31, ఆగస్టు 2020, సోమవారం

ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్ ముఖర్జీ


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి కిందట మృతి చెందారు.

ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.

సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈమేరకు ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి ఆయన మరణించారు.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.


భారత రత్న పురస్కారం ప్రదానం చేసిన మోదీ ప్రభుత్వం

ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్)లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.

చిరు దివ్వెల నుంచి షాండ్లియర్స్ వరకు

"బెంగాల్‌లోని ఒక చిన్న దీపపు వెలుగు నుంచి దిల్లీ షాండ్లియర్ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను" అని తన జీవన ప్రయాణాన్ని ఆయన ఓ సందర్భంలో వివరించారు.

కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి

ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్‌కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్‌సభలో కొనసాగారు.

గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు.

కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు.

ఇండియన్ ఎకానమీకి మొదటి రిఫార్మర్

భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు.

1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు.

అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు.

ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.

2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు.

మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.

ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు.

భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు.

కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోనే..

ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.

కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో "థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014), ద టర్బులెంట్ ఇయర్స్ (2016), కొయిలేషన్ యియర్స్ (2017) విమర్శకుల ప్రశంసలు పొందాయి.



చైనా, భారత్ ఘర్షణ: మళ్లీ ఆక్రమణలకు తెగబడిన చైనా.. తిప్పికొట్టిన భారత్

 

చైనా సైన్యం (ఇమేజ్ క్రెడిట్ గ్లోబల్ టైమ్స్)

చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. రెండు నెలల కిందట గల్వాన్ లోయలో ఘర్షణ తరువాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా వివిధ స్థాయిల్లో చర్చలు జరగడంతో బలగాల ఉపసంహరణ, కొన్ని కొత్త ఒప్పందాలు జరిగాయి.

అయితే.. ఈ ఒప్పందాలను పక్కనపెడుతూ చైనా మరోసారి భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో ఇండియన్ ఆర్మీ ఆ యత్నాలను అడ్డుకుంది. 

పాంగాంగ్ సో సరస్సు వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ మళ్లీ యాక్టివిటీ పెంచి సరిహద్దులను అతిక్రమించే చర్యలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించగా ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది.

ఇంతకుముందు పాంగాగ్ సరస్సుకు ఉత్తర వైపు గడబిడ సృష్టించి చైనా ఈసారి భారత సైన్యం దృష్టి మళ్లిస్తూ సరస్సు దక్షిణ వైపు ఆక్రమణలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో మరోసారి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఇండియన్ ఆర్మీ ఘర్షణ జరిగినట్లు ప్రకటించలేదు.. చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినట్లు మాత్రమే తెలిపింది.

గత గల్వాన్ ఘర్షణ కానీ ప్రస్తుత ఘర్షణ కానీ అంతా పాంగాంగ్ సో సరస్సు ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి.

పాంగాంగ్ సో సరస్సు Pangong Tso


పాంగాంగ్ సరస్సు కథేంటి?

భారత్, చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు ఉంది. టిబెట్‌లో దీన్ని సో న్యాక్ అని.. చైనాలో సోమో గాంగ్లా రింగ్పో అంటారు.

5 కిలోమీటర్ల వెడల్పు  134 కిలోమీటర్ల పొడవు ఉన్న దీని విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్లు ఉంది.

అయితే, ఇందులో సుమారు 60 శాతం సరస్సు ప్రాంతం టిబెట్ భూభాగంలో ఉంది. 

శీతాకాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది.

చుట్టూ భూభాగమే ఉండి, సముద్రంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఇది ఉప్పు నీటి సరస్సు. అయితే, ఇందులో తూర్పు ప్రాంతం చాలా తక్కువ లవణత కలిగి ఉంటుంది.. దాదాపు మంచినీరులాగే ఉంది. కానీ, సరస్సులో పశ్చిమ ప్రాంతాన మాత్రం లవణ గాఢత ఎక్కువగా ఉంటుంది. 

భారత్ వైపు ఉన్న ప్రాంతంలో చేపలు వంటి నీటి జీవులు చాలా తక్కువ.. టిబెట్ వైపు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అయితే, ఈ సరస్సు కేంద్రంగా అనేక పక్షి జాతులు ఉన్నాయి. 

సింధునది ఉపనది అయిన శ్యోక్ నది ఒకప్పుడు ఈ సరస్సుకు నీరందించేది కానీ కాలక్రమేణా సరస్సుకు, శ్యోక్ నదికి లింక్ తెగిపోయింది. ప్రస్తుతం భారత్ వైపు నుంచి రెండు సెలయేర్లు ఈ సరస్సులోకి ప్రవహిస్తుంటాయి.


ఎవరికి ఎంతవరకు పట్టుంది

భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ కొంత భాగం ఈ సరస్సు మీదుగా వెళ్తుంది. అయితే, ఇక్కడ రెండు దేశాల మధ్య సరిహద్దులు కచ్చితంగా నిర్ణయించుకోకపోవడంతో ఎవరికివారు తమదంటే తమదంటూ కొంత ప్రాంతం విషయంలో వాదిస్తుంటారు. పాంగాంగ్ సో సరస్సు తీరం వెంబడి ఉన్న పర్వత బంజర్లు ఉంటాయి. వీటిని ఫింగర్లు అంటారు. భారత వాదన ప్రకారం ఫింగర్ 8 వరకు మన భూభాగమే. కానీ, చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటుంది.

అయితే, భారత్ ఫింగర్ 8 వరకు తమదే అంటున్నా ఫింగర్ 4 వరకు మాత్రమే సైనిక నియంత్రణ ఉంది. అటు చైనా కూడా ఫింగర్ 2 వరకు తమదే అంటున్నా పింగర్ 4 వరకు సైనిక నియంత్రణ ఉంది. 

చాలాకాలంగా ఫింగర్ 4 వరకు ఇటు భారత్, అటు చైనా సైన్యాల సంచారం ఉన్నా ఇప్పుడు చైనా ఫింగర్ 2 దాటి భారత్ సైన్యం రాకుండా అడ్డుపడుతుండడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి.

కార్గిల్ యుద్ధం సమయంలో భారత్ పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని బలగాలను కొంత పాక్ సరిహద్దుకు తీసుకెళ్లినప్పుడు అదే అదనుగా చైనా ఫింగర్ 4 దాటి రోడ్డు నిర్మాణాలకు ప్రయత్నించింది. ఇప్పుడు ఫింగర్ 2 వరకు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Our Exclusives:

ప్రణబ్ ముఖర్జీ: మరింత క్షీణించిన మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం

ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.

ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.

ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.

2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.

ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.

Read Our Exclusives:

28, ఆగస్టు 2020, శుక్రవారం

లాక్‌డౌన్: ముంబయి ప్రజలపై ఒత్తిడి విపరీతం.. చెన్నైలో కొంత నయం.. విద్యార్థులకు సంతోషం తగ్గిపోయింది.. ప్రజలకు నిద్ర పట్టలేదు

ఒత్తిడి, స్ట్రెస్

ముంబయి, చెన్నై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, సైకాలజీ, స్ట్రెస్, నీట్, ఎగ్జామ్స్

కరోనావైరస్, లాక్‌డౌన్ కాలంలో మనుషులపై ఒత్తిడి ఏ స్థాయిలో పెరిగిందనేది తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ముంబయి ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అందుకు భిన్నంగా చెన్నై ప్రజలు తక్కువ ఒత్తిడికి గురయ్యారట.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మద్య 8,396 మందిపై ఈ సర్వే చేశారు. యువర్ దోస్త్ అనే ఆన్‌లైన్ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫాం ఈ సర్వే చేపట్టింది. ఇందులో ముంబయి ప్రజానీకంలో ఒత్తిడి స్థాయి 48 శాతం పెరిగినట్లు గుర్తించారు. దేశంలో మరే నగరంలోనూ ప్రజలు ఈ స్థాయిలో ఒత్తిడికి గురి కావడం లేదు.

బెంగళూరులో 37 శాతం, దిల్లీలో 35 శాతం, చెన్నైలో 23 శాతం ఒత్తిడి స్థాయి పెరిగినట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా చూసుకుంటే లాక్ డౌన్ కారణంగా 65 శాతం మందిపై ఒక మాదిరి నుంచి తీవ్ర స్థాయి వరకు ఒత్తిడి ఉందని గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో జనాల్లో ఒత్తిడి ఒక్కటే కాదు కోపం కూడా బాగా పెరిగిపోయిందట. అదే సమయంలో సంతోషం తగ్గిందని తేలింది.

ప్రజల్లో కోపం 33 శాతం పెరిగిందని.. సంతోషం 6 శాతం తగ్గిందని గుర్తించారు. 

59 శాతం మందిలో వర్క్, లైఫ్ బ్యాలన్స్ కూడా తప్పినట్లు గుర్తించారు.


విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి 

ఎక్కువగా విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగినట్లు ఈ సర్వే గుర్తించింది. వారిలో  అంతకు ముందు కంటే 39 శాతం ఒత్తిడి స్థాయి పెరగ్గా ఉద్యోగుల్లో 35 శాతం ఒత్తిడి స్థాయి పెరిగిందట. 

లాక్ డౌన్ పొడిగిస్తున్నకొద్దీ విద్యార్థుల్లో కోపం, యాంగ్జైటీ ఎక్కువైందని.. అదే సమయంలో వారిలో ఆనందం తగ్గిపోయిందని సర్వేలో గుర్తించారు.

లాక్ డౌన్ కాలంలో ప్రజల్లో ఉద్వేగం వల్ల ఆవేశం 22 శాతం పెరిగిందని.. నిద్ర 11 శాతం తగ్గిపోయిందని సర్వే గుర్తించింది. 

Read Our Exclusives:

27, ఆగస్టు 2020, గురువారం

నరేంద్రమోదీకి చైనాలో భారీగా ఫ్యాన్స్... చైనా సొంత మీడియా సర్వేలో వెల్లడైన నిజం

 

ఇండియా, చైనా జెండాలు

‘ది గ్లోబల్ టైమ్స్’.. చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ కనుసన్నల్లో నడిచే పత్రిక. ఆ పత్రిక తాజాగా భారత్-చైనాల సంబంధాలపై చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

భారత్, నరేంద్ర మోదీ గురించి చైనా ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే చేయగా 50 శాతం కంటే ఎక్కువ మంది సానుకూలత చూపారు.

భారత్, చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ‘ది గ్లోబల్ టైమ్స్’, చైనా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్(సీఐసీఐఆర్)లు చైనాలో 1960 మందితో మాట్లాడి చేపట్టిన అభిప్రాయ సేకరణలో సగానికంటే ఎక్కువ మంది భారత్, భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే మంచి అభిప్రాయమే వ్యక్తం చేశారు.

సర్వేల్లో పాల్గొన్న చైనీయుల్లో 53.5 శాతం మంది భారత్ అంటే తమకు సానుకూల అభిప్రాయం ఉందని చెప్పగా, భారత ప్రధాని నరేంద్రమోదీపై 50.7 శాతం మంది సానుకూలత వ్యక్తంచేశారు.

లద్దాఖ్ వద్ద సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు మధ్య ఘర్షణ జరగగా, ఆ తరువాత రెండు దేశాల సైనికాధికారులు, విదేశాంగ మంత్రుల స్థాయిలో సమావేశాలు జరిగాయి. 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినా ప్రతిష్టంబన కొనసాగుతున్న తరుణంలో ‘ది గ్లోబల్ టైమ్స్’ అనేక అంశాలపై సర్వే చేసింది. భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంట్, భారత్ సైనిక సామర్థ్యం వంటి అంశాలపైనా ఈ సర్వేలో చైనీయులు తమ అభిప్రాయాలు తెలిపారు.

వీటన్నిటినీ క్రోడీకరించి గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. అయితే, ట్విటర్‌లో ఆ పత్రిక పోస్ట్ చేసిన ఇన్ఫోగ్రాఫిక్‌లో భారత్, మోదీ పట్ల చైనీయుల సానుకూలతకు సంబంధించిన డాటాను చూపించినప్పటికీ కథనంలో మాత్రం ఆ విషయం ప్రస్తావించలేదు. 

గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన సర్వే రిపోర్ట్


చైనాపై కోపం ఏ రేంజ్‌లో ఉందనుకుంటున్నారు

భారత్ ఆర్థికపరంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతుందా అన్న ప్రశ్నకు 49.6 శాతం మంది అవునని చెప్పగా 27.1 శాతం మంది ఆ వాదనతో ఏకీభవించలేదు. 23.3 శాతం మంది దీనిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు.

ప్రస్తుతం భారత్‌తో యాంటీ చైనా సెంటిమెంట్ రగులుతోందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 70.8 శాతం మంది నుంచి అవునన్న సమాధానం వచ్చింది.

15.2 శాతం మంది మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. 


ఇండియన్ ఆర్మీ అంటే చైనా భయపడుతోందా

ఇక భారత సైనిక బలగాల వల్ల చైనాకు ముప్పు ఉందా అన్న ప్రశ్నకు సర్వేలో పాల్గొన్నవారిలో 30.9 శాతం మంది అవుననే చెప్పారు. 

57.1 శాతం మంది అలాంటి ముప్పేమీ ఉండదన్నారు. 

12 శాతం మంది దీనిపై నిర్దిష్ట అభిప్రాయం వ్యక్తం చేయలేదు.


చైనా, భారత్ సంబంధాలకు అడ్డుగోడలేమిటి?

రెండు దేశాల మధ్య సంబంధాలలో అతి పెద్ద అవరోధమేంటన్న ప్రశ్నకు అత్యధికుల నుంచి వచ్చిన సమాధానం సరిహద్దు వివాదం. సరిహద్దు వివాదమే రెండు దేశాల మధ్య సంబంధాలకు అడ్డుగోడ అని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు.

24.5 శాతం మంది అమెరికా జోక్యం వల్ల కూడా చైనా, భారత్‌ల సంబంధాలు దెబ్బతింటున్నాయన్నారు.

చైనా పట్ల భారత్ విద్వేషం చూపడం వల్లే సంబంధాలు దెబ్బతింటున్నాయని 22.7 శాతం మంది.. శత్రుదేశంగా భావించడం వల్ల అని 10.7 శాతం మంది చెప్పారు.

వాణిజ్య రక్షణాత్మకతను 4.8 శాతం.. టిబెట్ అంశాన్ని 4 శాతం మంది కారణంగా చెప్పారు.


చైనా వస్తువుల బహిష్కరణపై ఎలా ఫీలవుతున్నారు

చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు.. చైనా సంస్థలపై నిషేధంపై 35.3 శాతం మంది తీవ్రంగా స్పందించారు. చైనా ప్రతీకార చర్యలకు దిగాల్సిందేనన్నారు.

29.3 శాతం మంది మాత్రం భారత్ ఈ విషయంలో సీరియస్‌గా ఏమీ లేదని.. పెద్దగా పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఇది పెద్ద సమస్యేనని.. దీనిపై దృష్టిపెట్టాలని 23.2 శాతం మంది చెప్పారు.


చైనాను దాటాలంటే భారత్ ఎన్నాళ్లు పడుతుంది..?

భారత్ అన్ని రంగాల్లో చైనాను అధిగమించాలంటే ఎంత కాలం పడుతుందని ఈ సర్వేలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు.

భారత్ ఎన్నటికీ అధిగమించలేదని 54 శాతం మంది చెప్పగా.. వందేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని 10.4 శాతం మంది చెప్పారు.

పదేళ్లలోపేనని 3.9 శాతం మంది.. 20 ఏళ్లు చాలని 8.1 శాతం మంది, 50 ఏళ్లలో అధిగమించొచ్చని 8.7 శాతం మంది.. 100 ఏళ్లు పట్టొచ్చని 5.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

Read Our Exclusives:

 ఆంధ్రప్రదేశ్: నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన ఆ 4 పనులు ఏమిటి 

Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి? 

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం 

ఫోన్ ట్యాపింగ్: జగన్ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందా.. అలాంటి అధికారం దేశంలో ఎవరెవరికి ఉంది

25, ఆగస్టు 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్: నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన ఆ 4 పనులు ఏమిటి

Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు


ఆంధ్రప్రదేశ్, నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం, టీడీపీ, వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి

..............

ప్రతిపక్షంలో ఉండడమంటే రాజకీయంతో పాటు ప్రజా సేవ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా. 

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వ పాలనలోనే ఉన్నప్పటికీ సంఖ్యాబలమిచ్చిన అపరిమిత అధికారాల వల్ల గాడి తప్పే ప్రమాదముంది.

ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పాత్ర పోషించడమంటే అత్యంత బాధ్యతాయుతంగా నాయకత్వం వహించడమే.

రాష్ట్రంలోని ఇతర పార్టీలో నోరెత్తలేని స్థితిలో ఉండడం.. నోరెత్తినా వాటి స్వరం బిగ్గరగా వినిపించని పరిస్థితిలో ఉండడంతో ఎమ్మెల్యేల బలం పరంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బలహీన ప్రతిపక్షమే అయినప్పటికీ గ్రామగ్రామానా విస్తరించిన అసంఖ్యాకమైన క్యాడర్ పరంగా బాహుబలిలాంటి ఆ పార్టీ సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. 

సమర్థమైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర అంటే ఒక అసాధారణమైన, అతి క్లిష్టమైన పని. 

కనీసం నాలుగు వేర్వేరు పనులు ఒకేసారి చేయాల్సి ఉంటుంది. పైగా ప్రతి పనికీ దేనికదే ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. 

1) తక్షణం, నిత్యం చేయాల్సిన పని

ప్రభుత్వం చేసే తప్పులను దొరకబట్టుకుంటూ ఎప్పటికప్పుడు సవాల్ చేయడం. ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా చేయడం.

ప్రభుత్వం చేసే చట్టాలను నిశితంగా పరిశీలించి లోపాలు లేకుండా నిలదీయడం.

కోవిడ్ వంటి సంక్షోభం ఉన్న సమయంలో ఇది చాలా సున్నితమైనది.. సంక్లిష్టమైనది కూడా. 

మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉండడంతో ఎదురు నిలవడమూ కష్టమే. తిరుగులేని మెజారిటీ తమకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని భావించి ప్రభుత్వం, అందులోని వ్యక్తులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు ఆ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి.

2) పార్టీని నడిపించడం, కాపాడుకోవడం

అధికారంలో ఉన్నప్పుడు అంతా సాఫీగా సాగిపోతుంది. పార్టీ నాయకుడి నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించరు. నాయకుడి నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తారు. చెప్పిన పనిని గొప్పగా చేస్తారు. నాయకుడి దృష్టిలో పడి పదవో, పనో సంపాదించుకుని లబ్ధి పొందాలన్న కోరిక చిన్నస్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు అందరిలో ఉంటుంది. అందుకే నాయకుడి దృష్టిలో పడేందుకు కష్టపడి పనిచేస్తారు.. అవసరమైతే సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు చేస్తారు. నాయకుడి మాటను వేదవాక్కుగా భావిస్తారు. నాయకుడిపై ఈగ వాలకుండా చూసుకుంటారు.

కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా కాదు. అధికార పక్షం ధాటిని ఎదుర్కొంటుండాలి. తమ ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలు, మూలాలు కాపాడుకుంటుండాలి. అందుకోసం అధికార పార్టీతో పెద్దగా వివాదాలు కొనితెచ్చుకోకుండా తెలివిగా మసలుకుంటుంటారు ఎక్కువ మంది నేతలు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోరు. తమ నాయకుడి మాటను లెక్క చేయని వారూ ఉంటారు. అధికార పక్షంతో కుమ్మక్కయ్యేవారు... అధికార పార్టీలోకి ఫిరాయించేవారూ అన్ని రకాలూ ఉంటారు.

ఇలాంటివారందినీ దారిలో పెట్టుకుంటూ, అదుపులో పెడుతూ, చేజారిపోకుండా చూస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయాలి ప్రతిపక్ష నాయకుడు. 

ప్రతి కార్యక్రమాన్నీ ముందుండి నడిపించాలి. తన తరువాత శ్రేణి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలతోనూ నిత్యం ఇంటరాక్ట్ అవుతుండాలి. 

అధికార పక్షం నుంచి వారిపై ఉండే ఒత్తిళ్లు, కేసులు వంటిని ఎదుర్కొనేలా భరోసా ఇవ్వాలి.

3) వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండడం

ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ తరువాత ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండాలి. ప్రభుత్వంలో లేం కదా అని ఊరుకోకుండా ప్రజల మద్దతును పొందే కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. ప్రజలు కష్టాలలో ఉంటే ఆదుకోవాలి. పార్టీకి శక్తినిస్తుండాలి.

ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటుండాలి.

తదుపరి ఎన్నికల్లో గెలిచేది మనమే అనే నమ్మకం పార్టీలో కలిగించాలి.

అంతేకానీ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చేవరకు వెయిట్ చేద్దాం అనే వైఖరి కనబరచకూడదు.

4) ఏ క్షణాన అధికారం దొరికినా తక్షణం రాష్ట్రం అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధంగా ఉంచడం.. ప్రజాసమస్యలపై నిర్మాణాత్మక హామీలివ్వడం

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికారం తమకే ఉంటే ఏం చేస్తాం, ఏం చేయాలనే విషయంలో క్లారిటీతో ఉంటూ పాలనకు సిద్ధంగా ఉండడం. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు కానీ, ఈలోగా రాజకీయ మార్పులు జరిగి కానీ తమకు అధికారం వస్తే తక్షణం రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనే విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలి.

అలాగే, ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతుండాలి. 

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని చెప్పే చంద్రబాబు ఆ పని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది.

Read Our Exclusives:


24, ఆగస్టు 2020, సోమవారం

Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి?

 

Kim Jong-Un కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ కోమాలోకి వెళ్లారా.. మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించిందా? అవుననే అంటోంది దక్షిణ కొరియా.

నిత్యం ఉత్తర కొరియాపై కన్నేసి ఉంచే దక్షిణ కొరియా ఒక్కటే ఉత్తరకొరియాలో ఏం జరుగుతోందనేది అంతో ఇంతో చెప్పగలుగుతుంది. అయితే.. ఒక్కోసారి దక్షిణ కొరియా నిఘా వర్గాల ముసుగులో నిజాలను తొక్కిపెట్టి అసత్యాలనూ ప్రచారం చేస్తుంది. 

అయితే, తాజాగా దక్షిణ కొరియా అధికారి ఒకరు కిమ్ కోమాలోకి వెళ్లారని చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ వార్త పాకింది. 

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ రీసెంటుగా మాట్లాడుతూ తమ దేశ నిఘావర్గాల సమాచారం ప్రకారం కిమ్ ప్రస్తుతం కోమాలో ఉన్నారని చెప్పారు. అంతేకాదు.. కిమ్ కోలుకోకపోవడంతో ఆయన స్థానంలో సోదరి కిమ్ యో జోంగ్ పాలన వ్యవహారాలు చూస్తున్నారనీ చెప్పారు.


మరోవైపు కొద్దిరోజులుగా ఈ అధికార మార్పిడిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను కిమ్‌ తన సోదరి కిమ్‌ యో జోంగ్కు కట్టబెట్టారని మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జోంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో చాంగ్‌ సాంగ్‌ మిన్‌ మాట్లాడుతూ.. ‘కిమ్ కోమాలో ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నాను. కానీ అతను మరణించలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని.. ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు.


కాగా, గతంలో కూడా కిమ్‌ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయనకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని పుకార్లు వచ్చాయి. కానీ కొద్దికాలం కిందట ఆయన కనిపించడంతో అవన్నీ వదంతులేనని తేలిపోయింది. మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా.. లేదంటే కిమ్ నిజంగానే కోమాలో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.

Read Our Exclusives:

23, ఆగస్టు 2020, ఆదివారం

కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికే కష్టం

 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

సోనియా గాంధీ ఆరోగ్యం రాజకీయాలకు సహకరించడం లేదు.. 

రాహుల్ గాంధీ రాజకీయం ఈ దేశానికి సరిపోవడం లేదు... 

ప్రియాంకాగాంధీ ఇంకా నియోజకవర్గ స్థాయికి మించి ఎదగలేదు.. 

మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కయిన కుటుంబంలోని తలకాయలేవీ ఆ పార్టీని గాడిన పెట్టగలిగేలా కనిపించడం లేదు. 

రాజకీయాల్లో ఎంతో అనుభవించినందుకు ఇంకేముందిలే అనుకుంటూ.. అనుభవం ఉన్నందున మనకెందుకులే అనుకుంటూ ఈ చేతకానితనాన్నంతా భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నారు నాయకులు. 

మూడు చేపల కథంలోని సుమతి వంటి నాయకులు ముందుచూపుతో బయటపడుతుంటే... కాలమతి టైపు నాయకులు అదను కోసం ఎదురుచూస్తున్నారు.. మందమతులు అడుగంటిన కాంగ్రెస్ చెరువులోని బురదలో ఆక్సిజన్ కోసం వెతుక్కుంటూ ఎగఊపిరి తీస్తున్నారు. 

కాంగ్రెస్ అనే ఆ చెరువును బతికించడం, అందులో చేపలు బయటకుపోకుండా, బతుకుపోకుండా చూడడం ఇక సోనియా, రాహుల్, ప్రియాంక వల్ల కాదని పార్టీ నాయకులందరికీ అర్థమైపోయి చాలాకాలం గడవడంతో ఇప్పుడు సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు ఒక 23 మంది సీనియర్లు నేరుగా సోనియాకే లేఖ రాశారు. 

నాయకత్వాన్ని మార్చి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీకి పూర్తి కాల, క్రియాశీల అధ్యక్షుడు కావాలని కోరారు.

అంటే అవుట్ డేటెడ్ సోనియా, ఆన్ అండ్ ఆఫ్ రాహుల్, అప్ డేట్ కాని ప్రియాంకా కాకుండా ఇంకెవరైనా అధ్యక్ష స్థానంలోకి రావాలని నిర్మొహమాటంగా చెప్పేశారు. 

మరెవరు?

దీంతో.. సోనియా కుటుంబానికి చెందని నేతలు ఎవరున్నారనేదీ సందిగ్థంగానే ఉంది ఆ పార్టీలో. బీజేపీకి అంతగా పట్టులేని, ఆ పార్టీ సిద్ధాంతాల బలవంతపు రుద్దుడును వ్యతిరేకిస్తున్న దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న వాదన వినిపిస్తున్నా ఆ అవకాశమూ కనిపించడం లేదు. 

జాతీయ స్థాయి నేత చిదంబరం, శశి థరూర్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.. కానీ, చిదంబరం జైలులో పడడంతో ఆయన దూకుడు తగ్గిపోయింది. థరూర్‌‌కు నాయకుడిగా కంటే మేధావిగానే పేరుంది. 

పైగా ఆయన అప్పుడప్పుడూ బీజేపీ వాసన కొడుతున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి.

ఉత్తరాది నేతల విషయానికొస్తే జాబితా పెద్దగానే ఉన్నా అన్నీ గోడ మీద పిల్లులే. 

పార్టీ పరిస్థితి చూసి సగం మంది ఇప్పటికే బీజేపీతో రహస్య ప్రేమాయణాలు నడిపిస్తున్నారు.

కేవలం అధికార ప్రతినిధులే నోరు విప్పి రాహుల్ గాంధీకి సపోర్టుగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 

దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు సోనియా. 

పోనీ ఎవరో ఒకరిని నమ్మి అధ్యక్ష స్థానం కట్టబెడితే వారి మాట మిగతావారు ఎంతవరకు వింటారన్నదీ ప్రశ్నే. 

ఇక రాహుల్ గాంధీనే ఎలాగోలా బతిమాలుదామనుకున్నా ఆయన కుర్చీ ఎక్కడానికి మొరాయిస్తున్నాయి. 

ఒకవేళ ఆయన్నే మళ్లీ చేసినా ఆయన నాయకత్వంపై విశ్వాసం లేక చాలామంది పార్టీ నుంచి జారిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీలోనే డౌట్లు. 

 ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు అందుకుని పార్టీలో దూకుడు నింపే నాయకుడి కోసం ఆ పార్టీ కరోనా వ్యాక్సిన్ కనుగొనడం కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల కంటే కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.

Read Our Exclusives: