22, నవంబర్ 2019, శుక్రవారం

బొలీవియా సంక్షోభం అమెరికా పనేనా?

బొలీవియా, ఇవో మొరేల్స్, ఇవో మొరాలెస్ bolivia, evo morales

ఎక్కడ విలువైన ఖనిజ, చమురు నిక్షేపాలుంటాయో.. అక్కడ అమెరికా తమ డేగ రెక్కలతో వాలిపోతుంది. ఆ దేశ రాజ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తమకనుకూల వ్యక్తులను అధికారంలో ప్రతిష్ఠిస్తుంది. ఇప్పుడు బొలీవియాలోనూ అదే జరుగుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాశ్రేయస్సుకు పెద్దపీట వేసి, సామాజిక రాజకీయ మార్పుల కోసం కృషిచేస్తున్న మూలవాసుల నాయకుడు, దేశాధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ను పదవీచ్యుతుడ్ని చేసింది. సైనిక తిరుగుబాటుకు అమెరికా అన్నివిధాలా దన్నుగా నిలిచింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యం ఇచ్చే సైనిక పాలనలోకి బొలీవియా వెళ్లింది. మొరేల్స్‌ మెక్సికోలో తలదాచుకోవాల్సిన విషాదకర పరిస్థితి తలెత్తింది.
సైనిక పాలనకు వ్యతిరేకంగా బొలీవియా కార్మికులు, రైతులు, గిరిజనులు పెద్ద పోరాటమే చేశారు. రాజధాని లాపాజ్‌లోనూ, కార్మికవర్గం బలంగా ఉన్న ఎల్‌ ఆల్టోలోను సైన్యంతో తలపడుతూనే ఉన్నారు. కోచమ్‌బాంబాలో సైన్యం జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని సైన్యం దాడులకు పాల్పడింది. అక్టోబరు 20న జరిగిన అధ్యక్ష ఎన్నికను వివాదాస్పదం చేస్తూ మూడువారాల పాటు జరిగిన నిరసన ప్రదర్శనలు అంతిమంగా ఈ నెల 17న సైనిక తిరుగుబాటుకు దారితీశాయి. మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆనందానికి అవధుల్లేవు. ఇక వెనిజులా, నికరాగ్వా నాయకులకు కూడా ఇదే గతి పడుతుందనేలా మాట్లాడారు.
లాటిన్‌ అమెరికాలో తన సామ్రాజ్యవాద విధానాన్ని అమెరికా కొనసాగిస్తున్నదన్న వాస్తవాన్ని బొలీవియా సైనిక తిరుగుబాటు ప్రతిబింబిస్తోంది. 2002లో బుష్‌ నేతృత్వంలో వెనిజులాలో హుగో చావెజ్‌ మీద విఫల సైనిక కుట్ర నుంచి 2009లో ఒబామా మద్దతుతో హౌండురాస్‌లో మాన్యుయెల్‌ జెలాయా ప్రభుత్వాన్ని కూలదోయటం దాకా, నేడు బొలీవియా ఘటనతో లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై క్షీణిస్తున్న అమెరికా పెత్తనాన్ని తిరిగి నెలకొల్పేందుకు అమెరికా తన సామ్రాజ్యవాద విధానాన్ని సొంత పెరడు లాటిన్‌ అమెరికాలో సైనిక హింసతో కొనసాగిస్తున్నది.
బొలీవియాలో అపార ఇంధన, ఖనిజ వనరులున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో 70శాతం లిథియం ఇక్కడే ఉంది. ఇప్పటికే పొరుగున ఉన్న అర్జెంటీనా, చిలీ దేశాల్లో లిథియం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొలీవియాలో మాత్రం ప్రభుత్వరంగ సంస్థతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తవ్వకాలు సాగించాలని మొరేల్స్‌ పట్టుబట్టారు. ఆయన పలు కార్పొరేటు కంపెనీలను దేశం నుంచి బయటకు పంపించారు. దీంతో పశ్చిమాసియా మాదిరిగా ఈ ప్రాంతాన్ని గుప్పెట పెట్టుకోవాలన్న దురాశతోనే బొలీవియాలో అమెరికా సైనిక తిరుగుబాటును ప్రోత్సహించింది.
చైనాతో లాటిన్‌ అమెరికా వాణిజ్యం నిరుడు రూ.21,42,000కోట్లకు చేరుకోవడం కూడా అమెరికాకు కంటగింపుగా మారింది. మొరేల్స్‌.. లాటిన్‌ అమెరికా దేశాలలోనే మొదటి భూమిపుత్ర నాయకుడు. స్థానిక తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన నేత. 1998లో లాటిన్‌ అమెరికాలో హుగో చావెజ్‌తో మొదలైన బొలీవరియన్‌ విప్లవ క్రమంలో భాగంగా మొరేల్స్‌ ప్రభుత్వం ఏర్పడింది. 2000-05 మధ్యకాలంలో నీటిని ప్రైవేటీకరిం చడానికి వ్యతిరేకంగా, గ్యాస్‌ని జాతీయీకరించాలని జరిగిన ప్రజా ఉద్యమాలతో మొరేల్స్‌కు ముఖ్య భూమిక ఉంది. తద్వారా ఆయన అధ్యక్షుడయ్యారు. ఆయన గిరిజనుల నుంచి ఎన్నికైన తొలి అధ్యక్షుడు. ఆయన హయాంలో పేదరికం 45నుంచి 25శాతానికి తగ్గిపోయింది. అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. గనులనూ, వనరులనూ ప్రభుత్వరంగంలోకి తెచ్చి, విద్యనూ వైద్యాన్నీ సార్వత్రికం చేశారు. సహజవాయువును జాతీయం చేయగా సమకూరిన సొమ్మును దారిద్య్రనిర్మూలనకు ఉపయోగించారు. రానున్న విద్యుత్‌ బ్యాటరీల యుగంలో అత్యంత కీలకమైన లిథియం వనరును కార్పొరేట్‌ కంపెనీలు తన్నుకుపోడానికి ఆయన అనుమతించలేదు. కార్మికోద్యమ నేతగా, మూలవాసుల నాయకుడిగా, ప్రజాసంక్షేమ సారథిగా దశాబ్దంన్నరపాటు దేశాన్ని ఏలిన మొరేల్స్‌ తన పాలనలో దేశాన్ని సామాజిక, ఆర్థికాభివృద్ధికి మంచి నమూనాగా తీర్చిదిద్దాడు. గ్రామీణ పేదలు, కార్మికులు, భూమిపుత్రులు మొరేల్స్‌ విధానాలకు మద్దతుగా నిలిచారు. పట్టణ ప్రాంతాలలోని ఉన్నతవర్గం, శ్వేతజాతీయులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారారు. వీరికి విదేశీ కార్పొరేట్‌ సంస్థల వెన్నుదన్ను ఉంది. లాటిన్‌ అమెరికా దేశాలలో వనరులపై కన్నేసిన అమెరికా-యూరోపియన్‌ కంపెనీలే ఇక్కడ సంక్షోభాన్ని పెంచి పెద్దచేయడంలో కీలక పాత్ర వహించాయి. దాదాపు దశాబ్దంన్నరగా బొలీవియాను పాలిస్తున్న మొరేల్స్‌ అక్టోబరులో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఉన్నతవర్గాలకు చెందిన ప్రతిపక్షం గోలపెట్టింది. అంతర్జాతీయ బృందాలు దీనికి వంతపాడాయి. తిరిగి ఎన్నికలు జరిపించడానికి తాను సిద్ధమేనని మొరేల్స్‌ ప్రకటించినా.. మొరేల్స్‌ పోటీ చేయకూడదంటూ షరతు పెట్టడంతో ఆయన అంగీకరించలేదు. దీన్ని సాకుగా చేసుకొని సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారు. చిలీ ప్రజలు ఏ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారో వాటినే బొలీవియాపై రుద్దేందుకు ఈ సైనిక కుట్ర జరిగింది. చిలీలో అలెండీ ఏ విధానాలను అమలు చేసినందుకు అమెరికా హత్య చేయించిందో, అవే కారణాలతో బొలీవియా మొరేల్స్‌ను సైనిక కుట్రతో అమెరికా అధికారం నుంచి దించేసింది. ఇప్పుడు చిలీ ప్రజల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్నీ, సంక్షేమాన్నీ పరిరక్షించుకొనేందుకు బొలీవియన్లు ఉద్యమిస్తారని, అమెరికా కుట్రలు, కుతంత్రాల మెడలు వంచుతారని ఆశిద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి