20, ఏప్రిల్ 2020, సోమవారం

కరోనా వైరస్: లాక్‌డౌన్ ఉన్నా ఇవన్నీ చేయొచ్చు




కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో కొన్ని నిబంధనల్ని ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం సడలించింది. అయితే, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు మినహా కొత్తగా మరే రంగానికీ సడలింపులు ఇవ్వడంలేదని తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి.
మిగతా రాష్ట్రాల విషయానికొస్తే, తాజా సడలింపులు చాలా వరకు దేశంలో సగం జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగానికి వర్తిస్తాయి.
దేశంలో ఆహార ధాన్యాలకు కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ ఉపశమనం కల్పిస్తున్నట్లు అనిపిస్తోంది.
అయితే గత వారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులన్నీ అమలులో ఉండవు.
ఈ-కామర్స్ సంస్థలు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్లు డెలివరీ చేయడానికి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఆదివారం రద్దు చేసింది.
దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో హాట్ స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాలలో ఎటువంటి సడలింపులు వర్తించవు.

జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలు, రాష్ట్రాల మధ్య రవాణాకు కూడా అనుమతి ఉండదు.
సడలించిన నిబంధనలు ఏమిటి?
సడలించిన నిబంధనల ప్రకారం వ్యవసాయం, మత్స్య పరిశ్రమకు సంబంధించిన పనులు ప్రారంభించవచ్చు. దీంతో పండిన పంట సేకరించడానికి వీలవుతుంది. వ్యవసాయ రంగంలో పని చేస్తున్న రోజు కూలీలకు పని దొరుకుతుంది.
రాష్ట్రాల మధ్య ధాన్యం, ఆహార ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఉంటుంది.
సామాజిక దూరాన్ని పాటిస్తూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, నీటి పుంపులు వేయడం లాంటి అత్యవసర పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు.
ఇలాంటి చోట కొన్ని వేల మంది రోజు కూలీలకు పని దొరుకుతుంది.
బ్యాంకులు, ఏటీఎంలు , ఆస్పత్రులు, మందుల షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుస్తారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు కూడా పనులు మొదలుపెట్టవచ్చు.
హాట్‌స్పాట్‌లుగా గుర్తించని కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా తెరవవచ్చు.
అయితే, వీరంతా సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.
ఏయే సేవలు పని చేయాలని ఎవరు నిర్ణయిస్తారు?
నిబంధనల సడలింపు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు.
అందుకే, తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
దిల్లీలోనూ ఎటువంటి నిబంధనలు సడలించే ప్రసక్తి లేదని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో పరిస్థితి ఇంకా ఆందోళనకంగానే ఉందని, వారం రోజుల తర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో కూడా నిర్బంధం అమలులోనే ఉంటుంది.
కేరళలో మాత్రం రాష్ట్రంలో గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో నిబంధనలను సడలించింది.
ప్రైవేట్ వాహనాలు తిరగడానికి, రెస్టారెంట్లు తెరవడానికి అనుమతి ఉండదు. అయితే, దీనికి కేరళ ప్రభుత్వం సరి- బేసి విధానాన్ని అమలు చేయనుంది. సరి సంఖ్య కలిగిన వాహనాలకు ఒక రోజు అనుమతి ఇస్తే, మిగిలిన వాటికి ఇంకొక రోజు అనుమతి లభిస్తుంది. దీంతో, రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్యను నియంత్రించవచ్చన్నది అక్కడి ప్రభుత్వ ఆలోచన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి