23, నవంబర్ 2019, శనివారం

అజిత్ పవార్: శరద్ పవార్‌కు ఏమవుతారు? రాజకీయంగా ఎలా ఎదిగారు?

అజిత్ పవార్

అజిత్ పవార్(Ajit pawar).. మహారాష్ట్ర రాజకీయాల్లో(Maharashtra Politics) ట్రంప్ కార్డు వేసిన ఈ నాయకుడి పేరు అందరి నోళ్లలో నానుతోంది. శివసేన(Shivsena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్(Congress)లకు షాకిస్తూ బీజేపీని అధికారంపీఠంపై కూర్చోబెట్టిన నేత అజిత్ పవార్. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి, బీజేపీకి మద్దతు ప్రకటించి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని ట్విస్ట్ ఇచ్చిన నాయకుడు. శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణం చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్న కుమారుడే అజిత్ పవార్. గోవిందరావ్ పవార్ దంపతులకు 11 మంది సంతానం. వారిలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ స్టూడియోస్'లో అనంతరావ్ పవార్ పని చేసేవారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ పదో తరగతి తరువాత తండ్రి చనిపోవడంతో విద్యాభ్యాసాన్ని వదిలేసి, తన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ ఓ బలమైన నేతగా ఎదిగారు. మరోవైపు, తన చదువును కొనసాగించడానికి పుణె జిల్లా నుంచి అజిత్ పవార్ ముంబైకి మకాం మార్చారు. 1982లో అజిత్ పవార్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎన్నికై... అదే పదవిలో ఏకంగా 16 సంవత్సరాలు కొనసాగారు.
అనంతరం  బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తన చిన్నాన్న శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన శరద్ పవార్ పీవీ నరసింహారావు కేబినెట్ లో రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ గెలుపొందారు. ఇదే స్థానం నుంచి వరుసగా 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. పృథ్విరాజ్ చవాన్ సీఎంగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పదంసిన్హ్ పాటిల్ కుమార్తె సునేత్రను అజిత్ పవార్ పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.

దేవేంద్ర ఫడణవీస్: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ఆయనే.. అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి

దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్


దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis), అజిత్ పవార్, మహారాష్ట్ర, Devendra Fadnavis, Ajit Pawar, Maharashtra, దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన

మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి. బీజేపీ, ఎన్సీపీ కూటమిగా అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ రాజకీయాల ముందు శివసేన నిలవలేకపోవడంతో కొన్నివారాలుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు దొరుకుతూ దేవేంద్ర ఫడణవీస్ మరోసారి ముఖ్యమంత్రయ్యారు. శనివారం ఉదయం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ ఖోశ్యారీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఇస్తామని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఫడణవీస్ చెప్పారు. ఫడణవీస్, అజిత్ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర భవిష్యత్ కోసం వారు పాటుపడతారని మోదీ పేర్కొన్నారు.

22, నవంబర్ 2019, శుక్రవారం

George Reddy జార్జి రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?


జార్జి రెడ్డి(George Reddy)... ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)లో 47 ఏళ్ల కిందట హత్యకు గురయిన విద్యార్థి నేత. ఆయన జీవితం నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా తెలుగునాట ఆయన చుట్టూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన విద్యార్థులు, అణగారిన వర్గాల సమస్యల కోసం పోరాడిన నాయకుడంటూ కొందరు.. కాదు కాదు, ఆయనో రౌడీ అంటూ మరికొందరు వాదిస్తున్నారు. జార్జిరెడ్డి అందరిపై దౌర్జన్యాలు చేసేవాడని.. బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగరరావును ఆయన అప్పట్లో కొట్టాడన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆయన్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు.. ఎలా చంపారు? నిందితులు ఎలా విడుదలయ్యారనే విషయాల్లో ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికగా అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. ఆయన్ను భగత్ సింగ్, చేగువేరాలతో పోల్చుతూ పాత అభిమానులతో పాటు కొత్త అభిమానులు పుట్టుకొస్తుంటే ఆయన్ను విమర్శించేవారూ ఎక్కువయ్యారు.
ఇదే సమయంలో జార్జి రెడ్డి పేరే కులాన్ని సూచిస్తున్నప్పటికీ ఆయన వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జార్జి రెడ్డి కులం, ఊరు, తల్లిదండ్రులు, జన్మదినం, భార్య పేరు, లవ్ ఎఫైర్స్ ఉన్నాయా అంటూ గూగుల్‌ను ప్రశ్నించి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిలో కొన్నిటికి సమాధానమే ఈ ఆర్టికల్.
జార్జిరెడ్డి జన్మదినం: భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరమైన 1947లో సంక్రాంతి రోజున(జనవరి 15న) జార్జి రెడ్డి జన్మించారు.
జార్జి రెడ్డి తల్లిదండ్రులు: చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్. తల్లి లీలా వర్గీస్‌ది కేరళ రాష్ట్రం పాల్ఘాట్. తండ్రిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా.
జార్జి రెడ్డి భార్య: జార్జి రెడ్డి అవివాహితుడు. 25 ఏళ్ల వయసులోనే హత్యకు గురయ్యాడు.
జార్జి రెడ్డి ప్రేమ కథ: జార్జి రెడ్డి ఈవ్ టీజింగ్‌కు వ్యతిరేకంగా పోరాడారని సమకాలీకులు చెబుతారు. ఆయన స్త్రీలను గౌరవించేవారని, ఎవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని చెబుతారు.
జార్జి రెడ్డి మరణం: జార్జి రెడ్డి 1972, ఏప్రిల్ 14న ఉస్మానియా క్యాంప‌స్‌లో హత్యకు గురయ్యారు.

బొలీవియా సంక్షోభం అమెరికా పనేనా?

బొలీవియా, ఇవో మొరేల్స్, ఇవో మొరాలెస్ bolivia, evo morales

ఎక్కడ విలువైన ఖనిజ, చమురు నిక్షేపాలుంటాయో.. అక్కడ అమెరికా తమ డేగ రెక్కలతో వాలిపోతుంది. ఆ దేశ రాజ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తమకనుకూల వ్యక్తులను అధికారంలో ప్రతిష్ఠిస్తుంది. ఇప్పుడు బొలీవియాలోనూ అదే జరుగుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాశ్రేయస్సుకు పెద్దపీట వేసి, సామాజిక రాజకీయ మార్పుల కోసం కృషిచేస్తున్న మూలవాసుల నాయకుడు, దేశాధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ను పదవీచ్యుతుడ్ని చేసింది. సైనిక తిరుగుబాటుకు అమెరికా అన్నివిధాలా దన్నుగా నిలిచింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అగ్రప్రాధాన్యం ఇచ్చే సైనిక పాలనలోకి బొలీవియా వెళ్లింది. మొరేల్స్‌ మెక్సికోలో తలదాచుకోవాల్సిన విషాదకర పరిస్థితి తలెత్తింది.
సైనిక పాలనకు వ్యతిరేకంగా బొలీవియా కార్మికులు, రైతులు, గిరిజనులు పెద్ద పోరాటమే చేశారు. రాజధాని లాపాజ్‌లోనూ, కార్మికవర్గం బలంగా ఉన్న ఎల్‌ ఆల్టోలోను సైన్యంతో తలపడుతూనే ఉన్నారు. కోచమ్‌బాంబాలో సైన్యం జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. గిరిజనులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని సైన్యం దాడులకు పాల్పడింది. అక్టోబరు 20న జరిగిన అధ్యక్ష ఎన్నికను వివాదాస్పదం చేస్తూ మూడువారాల పాటు జరిగిన నిరసన ప్రదర్శనలు అంతిమంగా ఈ నెల 17న సైనిక తిరుగుబాటుకు దారితీశాయి. మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆనందానికి అవధుల్లేవు. ఇక వెనిజులా, నికరాగ్వా నాయకులకు కూడా ఇదే గతి పడుతుందనేలా మాట్లాడారు.
లాటిన్‌ అమెరికాలో తన సామ్రాజ్యవాద విధానాన్ని అమెరికా కొనసాగిస్తున్నదన్న వాస్తవాన్ని బొలీవియా సైనిక తిరుగుబాటు ప్రతిబింబిస్తోంది. 2002లో బుష్‌ నేతృత్వంలో వెనిజులాలో హుగో చావెజ్‌ మీద విఫల సైనిక కుట్ర నుంచి 2009లో ఒబామా మద్దతుతో హౌండురాస్‌లో మాన్యుయెల్‌ జెలాయా ప్రభుత్వాన్ని కూలదోయటం దాకా, నేడు బొలీవియా ఘటనతో లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై క్షీణిస్తున్న అమెరికా పెత్తనాన్ని తిరిగి నెలకొల్పేందుకు అమెరికా తన సామ్రాజ్యవాద విధానాన్ని సొంత పెరడు లాటిన్‌ అమెరికాలో సైనిక హింసతో కొనసాగిస్తున్నది.
బొలీవియాలో అపార ఇంధన, ఖనిజ వనరులున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో 70శాతం లిథియం ఇక్కడే ఉంది. ఇప్పటికే పొరుగున ఉన్న అర్జెంటీనా, చిలీ దేశాల్లో లిథియం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొలీవియాలో మాత్రం ప్రభుత్వరంగ సంస్థతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తవ్వకాలు సాగించాలని మొరేల్స్‌ పట్టుబట్టారు. ఆయన పలు కార్పొరేటు కంపెనీలను దేశం నుంచి బయటకు పంపించారు. దీంతో పశ్చిమాసియా మాదిరిగా ఈ ప్రాంతాన్ని గుప్పెట పెట్టుకోవాలన్న దురాశతోనే బొలీవియాలో అమెరికా సైనిక తిరుగుబాటును ప్రోత్సహించింది.
చైనాతో లాటిన్‌ అమెరికా వాణిజ్యం నిరుడు రూ.21,42,000కోట్లకు చేరుకోవడం కూడా అమెరికాకు కంటగింపుగా మారింది. మొరేల్స్‌.. లాటిన్‌ అమెరికా దేశాలలోనే మొదటి భూమిపుత్ర నాయకుడు. స్థానిక తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన నేత. 1998లో లాటిన్‌ అమెరికాలో హుగో చావెజ్‌తో మొదలైన బొలీవరియన్‌ విప్లవ క్రమంలో భాగంగా మొరేల్స్‌ ప్రభుత్వం ఏర్పడింది. 2000-05 మధ్యకాలంలో నీటిని ప్రైవేటీకరిం చడానికి వ్యతిరేకంగా, గ్యాస్‌ని జాతీయీకరించాలని జరిగిన ప్రజా ఉద్యమాలతో మొరేల్స్‌కు ముఖ్య భూమిక ఉంది. తద్వారా ఆయన అధ్యక్షుడయ్యారు. ఆయన గిరిజనుల నుంచి ఎన్నికైన తొలి అధ్యక్షుడు. ఆయన హయాంలో పేదరికం 45నుంచి 25శాతానికి తగ్గిపోయింది. అనేక సామాజికాభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. గనులనూ, వనరులనూ ప్రభుత్వరంగంలోకి తెచ్చి, విద్యనూ వైద్యాన్నీ సార్వత్రికం చేశారు. సహజవాయువును జాతీయం చేయగా సమకూరిన సొమ్మును దారిద్య్రనిర్మూలనకు ఉపయోగించారు. రానున్న విద్యుత్‌ బ్యాటరీల యుగంలో అత్యంత కీలకమైన లిథియం వనరును కార్పొరేట్‌ కంపెనీలు తన్నుకుపోడానికి ఆయన అనుమతించలేదు. కార్మికోద్యమ నేతగా, మూలవాసుల నాయకుడిగా, ప్రజాసంక్షేమ సారథిగా దశాబ్దంన్నరపాటు దేశాన్ని ఏలిన మొరేల్స్‌ తన పాలనలో దేశాన్ని సామాజిక, ఆర్థికాభివృద్ధికి మంచి నమూనాగా తీర్చిదిద్దాడు. గ్రామీణ పేదలు, కార్మికులు, భూమిపుత్రులు మొరేల్స్‌ విధానాలకు మద్దతుగా నిలిచారు. పట్టణ ప్రాంతాలలోని ఉన్నతవర్గం, శ్వేతజాతీయులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా మారారు. వీరికి విదేశీ కార్పొరేట్‌ సంస్థల వెన్నుదన్ను ఉంది. లాటిన్‌ అమెరికా దేశాలలో వనరులపై కన్నేసిన అమెరికా-యూరోపియన్‌ కంపెనీలే ఇక్కడ సంక్షోభాన్ని పెంచి పెద్దచేయడంలో కీలక పాత్ర వహించాయి. దాదాపు దశాబ్దంన్నరగా బొలీవియాను పాలిస్తున్న మొరేల్స్‌ అక్టోబరులో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఉన్నతవర్గాలకు చెందిన ప్రతిపక్షం గోలపెట్టింది. అంతర్జాతీయ బృందాలు దీనికి వంతపాడాయి. తిరిగి ఎన్నికలు జరిపించడానికి తాను సిద్ధమేనని మొరేల్స్‌ ప్రకటించినా.. మొరేల్స్‌ పోటీ చేయకూడదంటూ షరతు పెట్టడంతో ఆయన అంగీకరించలేదు. దీన్ని సాకుగా చేసుకొని సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారు. చిలీ ప్రజలు ఏ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారో వాటినే బొలీవియాపై రుద్దేందుకు ఈ సైనిక కుట్ర జరిగింది. చిలీలో అలెండీ ఏ విధానాలను అమలు చేసినందుకు అమెరికా హత్య చేయించిందో, అవే కారణాలతో బొలీవియా మొరేల్స్‌ను సైనిక కుట్రతో అమెరికా అధికారం నుంచి దించేసింది. ఇప్పుడు చిలీ ప్రజల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్నీ, సంక్షేమాన్నీ పరిరక్షించుకొనేందుకు బొలీవియన్లు ఉద్యమిస్తారని, అమెరికా కుట్రలు, కుతంత్రాల మెడలు వంచుతారని ఆశిద్దాం.

9, నవంబర్ 2019, శనివారం

అయోధ్య తీర్పు: రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదం కేసు మొత్తం కథ ఇదీ



Ayodhya Verdict: Ram Janmabhoomi-Babri Masjid land dispute case
అయోధ్యలోని ‘రామ జన్మభూమిబాబ్రీ మసీదు స్థల వివాదం’ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వివాదానికి ఈ రోజు ముగింపు పడుతుందని అంతా భావిస్తున్నారు. రాజకీయంగామతపరంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పు వెలువడిన తరువాత దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

ఇంతకీ ఏమిటీ వివాదం?

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులుముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో కొందరు మసీదును కూల్చడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి.
ఆ తరువాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తూ వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ్ లల్లాసున్నీ వక్ఫ్ బోర్డునిర్మొహీ అఖాడాలకు సమానంగా పంచాలని చెప్పింది.
దీనిపై హిందువులుముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేయటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పును సస్పెండ్ చేసింది.
అప్పటి నుంచి ఈ కేసును విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఆగస్టు 6 నుంచి తుది వాదనలు విన్నది.

కేసు పూర్వాపరాలు ఇవీ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అయోధ్యలో రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలం ఇది. ఇక్కడే బాబ్రీ మసీదు కూడా ఉండేది. ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించిన వివాదం ఇది. ఇక్కడ బాబ్రీ మసీదును నిర్మించడానికి ముందు అక్కడున్న ఆలయాన్ని కూల్చారన్నది ఒక వాదన. బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ధ్వంసం చేశారు. ఆ తరువాతే ఈ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. అక్కడ 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకురెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకుమూడో భాగం నిర్మోహి అఖాడాకు చెదుతుందని తీర్పు చెప్పారు.

హిందూముస్లింల వాదనలేంటి?

బాబ్రీ మసీదు నిర్మించిన స్థలం రాముడి జన్మస్థలమని16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారన్నది హిందువుల వాదన. ఆ మసీదులో 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామనిఆ ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారన్నది ముస్లింల వాదన.

న్యాయమూర్తుల్లోనూ భిన్నాభిప్రాయం

అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని చెప్పారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ''ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా'' దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు.
అదే ధర్మాసనంలో ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని.. ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.

31, అక్టోబర్ 2019, గురువారం

ఇందిరాగాంధీనే పార్టీ నుంచి బహిష్కరించిన ఏపీ మాజీ సీఎం



ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి అదే తొలి ఓటమి. ఆ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నిలువునా చీలిపోయింది. ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. 1977 లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, పశ్చిమబెంగాల్‌కు చెందిన నేత సిద్ధార్థ శంకర్ రే పోటీ పడ్డారు. కాసునే విజయం వరించి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు చేశారాయన. ఆ క్రమంలో ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఇందిర తనవర్గంతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు.
దాంతో 1978 జనవరి 1న ఇందిరను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో వైబీ చవాన్, వసంత్ దాదా పాటిల్, స్వరణ్ సింగ్ వంటివారంతా బ్రహ్మానందరెడ్డి వెంట నిలిచారు. 'ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర' అన్న డీకే బారువా కూడా బ్రహ్మానందరెడ్డికే మద్దతు పలికారు. అయితే, ఇందిర వర్గం ఏమీ వెనక్కి తగ్గలేదు. వీసీ శుక్లా, బన్సీ లాల్, అంబికా సోనీ, కరణ్ సింగ్, డీకే బారువా వంటివారు తనతో లేకున్నా బూటా సింగ్, ఏపీ శర్మ, జీకే మూపనార్, బుద్ధప్రియ మౌర్య వంటి కొత్త అనుకూల వర్గంతో ఇందిర తన 'ఇందిరా కాంగ్రెస్' వైపు నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.బూటా సింగ్ కొందరు నేతలను వెంటబెట్టుకుని కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి వెళ్లి 'నెహ్రూ కుమార్తెనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తావా' అంటూ నిలదీశారు. ఆ సంగతి మళ్లీ ఇందిరకు చెప్పగా.. 'ఎంతైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అమర్యాదకరంగా మాట్లాడడం సరికాదు' అని బూటాసింగ్‌ను మందలించారని రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో పేర్కొన్నారు.
బహిష్కరణ మరునాడే అంటే జనవరి 2న ఇందిర గాంధీ కాంగ్రెస్(ఐ) అనే పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 153 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 66 మంది మద్దతు కూడా ఇందిరకు లభించలేదు.అంతేకాదు, ఆమె తన కొత్త పార్టీకి కొత్త ఆఫీసు కూడా వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీ గుర్తయిన 'ఆవు - దూడ' చిహ్నాన్ని కూడా ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అత్యధిక మంది మద్దతు తమకే ఉన్నందున 'ఆవు, దూడ' గుర్తు తమకే చెందాలంటూ కాంగ్రెస్(ఐ) తరఫున బూటా సింగ్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. కానీ, బ్రహ్మానందరెడ్డి వర్గం నుంచి అభ్యంతరాలు ఉండడం, ఆ గుర్తుకే తమకే చెందాలని వారు కూడా పట్టుపట్టడంతో ఎలక్షన్ కమిషన్ అప్పటికి ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా నిలిపివేసింది. మరోవైపు, ఇందిర వర్గం చీలిపోయిన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని 'రెడ్డి కాంగ్రెస్'గా పిలిచేవారు.  అటు రెడ్డి కాంగ్రెస్, ఇటు ఇందిరా కాంగ్రెస్ ఎవరికి వారు పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేశారు. బూటాసింగ్, ఏపీ శర్మ, మూపనార్ వంటి ఇందిర నమ్మకస్థులంతా ఆమెకు మద్దతుగా 700 మందికిపైగా ఉన్న ఏఐసీసీ సభ్యుల సంతకాలను సేకరించేందుకు దేశ వ్యాప్త యాత్ర మొదలుపెట్టారు. లఖ్‌నవూ, జైపూర్, పట్నా, భోపాల్, ముంబయి, జమ్ము, శ్రీనగర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, తిరువనంతపురం, బెంగళూరు సహా పలు ఇతర రాజధాని నగరాల్లో వారికి మంచి మద్దతు లభించింది.
కాంగ్రెస్ పార్టీ గుర్తు 'ఆవు, దూడ'ను ఎలక్షన్ కమిషన్ నిలిపివేయడంతో కాంగ్రెస్(ఐ)కి కొత్త గుర్తు ఎంచుకోమని సూచించింది ఎలక్షన్ కమిషన్. అప్పటికి ఇందిరాగాంధీ పీవీ నరసింహారావుతో కలిసి విజయవాడలో పర్యటిస్తున్నారు. గుర్తు ఎంచుకోమని ఎలక్షన్ కమిషన్ బూటా సింగ్ ముందు మూడు ఆప్షన్లు ఉంచింది.ఆ మూడు ఏనుగు, సైకిల్, హస్తం. అందులో హస్తం అయితే బాగుంటుందని భావించి ఇందిర ఆమోదం కోసం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీకి ట్రంక్ కాల్ చేస్తారు బూటాసింగ్. లైన్లన్నీ అస్పష్టంగా ఉన్నాయి.. బూటాసింగ్ చెబుతున్నది ఇందిరకు స్పష్టంగా వినిపించలేదు. ఆ సమయంలో ఎంతో గందరగోళం చోటుచేసుకుంది. బూటాసింగ్ హాత్(హస్తం) అని చెబుతుంటే.. ఇందిరకు అది హాథీ(ఏనుగు) అన్నట్లుగా వినిపించింది. దాంతో ఆమె వద్దని చెప్పారు. ఆ సంగతి అర్థం చేసుకున్న బూటాసింగ్... ఏనుగు కాదు హస్తం అని వివరిస్తున్నా ఫోన్ లైన్ అస్పష్టంగా ఉండడం, బూటాసింగ్ స్వరం కూడా బాగా బొంగురుగా ఉండడంతో ఇందిరకు ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆమె ఫోన్ రిసీవర్‌ను పక్కనే ఉన్న పీవీ నరసింహరావుకు ఇచ్చారు.బహు భాషా కోవిదుడైన పీవీకి వెంటనే విషయం అర్థమైంది. బూటా చెబుతున్నది అర్థం చేసుకున్న ఆయన హాథీ, హాత్ అనే పదాల మధ్య పోలిక వల్ల గందరగోళం తలెత్తిందని అర్థం చేసుకుని వెంటనే హస్తానికి ప్రత్యాయపదం సూచించి ఇందిరకు ఆ మాట చెప్పమంటారు. ''బూటా సింగ్‌జీ పంజా కహియే పంజా''(బూటాసింగ్ గారూ.. పంజా అని చెప్పండి పంజా) అని పీవీ సూచించడంతో ఇందిర వెంటనే రిసీవర్ అందుకుని ''ఆ గుర్తు బాగుంటుంది.. అదే ఖాయం చేయండి'' అని చెప్తారు. ఇలా కాంగ్రెస్(ఐ)కి హస్తం గుర్తు వచ్చిందని ఆనాటి పరిణామాలను రషీద్ కిద్వాయి తన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో రాసుకొచ్చారు.

హస్తం గుర్తు చాలామంది నేతలకు నచ్చలేదు. ట్రాఫిక్ పోలీస్‌ చేతిని చూపించినట్లుగా ఇదేం గుర్తన్న విమర్శలు వచ్చాయి. కానీ, ఇందిర మాత్రం ఈ కొత్త గుర్తుపై సంతోషించారట. అందుకు కారణం, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆవు, దూడ గుర్తును ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ‌లతో పోల్చి విపక్షాలు విమర్శలు కురిపించాయి.ఈ కొత్త గుర్తుతో ఆ బాధ తప్పిందని ఇందిర సంతోషించారట. ఇందిర గాంధీ కొత్త కాంగ్రెస్‌కు బలం చేకూరాక ఇక పార్టీ ఆఫీసు ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం పార్టీకి చెందిన వివిధ నేతల ఇళ్లను పరిశీలనలోకి తీసుకున్నారు. కానీ, ఏదీ అంత అనుకూలంగా కనిపించలేదు. 3 జనపథ్‌లో ఎం.చంద్రశేఖర్ ఇల్లు.. ఆ తరువాత పండిట్ కమలాపతి త్రిపాఠీ ఇల్లు పరిశీలించారు. కానీ, వివిధ కారణాల వల్ల వాటినీ వద్దనుకున్నారు. ఆ సమయంలో జి.వెంకటస్వామి నివసిస్తున్న 24 అక్బర్ రోడ్ ఇల్లు బూటాసింగ్ దృష్టికొచ్చింది. లోక్‌సభ ఎంపీగా ఉన్న వెంకటస్వామి అప్పటికి ఒంటరిగా అక్కడ నివసిస్తున్నారు. అప్పటికి అవివాహితుడైన వెంకటస్వామి ఇల్లు ఎంతోమంది యువజన కాంగ్రెస్ నేతలకు ఆశ్రయంగా ఉండేది. 10 జనపథ్‌‌లో అగ్రనేతలను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారందరికీ 24 అక్బర్ రోడ్‌లోని వెంకటస్వామి ఇల్లు అడ్డాగా ఉండేది.  అక్కడ 'ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఇందిర)' అనే బోర్డు ఏర్పాటు చేయడంతో వెంకటస్వామి ఇల్లు అలా కాంగ్రెస్(ఐ) కార్యాలయంగా మారిందని '24 అక్బర్ రోడ్' పుస్తకంలో కిద్వాయి రాసుకొచ్చారు.

1978లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగ్గా మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్(ఐ) మంచి విజయం సాధించింది. బ్రహ్మానందరెడ్డి వర్గం ప్రభావం చూపలేకపోయింది. దీంతో కొద్దికాలానికే కాసు బ్రహ్మానందరెడ్డి తన నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్(ఆర్)ను కాంగ్రెస్(ఐ)లో విలీనం చేశారు. అనంతరం ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 1980 లోక్‌సభ ఎన్నికల్లో 351 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాసు బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు 1964 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్: వన్ మ్యాన్ ఆర్మీ


పూర్తి పేరు: వల్లభ్‌భాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌
పుట్టిన తేదీ: 1875 అక్టోబరు 31
తల్లిదండ్రులు: లాడ్‌భాయి, జవేరీభాయ్‌.
జన్మస్థలం: నడియాద్‌, గుజరాత్‌
* 1893లో 18ఏళ్ల వయసులోనే జవేర్బాను పటేల్‌ పెళ్లి చేసుకున్నారు.
* 1901 నుంచి గోద్రా జిల్లా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
* 1903లో కుమార్తె మణిబెన్‌, 1905లో కుమారుడు దహ్యాభాయ్‌ జన్మించారు.
* 1910లో మిడిల్‌ టెంపుల్‌ వర్సిటీలో న్యాయవిద్య పై చదువులకు లండన్‌ వెళ్లారు.
* 1914లో క్రిమినల్‌ లాయరుగా అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు.
* 1915లో గుజరాత్‌ సభలో సభ్యుడిగా నియమితులయ్యారు. ముంబయిలో జరిగే భారత జాతీయ కాంగ్రెస్‌ సభలకు ప్రతినిధిగా ఎంపికయ్యారు.
* 1917 జనవరి 5న అహ్మదాబాద్‌ మున్సిపాలిటీలోని దరియాపూర్‌ వార్డు సభ్యుడిగా గెలిచారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం.ఈ ఎన్నికను కొందరు సవాలు చేయడంతో రద్దైంది. మే 14న మళ్లీ ఎన్నిక నిర్వహించగా తిరుగులేని విజయం సాధించారు.
* 1931లో భారత జాతీయ కాంగ్రెస్‌కు పోటీ ద్వారా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
* 1947లో దేశ విభజనపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పటేల్‌ విభజనకు అంగీకరించారు.
* 1950 డిసెంబరు 15న ముంబయిలో తుదిశ్వాస విడిచారు.
* 1991లో భారతరత్న వరించింది.


పట్టుదలకు మారుపేరు ఆయన.. అరువు తెచ్చుకున్న పుస్తకాలతో న్యాయవిద్య చదివి బారిస్టర్‌ ఎట్‌ లా పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన దీక్ష ఆయనది. ఎంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని, భోగభాగ్యాలను త్యజించి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగిన యోధుడాయన.  సమైక్య భారత నిర్మాతగా, సుపరిపాలన ప్రణాళికలకు ఆద్యుడిగా నిలిచిన ఆ నాయకుడే సర్దార్ వల్లభాయ్ పటేల్.

చిన్ననాటి నుంచి అదే పట్టుదల

ఉక్కుమనిషిగా గుర్తింపు పొందిన వల్లభాయ్ పటేల్‌ది దృఢ చిత్తం. ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించని తత్వం ఆయనది.   పట్టుదల, సంకల్పబలం వల్లభ్‌భాయ్‌కు చిన్ననాడే ఒంటబట్టాయి. న్యాయవాద విద్యలో బారిస్టర్‌ కావాలన్నది పటేల్‌ కల. అది నెరవేరాలంటే ఇంగ్లాండ్‌ వెళ్లి బారిస్టర్‌ ఎట్‌ లా చదవాలి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పటేల్‌కు ఆ ఖర్చును తట్టుకోవడం సాధ్యం కాని పని. కానీ ఆయన పట్టు వదల్లేదు. న్యాయవిద్య చదువుతున్న స్నేహితుడి దగ్గర పుస్తకాలు అరువు తెచ్చుకుని చదువుకున్నారు. నిత్యం కోర్టుకు వెళ్లి న్యాయవాదులు ఎలా వాదిస్తారో చూసి తెలుసుకున్నారు. అలా న్యాయ విద్యను అభ్యసించి గుజరాత్‌లోని గోద్రాలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

అన్న కోసం త్యాగం

బారిస్టర్‌ చదవడానికి సరిపడా డబ్బు సంపాదించారు. కానీ వెంటనే ఇంగ్లాండ్‌ వెళ్లిపోలేదు. బారిస్టర్‌ కావాలని కలలుగన్న తన అన్న విఠల్‌భాయ్‌ పటేల్‌ను ముందు ఇంగ్లాండ్‌ పంపించారు. ఆయన బారిస్టర్‌ చదువు పూర్తి చేసుకుని వచ్చాకే వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఇంగ్లాండ్‌ బయల్దేరారు. బారిస్టర్‌ ఎట్‌ లా పరీక్షలో ప్రథముడిగా నిలిచి తన కల నిజం చేసుకున్నారు.

గాంధీని కలిశాక మారిన దారి

ఎంతో ఇష్టపడి, చిన్ననాటి నుంచి లక్ష్యంగా పెట్టుకుని బారిస్టర్‌ చదివిన పటేల్‌ న్యాయవాద వృత్తిలో విశేషంగా రాణిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీని కలిశారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ సాగిస్తున్న అహింసాయుత పోరాటంతో స్ఫూర్తి పొందారు. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తానూ సంగ్రామంలోకి దూకారు.
మహిళలు ఇచ్చిన బిరుదు సర్దార్
1918లో బ్రిటిష్‌ ప్రభుత్వం గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో భూమిశిస్తును భారీగా పెంచింది. పన్ను తగ్గించేవరకు సహాయ నిరాకరణ చేయాలని గాంధీజీ ప్రజలకు సూచించారు. ఈ ఉద్యమాన్ని నడిపే బాధ్యతను పటేల్‌ భుజస్కంధాలపై పెట్టారు. రైతులను, ముఖ్యంగా రైతు మహిళలను ఏకం చేసి పటేల్‌ పోరాడారు. ‘ఈ ఉద్యమంలో మనకెన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆస్తులు జప్తు చేయొచ్చు. కానీ మనం వెనక్కి తగ్గొద్దు. మన పోరాటమే మనకు శ్రీరామరక్ష’ అని వారిలో ధైర్యం నూరిపోశారు. రైతుల సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్ధృతికి బ్రిటిష్‌ ప్రభుత్వం తలొగ్గింది. పన్నుల పెంపును రద్దు చేసింది. దీంతో ఉద్యమ సారథిగా పటేల్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అప్పుడే ఆ ప్రాంత మహిళలు సర్దార్‌ అని పటేల్‌కు బిరుదునిచ్చారు. అదే తర్వాత ఆయనకు ఇంటిపేరయింది. తర్వాత బర్దోలీ ఉద్యమాన్నీ పటేల్‌ ముందుండి నడిపారు.

దేశాన్ని ఏకం చేసిన ఘనుడు

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి సమయం దగ్గరపడిన కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ‘విభజించి పాలించు’ సిద్ధాంతంతో దేశాన్ని రెండు ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిందన్న ఆనందం అనుభవించకముందే విభజనతో భరతజాతిని నిలువునా చీల్చేసింది. కొందరు సంస్థానాదీశులు భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించలేదు. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి పెనుసవాలుగా నిలిచిన ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను ప్రధాని నెహ్రూ.. పటేల్‌కు అప్పగించారు. అప్పటికి పటేల్‌ వయసు 72 సంవత్సరాలు. అయినా ఆయన వయోభారాన్ని లెక్క చేయలేదు. సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేసేవరకు విశ్రమించలేదు. సంస్థానాధీశులను ఒప్పించారు. హైదరాబాద్‌ నిజాంలా మొండికెత్తిన వాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. మొత్తానికి భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా నిలిపారు.

అఖిల భారత సర్వీసులు ఆయన ఆలోచనే

దేశంలో అతిపెద్ద వర్గంగా ఉన్న రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి స్వాత్రంత్య్ర సంగ్రామంలో ముందుకు నడిపించారు పటేల్‌. విభిన్న కులాలు, మతాలు, వర్గాలను కూడగట్టి పోరాడారు. అయితే స్వరాజ్యం సాధించిన తర్వాత దేశం ముందు నిలిచిన మరో పెద్ద సవాలు.. సురాజ్య స్థాపన. అంటే సుపరిపాలన. విభిన్న కులాలు, మతాలు, వర్గాలు, జాతులుగా ఉన్న దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని పటేల్‌ బలంగా విశ్వసించారు. దేశ తొలి ఉపప్రధానిగా, హోం మంత్రిగా ఆ లక్ష్యసాధనలో త్రికరణశుద్ధిగా శ్రమించారు. పరిపాలనా సౌలభ్యం కోసం అఖిలభారత సర్వీసులు తేవాలన్న ఆలోచన పటేల్‌దే.

మంచి అడ్మినిస్ట్రేటర్

పోరాట యోధుడిగానే కాదు.. పరిపాలనా దక్షుడిగానూ భారతావని పటేల్‌ను వేనోళ్ల పొగుడుతుంది. కానీ పటేల్‌ ఉపప్రధాని కాకముందే.. అసలు స్వాతంత్రోద్యమంలోకి రాకముందే ఆయన పాలనాదక్షతను అహ్మదాబాద్‌ ప్రజలు కళ్లారా చూశారు. న్యాయవాద వృత్తిలో ఉండగానే 1917లో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అహ్మదాబాద్‌కు నగర శానిటేషన్‌ కమిషనర్‌గా పని చేశారు. పరిశుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. 1922, 1924, 1927ల్లో అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. నగరమంతటా విద్యుత్‌ సరఫరా, విద్యారంగంలో సంస్కరణలు ఇలా ఎన్నింటికో ఆయనే శ్రీకారం చుట్టారు.

24, అక్టోబర్ 2019, గురువారం

Dushyant Chautala: దుష్యంత్ చౌతాలా.. చిన్న వయసులోనే పెద్ద పదవులు అందుకున్న నేత




హరియాణాలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ మద్దతిస్తే సీఎం అయ్యే సూచనలున్నాయి.
దుష్యంత్ చౌతాలా మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడు. హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలాకు మనవడు. దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా. దుష్యంత్ బాబాయి అభయ్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ అధినేత. దుష్యంత్ కూడా ఇటీవల వరకు ఆ పార్టీలోనే ఉండేవారు. కొద్దికాలం కిందట ఆయన బాబాయితో విభేదించి బయటకు వచ్చేసి జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) పెట్టారు. తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేసి కింగ్ మేకర్‌గా ఎదిగారు.
1988 ఏప్రిల్ 3న జన్మించిన దుష్యంత్ చౌతాలా 26 ఏళ్ల వయసులో 2014లో లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. హిస్సార్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. 2018లో ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చి జేజేపీ ప్రారంభించారు.
దేవీలాల్ కుటుంబ వారసుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కొన్ని నెలల క్రితం నిలువునా చీలిపోయింది. ఇలా చీలిపోయిన దేవీలాల్ కుటుంబ సభ్యులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డారు. దుష్యంత్ కొత్త పార్టీ పెట్టడంతో ఒకప్పుడు హర్యానాలో ప్రబల శక్తిగా ఉన్న ఐఎన్‌ఎల్‌డీ బలం ఇప్పుడు గణనీయంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ ఇప్పుడు అనేక స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీని పక్కకు నెట్టి మూడో పక్షంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు దేవీలాల్ రాజకీయ వారసత్వ ప్రతినిధిగా జేజేపీ ఆవిర్భవించింది.
దుష్యంత్ తన ప్రసంగాలలో దేవీలాల్‌కు నిజమయిన రాజకీయ వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. దేవీలాల్ గురించి, ఆయన రాజకీయ విధానాల గురించి దుష్యంత్ మాట్లాడుతున్నారు. అయితే, ఆయన ఏ సభలోనూ తన తాత ఓంప్రకాశ్ చౌతాలా పేరును ప్రస్తావించలేదు. ఎందుకంటే, రాజకీయ వారసత్వ పోరులో ఓం ప్రకాశ్ చౌతాలా తన బాబాయి అభయ్ చౌతాలాకు మద్దతిచ్చారని దుష్యంత్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అదే సమయంలో దుష్యంత్ తన ప్రసంగాలలో ఎక్కడ కూడా వారిని విమర్శించడం లేదు. దేవీలాల్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసికెళ్లే క్రమంలో దుష్యంత్ జింద్ జిల్లాలోని ఉచన కలాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రేమలతతో తలపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలత.