రెండో క్రిమినల్ కేసు సాంకేతికపరమైన చిక్కుల్లో పడింది.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా పరమైన లోపాల వల్ల నిందితులపై తప్పుడు అభియోగాలు మోపారని నిందితుల తరఫు లాయర్ వాదించారు.

ఈ సాంకేతిక కారణాలను అడ్డు పెట్టుకుని ఎల్‌కే అడ్వాణీ తదితరులు తమపై ఉన్న క్రిమినల్ కేసును తొలగించాలని కోరారు.

రెండో కేసులో 8 మంది నిందితులపై నేరపూరిత కుట్ర కేసుకు సంబంధించిన సాక్ష్యాలను జత చేస్తూ రాయ్‌బరేలీ కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు, సీబీఐని 

2003లో కేసు సంఖ్య 198లో 8 మంది నిందితులపై సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కానీ కేసు సంఖ్య 198ను నేరపూరిత కుట్ర విభాగంలో జోడించలేకపోయింది ఎందుకంటే మొదట్లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కేసు నంబర్ 197ను నేరపూరిత కుట్ర విభాగంలోనూ, 198ని రెచ్చగొట్టే ప్రసంగాలుగానూ వేరు వేరుగా ఎఫైఆర్ నమోదు చేశారు కాబట్టి.

ఈలోగా, రాయ్‌బరేలీ కోర్టు.. అడ్వాణీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, ఆయనపై ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని తెలుపుతూ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

అయితే, 2005లో అలహాబాద్ హైకోర్టు, రాయ్‌బరేలీ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అడ్వాణీ తదితరులపై కేసులు కొనసాగుతాయని చెప్పింది. అయితే అప్పటికి కూడా కేసు సంఖ్య 198ని నేరపూరిత కుట్రగా గుర్తించలేదు.

2005లో రాయ్‌బరేలీ కోర్టు ఈ కేసును మళ్లీ స్వీకరించింది. 2007లో ఈ కేసు మొదటి విచారణ జరిగింది.

తరవాత రెండు సంవత్సరాలకు 2009లో లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు నివేదికను సమర్పించింది. సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీకి చెందిన నాయకులు బాబ్రీ కూల్చివేతకు దారితీసిన సంఘటనలకు బాధ్యులని ఈ నివేదికలో పేర్కొన్నారు.

2010లో ఈ రెండు కేసులను వేరు చేయాలని, కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడకూడదని వేసిన రివిజన్ పిటీషన్‌ను అలహాబాద్ హై కోర్టు తిరస్కరించింది.

అయోధ్య వివాదంలో సెప్టంబర్ 24న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. తరువాత తీర్పును ఆపాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.

2010 సెప్టెంబర్ 30న అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది.

2011లో సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

2012లో రెండు కేసులపై ఉమ్మడి విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

2015లో కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై స్పందించాలని కోరుతూ ఎల్‌కే అడ్వాణీ, ఉమా భారతి, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నాయకులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

2017లో సుప్రీం కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆరోపణలను పునరుద్ధరించింది. రెండు కేసుల విచారణలూ ఒకేసారి జరపాలంటూ తీర్పునిచ్చింది. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు అడ్వాణీతో సహా 20 మంది నిందితులపై మళ్లీ క్రిమినల్ కేసు వేయమని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది...రెండేళ్లలోపు బాబ్రీ మసీదు కేసులో విచారణ పూర్తి చేయాలని గడువు విధించడం.

గత ఏడాది ఏప్రిల్‌లో ఈ గడువు ముగిసింది. అయితే గడువును మరో 9 నెలలకు పొడిగించారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ గడువును మరింత పొడిగించారు. రోజూ విచారణ జరుపుతూ ఆగస్ట్ 31లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మళ్లీ మరో నెల రోజులు వ్యవధి ఇస్తూ సెప్టెంబర్ 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులపై తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు రోజున నిందితులందరూ హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి